ఏప్రిల్, మే, జూన్లలో రాత్రిపూట విద్యుత్ కోతలను ఎదుర్కోవడానికి ప్రజలు సమాయత్తమవ్వాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, గ్రిడ్ ఇండియాలు అన్యాపదేశంగా దేశ ప్రజలను హెచ్చరిస్తున్నాయి.
గత వేసవి కాలంలో తెలంగాణ మినహాయించి దేశ ప్రజలందరూ అలవి కాని విద్యుత్తు కోతలతో సతమతమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో కూడా వ్యవసాయ, గృహ వినియోగదారులే కాకుండా పారిశ్రామిక వినియోగదారులు కూడా ‘పవర్ హాలిడే’ల బారిన పడ్డారు.
దేశ విద్యుదుత్పాదక సామర్థ్యం 400 గిగావాట్ల పైబడి ఉన్నప్పటికీ గతేడాది ఏప్రిల్లో 217 గిగావాట్ల పీక్ డిమాండ్ను కూడా తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. పగటిపూట అందుబాటులో ఉన్న సోలార్ ప్లాంట్ల చలవతో గట్టెక్కుతున్నా రాత్రిపూట డిమాండ్కు వచ్చేసరికి ‘బేస్ సామర్థ్యం’ అయినటువంటి థర్మల్ పవర్ప్లాంట్ల నిర్వహణకు అవసరమైన బొగ్గును అందుబాటులో ఉంచడంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు విఫలమవుతున్నాయి. మరోరకంగా చెప్పాలంటే ఉద్దేశపూర్వకంగానే బొగ్గు నిల్వలు అందుబాటులో లేకుండా చేసి, విదేశీ బొగ్గును విధిగా వాడాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు అవగతమవుతున్నది.
ప్రస్తుత వేసవికాలంలో డిమాండ్, సరఫరాల మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడి ప్రజలు కరెంటు కోతలతో తల్లడిల్లిపోయే అవకాశం ఉన్నది. గతేడాది ఏప్రిల్ నెలలో 217 గిగావాట్ల డిమాండ్ నమోదు కాగా, ఈ ఏడాది 6.4 శాతం వృద్ధి రేటుతో 239 గిగావాట్లుగా రికార్డు డిమాండ్ నమోదయ్యే అవకాశం ఉన్నది. ఏప్రిల్ 2022లో 1,42, 097 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరుగగా ఈ ఏప్రిల్లో లక్షా యాభై వేల మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ అవసరాలు ఏర్పడవ చ్చు. గత ఐదేండ్లలో థర్మల్ విద్యుత్ 9 శాతమే పెరుగుదల నమోదు కావడంతో డిమాండ్, సరఫరా తీరు అస్తవ్యస్తమైంది. వేసవి డిమాండ్ను తట్టుకోవడానికి, దేశీయబొగ్గు కొరతను అధిగమించడానికి ఇటీవల కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ 6 శాతం విదేశీ బొగ్గును విధిగా వాడాల్సిందేనని ఉత్తర్వులు జారీచేసినట్లుగా తెలుస్తున్నది.
అదే సమయంలో కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ పీక్ డిమాండ్ సమయాల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరుపుకోవడానికి యూనిట్ ధరపై ఉన్న సీలింగ్ను ఎత్తేసి రూ.50 వరకు అనుమతించింది. గత వేసవిలో యూనిట్ ధరను రూ.20 గరిష్ఠ ధరగా నిర్ణయించిన కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ (సీఈఆర్సీ) ఈ ఏడాది రూ.50గా అనుమతించడం అత్యంత వివాదాస్పద నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అధిక ధరకు ఉత్పత్తయ్యే గ్యాస్, విదేశీ బొగ్గు ఆధారిత, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేసే సంస్థలకు గిట్టుబాటు ధర లభించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిబ్రవరి 16న వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసాధారణ రీతిలో రూ.50లకు యూనిట్ కొనుగోలు చేసిన డిస్కంలు ఎంత రేటుకు అమ్ముకోవాలో ఆలోచించాల్సిన విషయం.
ఈ నేపథ్యంలో మార్చి 9న కేంద్ర విద్యుత్శాఖమంత్రి ‘హై ప్రైస్ డే అహెడ్’ మార్కెట్ పోర్టల్ను ఆవిష్కరించారు. ఈ పోర్టల్ ద్వారా పీక్ డిమాండ్ వేళల్లో రూ.50 వరకు కరెంటును కొనుక్కోవచ్చు. యూనిట్ గరిష్ఠ ధర రూ.50గా నిర్ణయించినప్పటికీ తక్కువ ధరకే విద్యుత్ను అందించడానికి కృషిచేస్తామని, ఎలాంటి అక్రమాలకు తావివ్వబోమని పోర్టల్ ఆవిష్కరణ సందర్భంగా ఆ మంత్రి సెలవిచ్చారు. ఏప్రిల్ 1న కేంద్రీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సుమోటోగా యూనిట్ విద్యుత్ ధరను రూ.50 నుంచి తిరిగి రూ.20కి కుదిస్తున్నట్టు సవరిస్తూ ఆదేశాలను జారీచేసింది.
ఇదిలా ఉంటే మార్చి 25న కేంద్ర విద్యుత్ శాఖ ‘టైం ఆఫ్ డే’ పేరిట కొత్త టారిఫ్ విధానం ప్రతిపాదన ముసాయిదాను విడుదల చేస్తూ రాష్ర్టాల అభిప్రాయాలను కోరింది. ఈ విధానం ప్రకారం గరిష్ఠ డిమాండ్ సమయాల్లో అంటే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, అదే విధంగా సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు వాడుకునే విద్యుత్కు 20 శాతం అదనంగా వినియోగదారుల నుంచి వసూలు చేయాలని ప్రతిపాదించింది. పై సమయాల్లో విద్యుత్ను వాడుకునే పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు 20 శాతం అదనంగా ఇతరవర్గాల వినియోగదారులకు 10 శాతం ఎక్కువగా వసూలు చేయనునన్నారు. అందుకోసం ఏప్రిల్ 2024లోగా పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు ఏప్రిల్ 2025లోగా మిగతా వినియోగదారులకు ప్రీ పెయిడ్, స్మార్ట్ మీటర్లను బిగించే ప్రక్రియను పూర్తిచేయాలంటూ నిర్దేశిస్తున్నారు.
2025 ఏప్రిల్లోగా అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్/ స్మార్ట్ మీటర్లు బిగించడం, థర్మల్ పవర్ ప్లాంట్లు విధిగా 10 శాతం మేర విదేశీ బొగ్గును వాడాలనడం, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజీ ద్వారా పీక్ సమయాల్లో కొనుగోలయ్యే విద్యుత్ గరిష్ఠ పరిమితిని ఏకంగా రూ.12 నుంచి రూ.20లకు పెంచడం లాంటి కేంద్రం చేపట్టిన చర్య లు ప్రైవేట్ పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే దిశ గా ఉన్నాయని చెప్పవచ్చు. గతేడాది వేసవి విద్యుత్ కోతల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అయినా కేంద్రం నష్ట నివారణకు తగిన చర్యలు తీసుకోకపోవడం యాదృచ్ఛికం కాదేమో?
దేశంలో 4,04,8 67 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంలో 2,36,468 మెగావాట్లు థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి లభిస్తున్నది. కేంద్ర అధీనంలోని ఎన్టీపీసీ తదితర ప్రభుత్వరంగ సంస్థలు 75,378 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వాల జెన్కో సంస్థలు 75,179 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అదానీ, రిలయెన్స్, టాటా తదితర ప్రైవేటు పెట్టుబడిదారుల అధీనంలో 85,911 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి.
ఏప్రిల్, మే, జూన్లలో రాత్రిపూట విద్యుత్ కోతలను ఎదుర్కోవడానికి ప్రజలు సమాయత్తమవ్వాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, గ్రిడ్ ఇండియాలు అన్యాపదేశంగా దేశ ప్రజలను హెచ్చరిస్తున్నాయి. రాత్రిపూట సౌర విద్యుత్ అందుబాటులో ఉండకపోవడం ఉత్పత్తి రంగంలో కీలకమైన ‘బేస్ లోడ్’గా పరిగణించే బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పాదనకు అవసరమైన చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టకపోవడం, ప్రభుత్వరంగంలో ఉన్న థర్మల్ కేంద్రాలకు అవసరమైన దేశీయబొగ్గును సమకూర్చకపోవడం ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు. 16,800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణ దశలో ఉన్న 26 థర్మల్ పవర్ ప్లాంట్లను వినియోగంలోకి తేవడంలో అలవికాని నిర్లక్ష్య ధోరణి పరిస్థితి తీవ్రతకు మరో కారణం.
(వ్యాసకర్త: అధ్యక్షులు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, టీఎస్ఎస్పీడీసీఎల్)
-తుల్జారాంసింగ్ ఠాకూర్
78930 05313