Employees | సంవత్సరాలు క్షణాల్లా గడిచిపోతున్నాయి. మరో కొత్త ఆర్థిక సంవత్సరం రానే వచ్చింది. వేతన జీవులు ట్యాక్స్ డిక్లరేషన్, రిటర్నులు ఫైల్ చేసే సమయం మళ్లీ వచ్చేసింది. కానీ, వేతన జీవులకు పాలకులు ఇస్తున్న హామీలను అమలు చేసే సమయం మాత్రం రావడం లేదు. మన దేశంలో కచ్చితంగా పన్ను కట్టేది వేతన జీవులు, సామాన్యులు, మధ్యతరగతి వారే. పన్నులు కడుతూ దేశాన్ని సాదుతున్నవారిని ఆదుకుంటామని, పన్నులు తగ్గిస్తామని, నల్లధనం వెలికితీసి పన్ను చెల్లింపుదారులకు బహుమతిగా ఇస్తామని మోదీ గతంలో ప్రకటించారు. అయితే పదేండ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న మోదీ.. ఆ దిశగా తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. పైగా ఈ పదేండ్లలో ఆయన పాలనలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులు భారీగా పెరగగా.. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనాలు మాత్రం తగ్గిపోయాయి.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు. రూ.2.5 లక్షల కనీస ఆదాయ స్లాబ్ను పెంచకుండానే కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. కొత్త పన్ను విధానంలో ఆదాయ పన్నుపై ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. వివిధ ప్రభుత్వ పథకాలలో పొదుపు చేయడాన్ని గత ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. దీని వల్ల ప్రభుత్వానికి, అలాగే పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. కానీ, కొత్త పన్ను విధానం వల్ల భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవాలనే ఆలోచన లేకుండాపోయే ప్రమాదం ఉన్నది. కొత్త పన్ను స్లాబ్లో మినహాయింపులు లేకపోవడంతో ఉద్యోగుల భవిష్యత్తు అవసరాలకు కనీస భద్రత లేకుండాపోయింది.
జీఎస్టీ రాకతో వ్యాపారులతో పాటు సామాన్యుల జీవితాలు కుదేలైపోయాయి. 2016కు ముందు ఒక ఇల్లు లేదా ఫ్లాట్ కొంటే దానిపై జీఎస్టీ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు జీఎస్టీ పేరిట అదనపు భారం పడింది. సగటున ఒక్కో ఫ్లాట్పై లక్షపైనే జీఎస్టీ కట్టాల్సి వస్తున్నది. ఇండ్ల ధరలు భారీగా పెరిగాయి. కొత్తగా వాటిపై కూడా జీఎస్టీ వేస్తున్నారు. అయినప్పటికీ ఇంటి రుణ వాయిదాలపై ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ.1.5 లక్షలను ఇప్పటివరకు పెంచలేదు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ పెంపు సహా ఎలాంటి మార్పులు లేవు. వైద్య ఖర్చులు పెరుగుతుండటంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు బీమా చేయించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే దానిపై 18 శాతం జీఎస్టీ విధించడం వల్ల సామాన్యులపై పెనుభారమే పడుతున్నది. ఎక్కువ మొత్తంలో బీమా కడితే 18 శాతం పన్ను వేసి, తక్కువ మొత్తం బీమాకు 5 శాతం పన్ను వేయాలనే ఆలోచన కూడా మోదీ ప్రభుత్వానికి కలగకపోవడం శోచనీయం. సంపన్నులను, పేదలను ఒకేగాటన కట్టేసి అందరిపై అధిక పన్నులు వసూలు చేయడం సరికాదు. ఏదైనా అనుకోని కారణాల రీత్యా ఆదాయపన్ను రిటర్నులు సమర్పించడం ఒక్కరోజు ఆలస్యమైనా రూ.5 వేలు అపరాధ రుసుము వసూలు చేయడం పాలకులకు తగునా?
పెట్రోల్, డీజిల్పై విపరీతంగా సుంకాలు పెంచి, రాష్ర్టాలకు ఆదాయంలో వాటా ఇవ్వకుండా సగటున లీటర్కు రూ.30 వరకు పెంచిన కేంద్రం.. ఈ పదేండ్లలో రూ.30 లక్షల కోట్లకు పైగా అదనపు ఆదాయాన్ని పొందింది. గతంతో పోలిస్తే ముడిచమురు ధరలు తగ్గినా ఇంధన ధరలను మోదీ సర్కార్ తగ్గించలేదు. పైగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రూ.2 తగ్గించి చేతులు దులుపుకొన్నది. కనీసం రూ.15-20 వరకు తగ్గించే ఆస్కారం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుల నడ్డి విరుగుతున్నది.
మోదీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ మూడేండ్లలోనే 60 శాతానికి పైగా పెరగడం గమనార్హం. గతంలో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.900కి చేరింది. మొన్నటి వరకు రూ.1100కు పైగా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఎన్నికల సమయం కావడంతో కాస్త తగ్గింది. జాతీయ రహదారులను నిర్మిస్తున్నామని గొప్పలకు పోతున్న కేంద్ర సర్కార్ టోల్ ట్యాక్సుల పేరిట వాహనదారుల తోలు తీస్తున్నది. 2014లో రూ.11,400 కోట్లున్న టోల్ వసూళ్లు 2024లో రూ.62,000 కోట్లకు చేరడమే అందుకు నిదర్శనం. ఏటా 5 శాతం ట్యాక్స్ పెంచడం, ఎక్కువ రహదారులను టోల్ ట్యాక్స్ పరిధిలోకి తేవడమే అందుకు ప్రధాన కారణం. అయితే ఈ వాస్తవాలను విస్మరిస్తున్న కేంద్ర మంత్రులు అసలు ధరలే పెరగలేదని మాట్లాడటం విడ్డూరం.
2023 సెప్టెంబర్లో ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం.. మన దేశంలో సగటు కుటుంబాల పొదుపు రేటు జీడీపీలో 5.1 శాతానికి పడిపోయింది. గత నలభై ఏండ్లలో ఇదే అత్యంత తక్కువ పొదుపు రేటు కావడం గమనార్హం. అదే సమయంలో అప్పులు మాత్రం జీడీపీలో 40 శాతానికి పెరిగాయి. అప్పులలో ఎక్కువ భాగం క్రెడిట్కార్డులు, వ్యక్తిగత రుణాల విభాగంలోనే ఉన్నాయి. పెరిగిన ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికే ఆదాయం సరిపోవడం లేదని దీనర్థం.
దేశ ప్రజల ఆదాయాలు తగ్గాయనడానికి మరో ఆధారం ఐటీ రిటర్నుల సమాచారం. ఆదాయ పన్ను శాఖ లెక్కల ప్రకారం.. 2019-2020లో 6.47 కోట్ల మంది రిటర్నులు సమర్పించారు. వారిలో 2.9 కోట్ల మంది అంటే 45 శాతం (నిల్ రిటర్న్) పన్ను చెల్లించే ఆదాయం లేనివారున్నారు. 2022-23లో చూసుకుంటే.. 7.4 కోట్ల మంది రిటర్నులు సమర్పిస్తే, అందులో ఏకంగా 5.16 కోట్ల మంది అంటే 70 శాతానికి పైగా నిల్ రిటర్న్ ఫైల్ చేశారు. ఈ మూడేండ్లలోనే నిల్ రిటర్న్ ఫైల్ చేసినవారి సంఖ్య 78 శాతం పెరిగింది. అంటే.. దీన్నిబట్టే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాజాగా తన ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. అందులో ప్రత్యక్ష పన్నుల్లో రాయితీ, ఆదాయ పరిమితి పెంపు లాంటి హామీల ప్రస్తావన చేయలేదు. జీఎస్టీ పన్నులను హేతుబద్ధీకరణ చేసే ఆలోచన కూడా బీజేపీకి లేదని మ్యానిఫెస్టో ద్వారా స్పష్టమైంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష కాంగ్రెస్ మ్యానిఫెస్టో కూడా అస్పష్టంగానే ఉన్నది.
మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తే సరిపోదు. కొంతమంది సంపన్నుల ఆదాయం పెరిగితే దేశం పురోగతి సాధించినట్టు కాదు. అందరి ఆదాయం పెరగాలి. ప్రజలు ఇప్పటికైనా తమ ఆలోచనా తీరును మార్చుకోవాలి. భావోద్వేగపూరిత, విద్వేషపూరిత అంశాలను చూసి ఓట్లు వేయకూడదు. తమ బతుకుల్లో వెలుగులు నింపే వారినే ఎన్నుకోవాలి. అప్పుడే సామాన్యుల బతుకులు బాగుపడతాయి.
ప్రశాంత్ సాగి
70955 83999