నాగరికత అభివృద్ధిలో కీలకమైనవి సంచార జాతులు. కానీ ఆ జాతుల ప్రజల జీవన ప్రమాణాలను ఇప్పటి వరకు దేశాన్నేలిన పార్టీలు ఏనాడూ పట్టించుకొన్న పాపాన పోలేదు. దీంతో దశాబ్దాలుగా చేయని నేరాలకు నేరగాళ్ల ముద్రను భరిస్తున్న ఆ జాతులు అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నాయి.
కానీ తెలంగాణ లో మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు మేమున్నామంటూ ముందుకొచ్చి వారి అభ్యున్నతికి శ్రీకారం చుట్టింది. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసి శాశ్వత నివాసాన్ని కల్పిస్తున్నది. వారి వ్యాపారాలకు ఆర్థిక సాయాన్ని అందించి స్వయం ఉపాధికి బాటలు పరుస్తున్నది.
సంచార జాతుల అభ్యున్నతి కోసం కేంద్ర సామాజిక న్యాయ శాఖ అనేక కమిటీలు వేసి అనేక అధ్యయనాలు చేసింది. ఎన్నో కమిషన్లు సంచార జాతుల దయనీయ జీవితాల్లో కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాలు వెలుగులు నింపాలని నివేదికలిచ్చాయి. కానీ వీటిని ఇప్పటివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏనాడూ అమలు చేయలేదు. రాజ్యాంగంలోనూ వీరికి సరైన రక్షణలు కల్పించలేదు. దేశంలోని సంచార జాతుల జీవన స్థితిగతులపై సమగ్రంగా చర్చించి వారి అభ్యున్నతికి చేపట్టాల్సిన చర్యల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
కొన్ని దశాబ్దాల క్రితం సంచార జాతులు రాజులకు గూఢచారులుగా ఉంటూ రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి కాపాడేవారు. బ్రిటిష్ పరిపాలనలో చేపట్టిన జనాభా లెక్కల ప్రకారం సైనిక శిక్షణ పొందిన సంచార కులాలు దాదాపు 500 ఉన్నట్లుగా తెలుస్తున్నది. వీరిని పూర్తిగా నాశనం చేయకుండా భారతదేశం మొత్తాన్ని ఆక్రమించి పరిపాలించడం అసాధ్యమని గ్రహించిన బ్రిటీషర్లు నేరాలను అదుపు చేయాలనే సాకు చూపించి క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ -871 చట్టం తీసుకొచ్చి ఆయా కులాల్లో పుట్టిన వారందరినీ “బార్న్ కిమినల్స్”గా ముద్ర వేసి కనిపించిన వారందరినీ జైళ్లలో పెట్టారు. ఈ చర్యలతో ఈ జాతుల వారు సంచార జీవితాలు గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ అమానుష చర్యను సాహూ మహారాజ్ తన రాజ్యంలో రద్దు చేశారు. అయితే ఇండియన్ పీనల్ కోడ్ 1860, పోలీస్ యాక్ట్ 1851, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, స్థానిక చట్టాల్లో సంచార జాతుల వారిపై బ్రిటీషర్లు దొంగలనే ముద్ర వేశారు. దీంతో ఈ జాతుల ప్రజలు కులాల పేర్లు చెప్పుకోకుండా సంచార జీవనం చేస్తూ కుటుంబ పోషణ కొరకు కళలు, పురాణాల ప్రదర్శన, నాటు మందులు తయారీ చేస్తూ జీవించారు. ఊర్ల బయట గుడిసెలు వేసుకుని పరదేశీలుగా పరిచయం చేసుకుని గంగిరెద్దుల, జంగం, కాటిపాపల, మేదరి, పంబాల, పెద్దమ్మల వాళ్లు, ముత్యాలమ్మల వాళ్లు, మందుల, కూనపులి, పటా, రాజన్నల, గోతాల, వీరముష్టి, పూసల, దాసరి తదితర కులాలతో కలిసి మెలిసి సంచార జీవనం గడుపుతున్నారు. వీరంతా ఇప్పటికీ ప్రత్యేకమైన లిపి లేని భాష మాట్లాడుతారు.
ఇలా దుర్భర జీవితాలు గడుపుతున్న సంచా ర జాతుల గురించి భారత జాతీయ కాంగ్రెస్ గానీ, మహాత్మా గాంధీ గానీ, స్వరాజ్యపార్టీ గానీ ఏనాడూ పట్టించుకోలేదు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ జాతు లు, కులాల ప్రజలకు స్వేచ్ఛ లభించలేదు. 1949 లో అనంతశయనం అయ్యంగార్ చైర్మన్గా ఉన్న కమిటీ సంచార జాతుల స్థితిగతులపై అధ్యయనం చేసి సంచార జాతులపై బ్రిటీష్ కాలం నాటి చట్టాన్ని రద్దు చేయాలని సూచించింది. సంచార జాతుల స్థిర నివాసానికి, పునరావాసానికి, సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర పభుత్వాలు 50+50 శాతం బడ్జెట్ను 10 సంవత్సరాల పాటు కేటాయించాలని సూచించింది.
సంచార, అర్ధ సంచార, విముక్త జాతులను 1952 ఆగస్టు 31న డీ నోటిఫైడ్ ట్రైబ్స్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని కమిషన్లు సంచార, అర్ధ సంచార జాతులకు విద్యా, ఉద్యోగ నియమాకాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించాయి. కానీ నేటివరకు ఏ కేంద్ర ప్రభుత్వమూ కమిషన్లు, కమిటీలు చేసిన సిఫారసులను అమలు చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1968లో అనంతరామన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల ప్రకా రం గతంలో ఉన్న ఈడీఎన్టీ, ఎస్టీ,ఎస్,ఎన్,టీ కులాల ధ్రవీకరణ పత్రాలు రద్దు చేసి కొందరు జాతుల వారిని బీసీల్లో కలిపి ఏబీసీడీలుగా వర్గీకరించారు. కొన్ని అభివృద్ధి చెందిన కులాలను బీసీ -ఏలో చేర్చడం వల్ల ఈ సంచార జాతులు బీసీ-ఏలో ఉన్న రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నారు. ఎస్సీ, ఎస్టీల్లో అణగారిన వర్గాల వర్గీకరణ లేకపోవడం వల్ల ఆ అభివృద్ధి ఫలాలు కూడా వీరికి అందడం లేదు. మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారం 1993 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలవుతున్న 27 శాతం రిజర్వేషన్ల ఫలితాలను కూడా వర్గీకరణ లేకపోవడం వల్ల సంచార జాతులు అందుకోలేకపోతున్నాయి. స్థానిక సంస్థల్లోని 33శాతం రిజర్వేషన్లలో ఇదే సమస్య. 2002లో ఏర్పాటు చేసిన జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ డీఎన్టీ, ఎన్టీ, ఎస్, ఎన్, టీల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. దీనిపై 2008లో బాలకృష్ణ రేణుకే కమిషన్ తన నివేదికలో 72 ప్రతిపాదనలు చేసినా దాన్నీ పార్లమెంట్లో చర్చించకుండా అటకెక్కించారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం నియమించిన బిక్కురామ్ ఇదాటే కమిషన్ నివేదిక పైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. సంచార జాతులకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన బీజేపీ ఆ తర్వాత తన హామీని విస్మరించింది.
డీఎన్టీ సమస్యలు, చట్టాలు కేంద్రం పరిధిలో ఉంటాయి. కానీ స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు గడిచినా కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వాలు సంచార జాతులకు ఇసుమంతైనా న్యాయం చేయలేదు. పైసా కూడా నిధులివ్వలేదు.
తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నేడు సంచారజాతులు సగర్వంగా తలెత్తుకుని బతుకు తున్నాయి. సంచార జాతుల వృత్తులను పరిరక్షించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చిరు వ్యాపా రులకు ఆర్థిక చేయూతను అందిస్తున్నది. ఇటీవలే కొన్ని అనాథ కులాలను గుర్తించి బీసీ-ఏలో చేర్చింది. గుర్తింపు లేని మరో 21 కులాలను గుర్తించి సర్టిఫికెట్లు జారీ చేసింది.
సంచార జాతులు ఆత్మ గౌరవంతో బతకాలని ఉప్పల్భగాయత్లో ఆత్మగౌరవభవనం నిర్మిస్తున్నది. చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూంలు కేటాయిస్తూ వారి సంచార జీవనానికి స్థిర నివాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నది. పూసల, బాలసంత, మందెచ్చల తదితర సంచార కులాలు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు ఎంబీసీ కార్పొరేషన్ నుంచి రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తున్నది. తాజాగా బీసీలకు చేస్తున్న రూ.లక్ష సాయం పథకంలో సంచార జాతులవారికి ప్రాధాన్యమిచ్చింది. సంచార జాతులు, కులాల వారికి రాజకీయాల్లో ఎదిగే అవకాశం కల్పిస్తే బాగుంటుంది. వారి జీవితాలను మరింత మెరుగుపరచడానికి ప్రత్యేక కార్పొరేషన్ గానీ, కమిషన్ గానీ నియమించాల్సిన అవసరం ఉన్నది. సంచార జాతులన్నింటినీ ఎంబీసీ జాబితాలో చేర్చి ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయిస్తే ఈ జాతుల ప్రజలు విద్యావంతులై తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటారు.
(వ్యాసకర్త: డీఎన్టీ, ఎంబీసీ జాతీయ కన్వీనర్)