తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం. జనసేనకు 8 స్థానాలు కేటాయించేందుకు బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పొత్తు విషయాన్ని ధ్రువీకరించిన బీజేపీ సీనియర్ నాయకుడు కే లక్ష్మణ్.
(నవంబర్ 2)
తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని వైఎస్ షర్మిల నిర్ణయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు ప్రకటన.
(నవంబర్ 3)
హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ను కలిసిన ఆంధ్ర పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావు. చంద్రబాబు ఆదేశాల మేరకు రేవంత్ను కలిసినట్టు కొలికపూడి ప్రకటన. రేవంత్కే తమ మద్దతు ఉంటుందని, కాంగ్రెస్ విజయం కోసం పనిచేస్తామని వెల్లడి.
(నవంబర్ 3)
తెలంగాణలో ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఆ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్కు మద్దతునివ్వాలని క్యాడర్కు ముఖ్యనేత అంతర్గత సందేశం ఇచ్చారు.
(నవంబర్ 1)
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని వ్యతిరేకించి.. ఈ ప్రాంత ప్రయోజనాలకు అడ్డంపడ్డవారంతా మళ్లీ ఒక్కటవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఒక్కటై ముఠాకట్టి తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. అమరావతి పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరి, ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో తెలంగాణ ప్రగతిని, ప్రఖ్యాతిని అభాసుపాలు చేసేలా.. తెలంగాణ రాష్ట్ర ఉనికినే అస్థిరపరిచే కుట్రలకు తెరలేచింది. ఇది ఒక్కరో.. ఇద్దరో చేస్తున్నది కాదు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పచ్చిగా వ్యతిరేకించినవారందరూ ఇప్పుడు మరోసారి విరుచుకుపడేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రజల్లారా తస్మాత్ జాగ్రత్త.
‘గారడి చేస్తుండ్రు.. గడబిడ చేస్తుండ్రు.. బేమానీ నాయకులు.. బాజారున దూకిండ్రు.. బాగోతం ఆడిండ్రు’ అని తెలంగాణ ఉద్యమ సమయంలో ఓ సినిమా పాట ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల తీరును చూస్తుంటే మళ్లీ ఒకసారి ఆ పాట గుర్తుకువస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేక కాంబినేషన్లు ఒక్కటవుతున్నాయి. ఒకవైపు తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. దొర ఎవ్వడో.. దొంగ ఎవ్వడో తేల్చుకునే సమయం రానే వచ్చింది. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ ఒక్కొక్కరి రంగు బయటపడుతున్నది. ఎన్నికల పోలింగ్కు సరిగ్గా మరో 26 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ దశలో రాష్ట్ర రాజకీయ చిత్రంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. అయితే, ఇవేమీ అనూహ్యమైన మార్పులేమీ కావు.
తెలంగాణ ప్రజలకు సుపరిచితమైన మార్పులే. బాగా ఊహించిన మార్పులే. తెలంగాణ అస్తిత్వాన్ని వ్యతిరేకించి.. ఈ ప్రాంత ప్రయోజనాలకు అడ్డంపడ్డవారంతా మళ్లీ ఒక్కటవుతున్నారు. గారడి చేస్తుండ్రు.. గడబిడ చేస్తుండ్రు.. ప్రజలను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు. తెలంగాణ ప్రగతిని, ప్రఖ్యాతిని అభాసుపాలు చేసేలా.. తెలంగాణ రాష్ట్ర ఉనికినే అస్థిరపరిచే కుట్రలకు తెరలేచింది. ఇది ఒక్కరో.. ఇద్దరో చేస్తున్నది కాదు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పచ్చిగా వ్యతిరేకించినవారందరూ ఇప్పుడు మరోసారి విరుచుకుపడేందుకు సిద్దమయ్యారు. రంగులు మార్చిన తోడేళ్లు అదను కోసం ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ మరుక్షణం నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ వారికి సాధ్యం కాలేదు. అలా అని ఊరుకోలేదు. అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలో కుట్రలకు యత్నించారు. కడుపులో కత్తులు పెట్టుకొని పెదవులపై నవ్వులు పులుముకున్నవారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణను తమ విషకౌగిలిలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
భేతాళమాంత్రికులు వచ్చేశారు..: రాష్ట్రంలో బీఆర్ఎస్ను, ముఖ్యమంత్రి కేసీఆర్ను నిలువరించేందుకు భేతాళమాంత్రికులు కాంగ్రెస్, బీజేపీలను ఎంచుకొన్నారు. కాంగ్రెస్, బీజేపీల రూపంలో తెలంగాణలో ప్రవేశించేందుకు కుట్రలకు తెరలేపారు. నాడు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులన్నీ ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి పోలింగ్ తేదీ దగ్గరపడటంతో ముసుగు తొడుక్కొని వస్తున్నాయి. కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం సాధ్యం కాక దిక్కులు చూస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు రంగులు మార్చుకొని వస్తున్న తెలంగాణ వ్యతిరేకశక్తులు కామధేనువుల్లా కనిపిస్తున్నాయి.
తెలంగాణ ఏర్పడితే ‘వీసా’ తీసుకొని వెళ్లాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేత, ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కూతురు, రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రులు హైదరాబాద్లో ఉండాలంటే ‘పాకిస్థాన్’లో ఉన్నట్టు ఉంటుందని వ్యాఖ్యానించిన రాజశేఖర్రెడ్డి కూతురు షర్మిల.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తాను తీవ్ర కలత చెందానని చెప్పిన షర్మిల తర్వాత కాలంలో ప్రత్యేక రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీని స్థాపించిన విషయం తెలిసిందే. తనను తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వదిలిన బాణంగా చెప్పుకున్న షర్మిల.. తనను తాను తెలంగాణ ఆడబిడ్డ అని చెప్పుకొంటూ తెలంగాణ ఉద్యమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్పై అడ్డగోలుగా మాట్లాడారు. అంతేకాదు.. తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోతున్నట్టు కూడా ఆమె ప్రకటించారు. ఏడాదికి పైగా పాదయాత్రలు, సభల పేరుతో రకరకాల విన్యాసాలు చేశారు.
తెలంగాణ మీద బురదజల్లేందుకు విశ్వప్రయత్నం చేశారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఆడబిడ్డలు, రైతులు.. ఇలా అనేక వర్గాలను ప్రభుత్వంపై, అధికార పార్టీపై ఎగదోసే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ జెండా పీకేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీతో అనేక రోజులపాటు చర్చలు జరిపి చివరికి అధికారికంగా ఇప్పుడు తాము పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటామని ఆమె తన కార్యకర్తలకు తేల్చిచెప్పారు. ఆమె లక్ష్యాలేమిటో అందరికీ బహిరంగ రహస్యమే. ఆమె తెలంగాణ ప్రాంత, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందా? అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న.
ఒక్క షర్మిల పార్టీనే కాదు.. 2014, 2018 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసి, తమది జాతీయ పార్టీ అని చెప్పుకొన్న టీడీపీ కూడా ఈసారి వైఎస్ఆర్టీపీ మాదిరిగానే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నది. అంతేకాదు, ఆ పార్టీ హైకమాండ్ లోపాయికారిగా కాంగ్రెస్ పార్టీకి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్కు అనుకూలంగా ప్రచారం చేయాలని కూడా సంకేతాలిచ్చింది. ఆంధ్ర పరిరక్షణ సమితి పేరుతో పనిచేస్తున్న చంద్రబాబు మనిషి కొలికపూడి శ్రీనివాస్ శుక్రవారమే రేవంత్తో భేటీ అయి చంద్రబాబు ఆదేశాల మేరకే తాను కలిశానని, రేవంత్కే తమ మద్దతు ఉంటుందని, కాంగ్రెస్కు పనిచేస్తామని చెప్పాడు.
ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే తమకు అంతిమమని చెప్తున్న కొలికపూడితో రేవంత్ భేటీ కావడం, మద్దతు తీసుకోవడం అనేక అనుమానాలకు తావిచ్చేలా ఉన్నది. మరోవైపు రేవంత్ తీరు ఆదినుంచి వివాదాస్పదమే. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కుపెట్టాడు. ఉద్యమం బూటకమన్నట్టు చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా మాట్లాడాడు. రైఫిల్ పట్టుకొని తెలంగాణవాదులపై దాడికి ప్రయత్నించిన రేవంత్ ఇప్పుడు చంద్రబాబు ఆదేశాల మేరకే పనిచేస్తున్నాడన్న అసంతృప్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్లలోనే ఉండటం గమనార్హం.
జనసేన కుట్రల పొత్తు: తెలంగాణను వ్యతిరేకిస్తున్న శక్తులు ఎలా ఏకమవుతున్నాయో చెప్పేందుకు మరో పెద్ద ఉదాహరణ జనసేన-బీజేపీ పొత్తు. జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి పనిచేస్తున్నాడు. అక్కడ వారితో పొత్తు పెట్టుకున్నాడు. తెలంగాణకు వచ్చేసరికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. జనసేనకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేకపోవడంతో తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేకపోయాడు. లేకపోతే నేరుగా కాంగ్రెస్తోనే కలిసేవాడేమో. తెలంగాణలో జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కూడా ముమ్మాటికీ తెలంగాణలో పాగా వేసేందుకు వేసిన ఎత్తుగడగానే చెప్తున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తన మనసు బాధపడిందని, 11 రోజులపాటు తాను నిద్రాహారాలు మానేశానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని పార్టీ తెలంగాణలో పోటీ చేయడంలో ఆంతర్యమేంటని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్- బీజేపీ మధ్య ఓ అండర్స్టాండింగ్!: తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్-బీజేపీల మధ్య ఓ అండర్స్టాండింగ్ ఉన్నట్టు అర్థమవుతున్నది. సీట్లను, అభ్యర్థులను ఇచ్చిపుచ్చుకొంటున్నట్టు సామాన్య జనానికి కూడా తెలిసిపోతున్నది. హుజూరాబాద్, మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహకరించిందో.. ఇప్పుడు కూడా వ్యూహాత్మకంగా రెండు పార్టీలు అభ్యర్థులను నిలిపాయి. అనేకచోట్ల వీరి బంధం బయటపడుతున్నది. ఉదాహరణగా చెప్పాలంటే గద్వాలకు చెందిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈసారి అసెంబ్లీకి అసలు పోటీ చేయడం లేదు.
ఇక్కడ ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకరించాలని నిర్ణయించినట్టు ఆమె వర్గీయులే చెప్తున్నారు. అంబర్పేటలో స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తాను పోటీ చేయబోనని చెప్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని పెట్టబోతున్నది. సిర్పూర్ కాగజ్నగర్లో కాంగ్రెస్, బీజేపీలు బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్కు సహకరించాలని లోపాయికారి నిర్ణయానికి వచ్చాయి. ఇలా పదుల నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య మైత్రి ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. మొత్తంగా చూస్తే పచ్చని తెలంగాణను మళ్లీ ఆగం జేసేందుకు నాటి వ్యతిరేకశక్తులన్నీ చేతులు కలుపుతున్నాయని తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా లేకుంటే తెలంగాణ వ్యతిరేకశక్తుల కుట్రలకు బలి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.