ప్రాణమైనా విడుస్తా కానీ, బీజేపీతో పొత్తు పెట్టుకోను. బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యు) నేత నితీశ్ కుమార్ ‘నాకు రాష్ట్రపతి పదవి లేదా ప్రధాని పదవి ఇచ్చినా బీజేపీలో చేరను. నా మృతదేహం కూడా బీజేపీలో చేరదు’.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రముఖుడు సిద్ధరామయ్య
నితీశ్ కుమార్, సిద్ధరామయ్య – ఇరువురూ కాకలు తీరిన రాజకీయ నాయకులు, పరిపాలనా దక్షులు. ఏడుపదులు దాటిన ఈ ఇరువురు యోధులకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. తమ రాష్ర్టాలలో బలమైన పునాది ఉన్నది.
రాజకీయ వర్గాలే కాదు, సమాజంలోనూ బీజేపీ అంటే వ్యతిరేకత నెలకొన్నది. మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు అర్థమయ్యాయి. బీజేపీ మత రాజకీయాలంటే ప్రజలకు నచ్చడం లేదు. మోదీ జాతీయ స్థాయిలో మీడియాను పూర్తిగా తన పట్టులోకి తెచ్చుకున్నారు. పూర్వం మాదిరిగా మోదీ పరివారం డబ్బు కుమ్మరించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ప్రజలను నమ్మించే పరిస్థితి ఇప్పుడు లేదు.
ఈ రాజకీయ ఉద్ధండులు ఇంత కఠినంగా మాట్లాడారంటే, రాజకీయ వర్గాలలో బీజేపీ పట్ల ఎంత ఏహ్యత ఉన్నదో తెలుస్తున్నది. వీరి మాటల్లో కాఠిన్యం, అంతకు మించిన ఆక్రోశం ధ్వనిస్తున్నది. బీజేపీ అంటే రాజకీయ వర్గాలలో నెలకొన్న అభిప్రాయమిది. కానీ అందరూ ఇంత కఠినంగా వ్యక్తం చేయరు. ప్రతిసారి చేయకపోవచ్చు. కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు ఇంతగా ప్రచారం పొందక పోవచ్చు. అయినా బీజేపీ పేరు చెబితేనే కంపరం పుట్టినట్టు భావించే పరిస్థితి రాజకీయ రంగంలో ఉన్న మాట వాస్తవం.
బీజేపీ దేశవ్యాప్తంగా నయవంచనతో మిత్రపక్షాలనే దెబ్బకొట్టడం మొదలుపెట్టింది. బీజేపీ మొదట మంచి మాటతో ఒక్కో రాష్ట్రంలో మిత్రపక్షాలను ఏర్పరచుకుంటుంది. మాయోపాయంతో ఆ పార్టీ పునాదులను దెబ్బకొట్టి మింగి వేస్తుంది. ఈ విష రాజకీయాలను గ్రహించి మిత్రపక్షం శత్రుపక్షంగా మారిపోతుంది. బీజేపీ దెబ్బకు బలహీనపడవచ్చు, నామరూపాలు లేకుండా పోవచ్చు, తట్టుకొని నిలబడవచ్చు. ఆయా పక్షాలను బట్టి ఉంటుంది. మహారాష్ట్రలో శివసేన పరిస్థితి తెలిసిందే. జనతాదళ్ (యూ) కూడా ఇదే విధంగా దూరమైంది. పంజాబ్లో అకాలీదళ్ కూడా ఇప్పుడు ఎన్డీఏలో లేదు. పీడీపీ, ఎల్జేపీ (పాశ్వాన్ పార్టీ), జెఎంఎం మొదలైన రాజకీయ పక్షాలన్నీ ఒకప్పుడు ఎన్డీయేలో భాగం. కానీ ఇప్పుడవన్నీ బీజేపీకి దూరమయ్యాయి.
ఇతర పార్టీలలోనే కాదు, బీజేపీలోనే అనేక మంది నాయకులు ఇప్పుడు ఆ పార్టీ తీరును, నాయకత్వ ధోరణిని జీర్ణించుకోలేక పోతున్నారు. కొందరు మౌనంగా లోలోపలే కుమిలిపోతుంటే, మరికొందరు బయటకు మాట్లాడుతున్నారు. కొందరు పుట్టి పెరిగిన పార్టీని వీడలేక పార్టీలో పడి ఉంటున్నారు. ఇంకొందరు బయట పడి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. మానవ సంబంధాలలో వాడుకుని పడేయడం మంచిది కాదు. రాజకీయం అంటే అధికారం పొందడమే అయిపోయింది అంటూ బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పార్టీ నాయకత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. ఉమాభారతి అంటే దేశంలో తెలియని వారుండరు. అటువంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న ఉమా భారతికి కూడా బీజేపీ నాయకత్వంతో పొసగడం లేదు. జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ బీజేపీలో ఇమడ లేక కాంగ్రెస్లో చేరవలసి వచ్చింది. ప్రవీణ్ తొగాడియాకు కూడా బీజేపీ నాయకత్వంతో సత్సంబంధాలు లేవు. ఇది వాజపేయి కాలం నాటి, విలువలు ఉన్న పార్టీయేనా అని సందేహం వ్యక్తమవుతున్నది.
రాజకీయ వర్గాలే కాదు, సమాజంలోనూ బీజేపీ అంటే వ్యతిరేకత నెలకొన్నది. మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు అర్థమయ్యాయి. బీజేపీ మత రాజకీయాలంటే ప్రజలకు నచ్చడం లేదు. అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో బీజేపీ వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తున్నది. మోదీ జాతీయ స్థాయిలో మీడియాను పూర్తిగా తన పట్టులోకి తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తమ అభిప్రాయాలు ఉవ్వెత్తున వ్యక్తం చేస్తున్నారు. పూర్వం మాదిరిగా మోదీ పరివారం డబ్బు కుమ్మరించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ప్రజలను నమ్మించే పరిస్థితి ఇప్పుడు లేదు.
మోదీ పరివారం అనుసరిస్తున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా కవులు, కళాకారులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు తమ గళం వినిపిస్తూనే ఉన్నారు. కొద్దికాలం కిందట 230 మంది రచయితలు, 800 మంది నాటకరంగ, సినీ ప్రముఖులు, వంద మంది లలిత కళల ప్రముఖులు విద్వేష రాజకీయాలను తిరస్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రముఖులలో గిరిశ్ కర్నాడ్, నసీరుద్దీన్ షా, అమోల్ పాలేకర్, అనురాగ్ కాశ్యప్, కొంకణ సేన్ శర్మ తదితరులు ఉన్నారు. రొమిలా థాపర్ వంటి ప్రముఖ చరిత్రకారిణి కూడా ఈ విజ్ఞప్తి చేసిన వారిలో ఉన్నారు.
బీజేపీ పాలనలో దేశం ఏ విధంగా దిగజారిపోయిందో అంతర్జాతీయ అధ్యయనాలలో వెల్లడైంది. ఈ అధ్యయనాల వివరాలను గుజరాత్ పాత్రికేయుడు ఆకార్ పటేల్ స్పష్టంగా ‘ప్రైస్ ఆఫ్ ది మోదీ ఇయర్స్’ అనే తన పుస్తకంలో వివరించారు. మోదీ పాలనలో దేశం ఎలా దిగజారిపోయిందీ, బీజేపీ అట్టడుగు వర్గాల వ్యతిరేక స్వభావం కలదనే విషయాన్ని క్రిష్టోఫ్ జెఫర్లెట్ అనే విదేశీ ప్రముఖుడు ‘మోదీస్ ఇండియాః హిందు నేషనలిజం అండ్ ది రైజ్ ఆఫ్ ఎథ్నిక్ డెమాక్రసీ’ అనే పుస్తకంలో వివరించారు. ఇటీవలి కాలంలో ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ గుజరాత్ మారణ కాండ మీద ‘ఇండియాః ది మోదీ క్వశ్చన్’ పేర ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. మోదీ తోడ్పాటుతో అదానీ అక్రమ వ్యాపార సామ్రాజ్యంపై అమెరికాలోని హిండెన్బర్గ్ అనే పరిశోధనా సంస్థ నివేదికను ప్రచురించింది.
ప్రజాస్వామ్యంలో అన్ని భావజాలాలు గల రాజకీయ పక్షాలుంటాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో పరస్పరం పోటీ పడుతూ ఉంటాయి. పరస్పరం ప్రత్యర్థులగా భావిస్తాయే తప్ప శత్రుభావన కలిగి ఉండవు. కానీ మోదీ అధికారానికి వచ్చిన తరువాత ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఇతర రాజకీయ పక్షాలను వేధిస్తున్నారు. బీజేపీయేతర రాజకీయ పక్షాలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోశారు. ఈ కొనుగోళ్ళ బండారాన్ని తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టి, దేశమంతా ప్రచారం చేసింది. మరోవైపు గవర్నర్లను నియోగించి ఇతర పార్టీలు అధికారంలో గల రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ ఇబ్బంది పెడుతున్నది. కేరళ, తమిళనాడు తదితర రాష్ర్టాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. రాష్ర్టాల హక్కులను హరిస్తూ సమాఖ్య తత్వానికి గండికొడుతున్నది. ఈ విషయంలో కేంద్రంలోని గత ప్రభుత్వాలే మేలు అనే విధమైన అభిప్రాయం ప్రజలకు ఏర్పడుతున్నది.
మార్కెట్ ఎకానమీలో భిన్న వ్యాపార సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. అంతే కానీ ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరించకూడదు. కానీ మోదీ ప్రభుత్వం అదానీ వంటి వ్యాపారులకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెడుతున్నది. అడ్డగోలుగా ఆస్తులను పెంచుకోవడానికి వీలుకల్పిస్తున్నది. ఇతర రాజకీయ పక్షాలకు చెందిన వ్యాపార వేత్తలను వేధిస్తున్నది. ఈ వేధింపులను భరించలేక కర్ణాటకలో ఒక వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భారీ ఎత్తున లంచాలు అడుగుతున్నారని కాంట్రాక్టర్లు బహిరంగంగా చెబుతున్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ, పన్నులు తగ్గిస్తూ, ఆ భారాన్ని పేద ప్రజలపై మోపుతున్నది. అవినీతి, అక్రమాలలో మోదీ ప్రభుత్వం అన్ని హద్దులను అతిక్రమించింది. కుట్రలు, కుతంత్రాల ద్వారా రాజకీయ పక్షం తన పాలనను స్థిరపరచుకోవడం జరగదు. విలువలు గల రాజకీయాలు నడిపితేనే దీర్ఘకాలం మనగలుగుతుంది. కానీ అధికారం పట్టుకొని వేళ్ళాడటానికి బీజేపీ అనుసరిస్తున్న కుటిల రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. బీజేపీ అంటేనే రాజకీయ వర్గాలలో కానీ, ప్రజలలో కానీ ఏహ్యత ఏర్పడింది.అందుకు ఈ ఇద్దరు సీనియర్ నేతల వ్యాఖ్యలే నిదర్శనం.