భూ రికార్డుల పర్యవేక్షణ, రిజిస్ట్రేషన్లు, యాజమాన్య హక్కుల కల్పన, భూ భద్రత విషయంలో, రైతు సాధికారత అందిస్తున్న ధరణి ఒక విప్లవం. పెను మార్పునకు నాంది. 2020 నవంబర్ 2న దేశ చరిత్రలోనే ఒక విప్లవం ధరణి పుట్టినరోజు. రైతును రాజుగా చేసి నిజమైన హక్కుదారునికి ధీమా కల్పించిన రోజు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీద ప్రజల సమక్షంలో పురుడు పోసుకున్నది. నేటికి దాదాపు 30 నెలల కాలంలో సుమారు 25 లక్షల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అంటే సుమారుగా కరోనా, ఇతర సెలవు రోజులను తొలగిస్తే నెలకు లక్ష లావాదేవీలు జరిగాయి. అంటే ఇది ఎంత పెద్ద విప్లవమో. సామాన్య ప్రజలకు, రైతులకు ఎంత సులువుగా, ఎంత నమ్మకంగా, ఎంత జవాబుదారీగా, ఎంత పారదర్శకంగా ఈ పనులు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక రైతు బాంధవుడైన పాలకుడికి ఇంతకుమించిన గొప్ప సంతృప్తి ఏముంటుంది? ‘ధరణి’ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక.
ఒకటి మాత్రం నిజం. ధరణి వల్ల రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, భూ కబ్జాకోరులకు, దొంగ రికార్డులు సృష్టించి భూములను దౌర్జన్యంగా హస్తగతం చేసుకునేవారికీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులైన కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులకు మాత్రమే గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. వారి దోపిడీకి, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసినట్టయింది. అందుకే కొంతమంది భూ కబ్జాకోరులైన రాజకీయ నాయకులు ధరణిపై బురద జల్లే ప్రయత్నం చేస్తుండ్రు. ఇలాంటి చిల్లర రాజకీయాలతో రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి.
ప్రతిపక్షానికి చెందిన కొంతమంది నాయ కులు చెప్పినట్టు ఇప్పటివరకు ధరణి ద్వా రా రూ.50 వేల కోట్ల లావాదేవీలు జరిగాయంటున్న మాటల్లో నిజమున్నట్లయితే, ప్రజలకు ఈ ధరణి మీద నమ్మకం కుదిరినట్టు కాదా? భూమి హక్కులపై నమ్మకంతోనే కదా అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేది. ఆ నమ్మకాన్ని కలిగించింది, అన్నదాతలో విశ్వాసాన్ని పెంచిం ది కేసీఆర్ కాదా! నేడు రైతుల చేతిలో డిజిటల్ పాస్బుక్ ఉన్నది. రైతు భూమి యాజమాన్య హక్కు రైతు చేతిలో ఉన్నట్టే. దేశంలో ఇంత పకడ్బందీగా భూమి యాజమాన్య హక్కు ఎక్కడా లేదు. పక్క రాష్ర్టాల్లో భూ యాజమాన్య హక్కు పత్రం రావాలంటే నెల నుంచి ఏడాదికాలం పడుతున్న సందర్భాలున్నాయి.
ప్రపంచబ్యాంకు నివేదికల ప్రకారం… పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్లో మూడింట రెండు వంతుల కేసులు భూమి తగాదాలుంటున్నాయి. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘నీతి ఆయోగ్’ సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం.. ఒక్కో భూ తగాదా కోర్టుల్లో తెగాలంటే రమారమి 20 ఏండ్లు పడుతున్నది. ఇన్ని సమస్యలకు సమాధానమే కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి. ధరణి తర్వాత తెలంగాణలో భూ తగాదాల కేసులు లేవు. ధరణికి ముందు, సర్వసాధారణంగా మారిన భూ తగాదాలు ప్రజల మధ్య వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు, కుటుంబ కలహాలు, ఆఖరికి హత్యలకు కారణభూతాలైనవి. ఇలాంటి సర్వరోగాలకు జిందాతిలిస్మాత్ లాంటి మందును మన ముఖ్యమంత్రి కేసీఆర్ కనుగొన్నారు. ఈ భూమికి ఆత్మగౌరవం, స్వయంపాలన, సర్వ హక్కులు కావాలని పోరాడిన యోధుడు ఆయన. సాధించుకున్న మన తెలంగాణలో రైతు పరాయి బతుకు బతుకుతుంటే కేసీఆర్ గుండె తరుక్కుపోయింది. నెలల తరబడి ఆలోచించారు, భూ నిష్ణాతులతో రోజుల తరబడి చర్చలు జరిపారు. నిరక్షరాస్యులైన రైతులకు తన భూమిపైన నమ్మకం ఉండేలా రికార్డులు ఉండాలి. తన చేతిలోనే హక్కుండాలి, తన భూమిపై తనకే యాజమాన్య హక్కుం డాలి. ఇది ఏ రెవెన్యూ అధికారి చేతిలోనో, ఇంకా పట్వారీ చేతిలోనో ఉంటే తన పరిస్థితులు పరాధీనమవుతాయన్న రైతు ఆవేదనను అర్థం చేసుకున్న కేసీఆర్ ఒక అద్భుత పథకానికి, ఒక సాంకేతిక విప్లవానికి, ఒక గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టారు. అదే ధరణి.
ఇక రిజిస్ట్రేషన్ల వ్యవహారమైతే దేశ చరిత్రలోనే ఒక విప్లవం. పూర్తి పారదర్శకంగా ఇద్దరి ఆమోదంతో అరగంటలో పూర్తయ్యే ఒక అధునాతన ప్రక్రియ. సమ యం, ఆర్థికంగా నష్టాలు జరగకుండా జరిగిపోయే ఒక అద్భుత ప్రక్రియ ఇది. దీంతోనే రైతుల్లో నమ్మకాలు పెరిగాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో ఒక విప్లవం వచ్చింది. 2014లో వ్యవసాయ రిజిస్ట్రేషన్లలో 3.52 లక్షల లావాదేవీలు జరిగి రూ.520 కోట్ల ఆదాయం వస్తే అదే 2022 నాటికి అవ్వి నాలుగింతలయ్యాయి. 2020లో రూ.683 కోట్ల వ్యవసాయ రిజిస్ట్రేషన్ల ఆదాయం వస్తే, 2021 నాటికి అది రూ.1746 కోట్ల ఆదాయంతో 154 శాతం అదనంగా వచ్చింది. అలాగే 2022లో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 2022లో 7.4 లక్షల వ్యవసాయ రిజిస్ట్రేషన్ల లావాదేవీలు జరగగా రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చిందంటే ధరణి ఎంత గొప్పగా రైతులకు సేవలందిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. గతంలో వ్యవసాయ, వ్యాపార లావాదేవీలు అన్నీ ఒక్క రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే జరిగేవి, దాంతో రైతులు వారి రిజిస్ట్రేషన్ల కోసం చాలా రోజులు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో రైతులకు చాలా సులువైంది. ఇంతటి గొప్ప మార్పులను వ్యవసాయ పక్షపాతులు కచ్చితంగా ఆహ్వానించాలి. ఈ మార్పు రైతుల పాలిట వరం లాంటిది.
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఎప్పటికప్పుడు అత్యంత ప్రాధాన్యంతో రైతులకు భూ యజమానులకు సంబంధించిన సమస్యలు ఏ మాత్రం జాప్యం లేకుండా పరిష్కరించాలని నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక కొత్త విధానం వచ్చినపుడు ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగడం ఆనవాయితీ. అంతేకానీ ఒక కుట్రపూరిత వ్యాపార పరమైన ఆలోచనతో, స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ధరణి రద్దు చేస్తామని, బంగాళా ఖాతంలో కలిపేస్తామనడం ఏ విధానం? రాజ్యాంగం రాసిన తర్వాత వందల సార్లు సవరణలు చేసుకొని అమలు చేసుకుంటున్నాం. అంటే వీళ్ల ఆలోచనల ప్రకారం సవరణలు చేస్తున్న రాజ్యాంగం కూడా పనికిరానిదే అనా?
రైతుకు భూ భద్రత, ఆత్మగౌరవం, విశ్వాసం కల్పించిన ధరణి కలకాలం ఉండాలి. ధరణిని రద్దుచేయడం అంటే రైతును బానిసగా మార్చడమే. సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే భూ రికార్డుల ప్రక్షాళన జరగాలి. భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయాలనీ అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు చెప్పాయి. ఆ ఆలోచనల నేపథ్యంలో వచ్చిన ధరణిని వ్యతిరేకించడం పచ్చి అనాగరికమన్న విషయం సదరు నాయకులు తెలుసుకోవాలని, స్వార్థ రాజకీయాల కోసం, ప్రజల అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి.
(వ్యాసకర్త: భారత రాష్ట్ర సమితి నాయకులు)
-డాక్టర్ శ్రవణ్ దాసోజు
98850 39384