2024, జనవరి 4న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కేంద్ర జల్శక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలిశారు. వాళ్లు సదరు మంత్రిని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరినట్టు పలు పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. అయితే కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ‘దేశంలోని ఏ ప్రాజెక్టుకు ఇప్పుడు జాతీయ హోదా ఇవ్వడం లేదు. కానీ, ఏదేని పథకం కింద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దాని అంచనాలో 60 శాతం నిధులు ఇస్తామని షెకావత్ హామీ ఇచ్చారు’ అని ప్రకటించడం విడ్డూరం.
మన్మోహన్ నేతృత్వంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో కూడా కృష్ణా నదిపైన నిర్మించేటువంటి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశానికి చట్టబద్ధత కల్పిస్తే బాగుండేది. కానీ యూపీఏ ప్రభుత్వం అలా చేయలేదు. ఆ నిర్ణయం తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది. నాడు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తే, రాష్ట్రంలో గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు నేటికీ రాష్ట్ర ప్రజలను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. వాళ్లు ఎంపీలుగా గెలిచి ఐదేండ్లు పూర్తికావస్తున్నా రాష్ర్టానికి నిధులు తీసుకురావడం పక్కనపెడితే కనీసం ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయహోదా తీసుకురాలేకపోయారు.
2014లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అప్పటివరకు ఉన్నటువంటి ఏఐబీపీ, ఆర్ఆర్ఆర్ వంటి పథకాలను ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై)గా మార్చింది. పీఎంకేఎస్వై పథకం కింద చిన్న చిన్న నీటి పారుదల ప్రాజెక్టులు, డైవర్షన్ కెనాల్స్, ఫీల్డ్ చానెళ్లు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలను నిర్మించేందుకు రాష్ర్టాలకు కేంద్రం నిధులు అందిస్తున్నది. అదేవిధంగా రైతులకు డ్రిపులు, స్ప్రింక్లర్లు, రెయిన్గన్నులు ఏర్పాటు చేసుకోవడానికి ఈ పథకం ద్వారా సాయం చేస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం 60 శాతం నిధులు ఇస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే పీఎంకేఎస్వై పరిధిలో అంత పెద్ద మొత్తంలో నిధులు ఉండవనేది జగమెరిగిన సత్యం.
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటన చూసిన తర్వాత నేను ఒక్కసారిగా పదేండ్లు వెనక్కి వెళ్లాను. పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటాల అనంతరం 2014లో తెలంగాణ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నేరవేరింది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నాతో పాటు ఎంతోమంది ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి దిశగా పరిగెత్తించేందుకు తమ వంతు కృషిచేశారు. తత్ఫలితంగానే రాష్ర్టాన్ని పాలించమని తెలంగాణ ప్రజలు రెండోసారి కేసీఆర్ నాయకత్వానికి పట్టం కట్టారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్నిరంగాల్లో అగ్రపథంలో నిలబెట్టారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే కేసీఆర్ నేతృత్వంలో జరిగిన రాష్ర్టాభివృద్ధికి నిదర్శనం. అయితే ఇప్పుడు ప్రాజెక్టులు-వాటి జాతీయ హోదా విషయమై చర్చిద్దాం.
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లలో దేశంలో ఇప్పటివరకు మంజూరైన జాతీయ ప్రాజెక్టులు 17. అందులో పంజాబ్, హిమాచల్ప్రదేశ్, జమ్మూకశ్మీర్, అరుణాచల్ప్రదేశ్ రాష్ర్టాల్లో రెండేసి జాతీయ ప్రాజెక్టులు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఏపీ, అసోం, కర్ణాటక రాష్ర్టాల్లో ఒక్కో జాతీయ ప్రాజెక్టు మంజూరైంది. హిమాచల్/ ఉత్తరాఖండ్ రాష్ర్టాలకు ఒక ఉమ్మడి జాతీయ ప్రాజెక్టు మంజూరైంది. దేశంలో 28 రాష్ర్టాలుంటే 11 రాష్ర్టాల్లో మాత్రమే జాతీయ ప్రాజెక్టులున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మొదలు అప్పటి కేంద్ర జలవనరుల శాఖమంత్రులు ఉమాభారతి, నితిన్ గడ్కరీ, గజేంద్ర షెకావత్ దాకా రాష్ట్రంలోని ఏదేని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చాలాసార్లు విన్నవించుకున్నాం. సాగునీటి పారుదల శాఖ అధికారులతో కలసి అనేకసార్లు లేఖలు రాశాం. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మోదీకి ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. అయినా మా విన్నపాలను కేంద్ర ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు. ఒక్క తెలంగాణకే కాదు దేశంలోని అన్ని రాష్ర్టాల్లోని ఏదేని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని పోరాటం చేసిన ఘనత ఉద్యమ నాయకుడైన కేసీఆర్ది.
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి పలు పథకాలను రూపొందించింది. పరాయి పాలనలో జరిగిన అన్యాయాన్ని సవరించడానికి అప్పటి ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. కేసీఆర్ నేతృత్వంలో నాతో పాటు అప్పటి ఎంపీలందరం కలిసి కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన వాటా కోసం పార్లమెంటులో పెద్ద ఎత్తున పోరాటం చేశాం. చాలాసార్లు పార్లమెంటును సాగకుండా చేసిన సందర్భాలున్నాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం 2014 తర్వాత ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని చెప్పుకొంటూనే ఎన్నికలు వచ్చిన రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తూ లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. 2021లో ఉత్తరప్రదేశ్లోని సరయూనహర్ ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదా కల్పించింది. అనంతరం 2022లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా యోగి సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. యూపీలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి అధికారంలోకి వచ్చిన బీజేపీ కర్ణాటకలోనూ అదే ఫార్ములాను పాటించింది. అందులో భాగంగానే కర్ణాటకలోని అప్పర్భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తున్నట్టు ప్రకటించి ఎన్నికలకు పోయింది. అయితే ఇక్కడ బీజేపీ బొక్కబోర్లా పడ్డది. అయినప్పటికీ తాజాగా జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో ఇదే ఫార్ములాను బీజేపీ మరోసారి నమ్ముకున్నది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాలకు లబ్ధి చేకూరేవిధంగా ‘ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్’ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి ఎన్నికల బరిలో దిగింది. తత్ఫలితంగా బీజేపీ ఆయా రాష్ర్టాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్నది.
ఇదిలా ఉంటే.. 2024 జనవరి 4న విలేకరుల సమావేశంలో అసలు విషయం బయటపడింది. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ‘దేశంలోని ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం’ లేదని చెప్పినప్పుడు ఒక విలేకరి కర్ణాటక ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. కర్ణాటక ప్రాజెక్టుకు ప్రకటించిన జాతీయ హోదాను వెనక్కితీసుకున్నామని ఆ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్… సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిల సమక్షంలో ప్రకటించడం విడ్డూరం. అయితే దీనివెనుక ఉన్న మతలబు ఏమంటే… కర్ణాటకలో బీజేపీ ఓటమికి ప్రతీకారంగానే అక్కడి ప్రాజెక్టుకు జాతీయ హోదా రద్దు చేశారని స్పష్టమవుతున్నది.
కాంగ్రెస్ నాయకులకు గానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గానీ నేను చెప్పొచ్చేదేమంటే… తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం ఇకనైనా ఆపండి. రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేదాన్క కాంగ్రెస్ నాయకులు పోరాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. 2014లో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని తీసుకువచ్చింది. నాడు గోదావరి నదిపై నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తుందని చెప్పింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం నాడే ఆ ప్రాజెక్టు జాతీయ హోదాకు సంబంధించి చట్టబద్ధత కల్పించింది. అందుకే ఇప్పటికీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు నిధులు సమకూర్చుతున్నది. నిధులు సమకూర్చాలి కూడా. ఎందుకంటే పార్లమెంటు సాక్షిగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించింది కాబట్టి. నాడే మన్మోహన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో కూడా కృష్ణా నదిపైన నిర్మించేటువంటి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశానికి చట్టబద్ధత కల్పిస్తే బాగుండేది. కానీ యూపీఏ ప్రభుత్వం అలా చేయలేదు. ఆ నిర్ణయం తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది. నాడు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తే, రాష్ట్రంలో గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు నేటికీ రాష్ట్ర ప్రజలను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. వాళ్లు ఎంపీలుగా గెలిచి ఐదేండ్లు పూర్తికావస్తున్నా రాష్ర్టానికి నిధులు తీసుకురావడం పక్కనపెడితే కనీసం ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయహోదా తీసుకురాలేకపోయారు. ఇప్పటికైనా కృష్ణా నదిపై నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా.
‘కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం’
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం… పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాం. భవిష్యత్తులో మరే ఇతర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చేది లేదు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదు.
– 2018, ఆగస్టు 10న అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
‘పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం’
2014 నుంచి దేశంలోని ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదు. అందుకే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదు.
– 2024, జనవరి 04న కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్
-బోయినపల్లి వినోద్కుమార్
(పార్లమెంటు మాజీ సభ్యులు, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు)