ఐఐటీలతో సహా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో హిందీ లేదా ప్రాంతీయ భాషలలో బోధన సాగించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సూచించడం తీవ్ర అభ్యంతరకరం. హిందీతో పాటు ప్రాంతీయ భాషలలో కూడా బోధించాలంటున్నాము కదా అని మోదీ పరివారం సమర్థించుకోవచ్చు. కానీ ఇది ప్రాంతీయ భాషల ప్రోత్సాహానికి ఉద్దేశించిన సూచన కాదు. మొదటి దశలో ఇంగ్లిష్కు స్థానం లేకుండా చేస్తే ఆ స్థానంలో హిందీ భాషను అతి సులభంగా ప్రవేశ పెట్టవచ్చుననే కుట్ర ఇందులో దాగి ఉన్నది. దక్షిణాది రాష్ర్టాల వారికి ఇంగ్లిష్లో పట్టు ఉన్నది. వారికి ఇదొక అనుకూలాంశం. అంతర్జాతీయ స్థాయిలో నెగ్గుకు రావడానికి ఉత్తరాదివారిలో ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పెంచుకోదలిస్తే దక్షిణాదివారికి అభ్యంతరాలు ఏమీ ఉండవు. కానీ ఇప్పటికే ఇంగ్లిష్ పాతుకొని పోయిన సమాజాలను ఆ భాషకు దూరం చేయాలనుకోవడం వల్ల్ల విద్యార్థులకు, ఉద్యోగార్థులకే కాదు దేశానికే తీవ్ర నష్టం జరుగుతుంది.
అధికార భాషా సంఘం పార్లమెంటరీ కమిటీ ఇటీవల రాష్ట్రపతికి సమర్పించిన దాదాపు 100 సిఫారసులతో కూడిన నివేదికలో ఇంకా అనేక అభ్యంతరకర సూచనలున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హిందీలో మాట్లాడకపోతే వారిని హెచ్చరించటమేగాక వారి వార్షిక పనితీరు మదింపు నివేదికలో దానిని నమోదు చేయాలని, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల లేఖలు, ఈమెయిళ్లు వంటివన్నీ హిందీలోనే ఉండాలని ఈ సంఘం సిఫారసు చేసినట్లుగా వెల్లడైంది. అమిత్ షా గతంలోనూ హిందీయేతర ప్రాంతాలపై హిందీని రుద్దాలనే విధంగా మాట్లాడినప్పుడు తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో వెనుకకు తగ్గవలసి వచ్చింది. కానీ ఏదో విధంగా హిందీని బలవంతంగా ప్రవేశ పెట్టాలనేదే మోదీ ప్రభుత్వ విధానంగా కనిపిస్తున్నది. ఈ విధానానికి అనుగుణంగానే కమిటీ సూచనలు ఉన్నాయనేది స్పష్టం.
రాజ్యాంగం హిందీని రాజభాషగా గుర్తించలేదన్న విషయాన్ని బీజేపీ, మోదీ సర్కారు గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం అధికారభాషలుగా పేర్కొన్న 22 భాషల్లో హిందీ ఒకటి. మన సువిశాల దేశానికి ఉన్న విస్తారమైన భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగకర్తలు ఈ ఏర్పాటు చేశారు. వారి దార్శనికత సరైనదేనని స్వతంత్ర చరిత్ర రుజువు చేస్తున్నది. ఎక్కడి కశ్మీరు, ఎక్కడి కన్యాకుమారి, ఎక్కడి నాగాలాండ్, ఎక్కడి గుజరాత్.. అన్నీ కలిసి ఒకే దేశంగా జీవిస్తున్నాయంటే అన్ని భాషా సంస్కృతులకు గౌరవం లభిస్తున్నదన్న అభిప్రాయం ఉండబట్టే కదా! హిందీ భాష ప్రవేశ పెట్టాలనుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో – హిందీని రుద్దబోమనీ, ఇంగ్లిష్ను నిరవధికంగా కొనసాగిస్తామని 1960 దశకంలో నాటి ప్రధాని నెహ్రూ దక్షిణాది వారికి హామీ ఇచ్చారు. కేంద్రం ఆ హామీకి కట్టుబడి ఉండాలి. భాష పేరిట విభేదాలను సృష్టించకూడదు.