పరాయి పాలనలో తెలంగాణ ప్రజలు ఉపాధిలేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారు. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనలో ఇతర రాష్ర్టాల నుంచి మన రాష్ర్టానికి వలసలు వస్తున్నారు. కారణం ఇక్కడ బతుకు దెరువు లభించడమే. వలసపోయిన తెలంగాణ బిడ్డలను మళ్లీ సొంత రాష్ర్టానికి చేర్చుతున్నాడు. ఇది కదా నాటి కాంగ్రెస్ పాలనకు, నేటి కేసీఆర్ పాలనకు మధ్య గల తేడా.
దేశాన్ని కాంగ్రెస్, బీజేపీలే ఎక్కువకాలం పాలించాయి. అయినా అభివృద్ధి ఎందుకు జరుగలేదో తెలంగాణ ప్రజలకు ఆ పార్టీలు సమాధానం చెప్పాలి. కేసీఆర్ పాలనలో ఇంకా గొప్పగా బతికే రోజులు మున్ముందు చూస్తామనే భరోసా రాష్ట్ర ప్రజల్లో ప్రబలంగా ఉన్నది.
ఉమ్మడి ఏపీలో అధికారులు 2013లో వెనుకబడ్డ జిల్లాలను, ప్రాంతాలను గుర్తించడం కోసం సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో తెలంగాణలో నాడున్న 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడినవేనని తేలింది. సర్వే సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. అంటే పాలకులు వారే, సర్వేలు చేసింది కూడా వారే. మరి వారి పాలనలో తెలంగాణ జిల్లాలు ఎందుకు వెనుకబడ్డాయి? అయినా మా పాలన గొప్పదని చెప్పుకోవటం సిగ్గుచేటు.
నాటి సీమాంధ్ర పాలనలో తెలంగాణలో నీళ్లకూ కరువు. భూగర్భజలాలు అడుగంటినయి. పచ్చదనం దెబ్బతిన్నది. వ్యవసాయానికి సాగు నీళ్లు, కరెంటు ఇవ్వలేని పరిస్థితి. కల్తీ విత్తనాలు. కల్తీ ఎరువులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరకొరగా పండిన పంట ను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు లేవు. పేరుకు ఉచితకరెంటే, కానీ అది ఎప్పుడూ ఉండదు. మీరిచ్చామని చెప్పుకొంటున్న కాలంలో ఇచ్చిన ఉచిత కరెంటు ఎంత? సాగైన వ్యవసాయం ఎంత? పండిన పంట ఎంతనో కాంగ్రెస్ పార్టీ బయటపెట్టాలి. ఇప్పుడు సాగైన విస్తీర్ణం ఎంత? పండిన పంట ఎంతనో లెక్కతీద్దాం. దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా?
నిజాలను వక్రీకరించి మేమేదో ఉద్ధరించాం, ఒరగపెట్టాం అంటూ అడ్డగోలుగా ఒర్రుడెందుకు? నాడు చెరువుల పరిస్థితి ఏమిటో తెలియంది ఎవరికి? వందలాది చెరువులు పూడుకుపోయాయి. ఆ చెరువులను పట్టించుకునే నాథుడు లేడు. ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన అంటే.
అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం మోటరు వేయడానికి పోతే పాముకాటు, విద్యుత్తు షాక్లతో ఎంతోమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారికి ఆర్థిక సాయం అందుడు మాట అటుంచితే కనీసం వారి కుటుంబాలను కూడా నాయకులు పరామర్శించింది లేదు. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇస్తున్నది. అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పంట పెట్టుబడి సహాయం, రైతన్నకు బీమా డబ్బులు కట్టి ఆ కుటుంబానికి 5 లక్షల భరోసా కల్పిస్తున్నది. మాది ఇందిరమ్మ పాలన అంటూ గొప్పలకు పోయే కాంగ్రెస్ పార్టీ నాయకులు నాడు రైతు కోసం ఇన్నిసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టలేకపోయారో ఒక్కరైనా సమాధానం చెప్తారా?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలన మరింత అధ్వాన్నం. నల్ల చట్టాలను ప్రవేశపెట్టి రైతులపై బలవంతంగా రుద్దాలని మొండిగా వ్యవహరించింది. దాన్ని వ్యతిరేకిస్తూ వేలాదిమంది రైతులు ఢిల్లీ రోడ్లమీద నెలల తరబడి ఆందోళనలు చేశారు. ఆ సమయంలో అనేకమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులపైకి కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీది. అంతేకాదు, రైతులంటే పడని బీజేపీ మోటర్లకు కరెంటు మీటర్లు బిగించాలని రాష్ర్టాల మీద ఒత్తిడి తెస్తున్నది నిజం కాదా?
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి నుంచి కేసీఆర్ పాలనలో ‘పండుగ’ చేసుకుంటున్న రైతుల మీద కక్షగట్టి 24 గంటల విద్యుత్తు వద్దు 3 గంటలే చాలని రైతులను భయపెడుతున్నది.
యావత్తు భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఎన్నో అవార్డులు అందుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాకపోయినా జరుగుతున్న అభివృద్ధి, నిస్వార్థ పాలనకు అవార్డులు ఇవ్వకతప్పని పరిస్థితి కేంద్ర ప్రభుత్వానిది. దీన్నిబట్టే ఎవరి పాలన గొప్పదో అర్థమవుతున్నది. ప్రజలు కూడా అన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నారు. వారిని మోసం చేయడానికి నోటికి ఏది వస్తే ఆది వాగుతం అంటే అబద్ధాలు నిజాలు కావనే విషయాన్ని ఆ రెండు పార్టీలు గుర్త్తెరగాలి. ఉమ్మడిపాలనలో రాని పెట్టుబడులు నేడు తెలంగాణకు వస్తున్నాయంటే కేసీఆర్ పాలన మీద ఉన్న నమ్మకం. చేతనైతే రెండు పార్టీలు వారి పాలనలో జరిగిన అభివృద్ధిపైనా ప్రజాక్షేత్రంలో చర్చ పెట్టాలి తప్ప, అడ్డ దిడ్డంగా అరవడం సరికాదు.
చిత్తశుద్ధి కలిగిన నాయకుడిగా, నిస్వార్థ పాలకుడిగా కేసీఆర్ పాలన ప్రతి గడపకు చేరింది. రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న పథకం అందని ఇల్లు లేదు. ఆ విధంగా ప్రజల మనసులో బీఆర్ఎస్ స్థానం సంపాదించుకున్నది. కాంగ్రెస్, బీజేపీలు దాన్ని చెరిపేసే ప్రయత్నాలు మానుకుంటే మంచిది. లేకుంటే ప్రజలే చరమగీతం పాడుతారు.
గోగుల రవీందర్ రెడ్డి
95022 52229