అమరావతి : ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ప్రజలను కలవరపాటుకు గురి చేస్తుంది. గత జూన్ 26 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 కొవిడ్ కేసులు ( COVID Cases ) నమోదయ్యాయి. బాపట్ల( Bapatla ) జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ( Positive ) గా నిర్దారణ కావడంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఆసు పత్రిలో కరోనా కేసుల నిర్వహణకు అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. కరోనా సోకిన రోగులను ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించడానికి ప్రత్యేక కోవిడ్ వార్డును, రోగులను పరీక్షించడానికి ప్రత్యేకంగా కోవిడ్ అవుట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించారు.
కరోనా కేసులకు సంబంధించి ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 వేరియంట్ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఆర్ఎఫ్.5 కేసులు ఎక్కువగా సింగపూర్, ఆగ్నేయాసియా దేశాల్లో నమోదవుతున్నాయని వివరించారు.
ఇటీవల ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, కాని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వేరియంట్ లక్షణాల్లో.. ముఖ్యంగా గొంతునొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, ఒంటి నొప్పులు ఉంటాయంటున్నారు.