ఈ ఎన్నికల్లో ఒక దృశ్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. తెలంగాణ స్థానిక నాయకత్వం ఒకవైపు, జాతీయ పార్టీల నాయకుల దండు ఒకవైపు. ఇక్కడ తెలంగాణ స్థానిక నాయకత్వమంటే తెలంగాణ ఆత్మను ఆవాహనం చేసుకొని తెలంగాణ వాదాన్ని భుజాన మోస్తున్న పూర్వపు టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్. జాతీయ నాయకత్వమంటే జాతీయ పార్టీల నాయకులు, తెలంగాణలో వారి కనుసన్నలలో మెలిగే తాబేదార్లు. వారి పొత్తు పార్టీలవారు.
ఒకే ఒక్కడైన కేసీఆర్ను, ఒక్కటైన బీఆర్ఎస్ను మట్టు పెట్టడానికి జాతీయ పార్టీల అధిష్ఠానా లు తెలంగాణపై ఒక యుద్ధమే చేశాయి. కేసీఆర్ను ఎదుర్కొవటం తమ వల్ల కాదని ఆయా పార్టీల స్థానిక నాయకులు చేతులెత్తేయటంతో జాతీయపార్టీల నాయకత్వమంతా తెలంగాణపై దాడికి దిగింది.
కాంగ్రెస్ నుంచి వారి అధిష్ఠానదేవత మొదలు ఆమె కుమారుడు, కుమార్తె, వారి మానస పుత్రులైన ఆపార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు తెలంగాణపై దండెత్తి వచ్చారు. ఇక బీజేపీ నుంచైతే ప్రధాని మోదీ, హోంమంత్రి, పార్టీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, పొత్తు పార్టీల చోటామియా, బడేమియా లు వచ్చి తెలంగాణను చుట్టుముట్టి కేసీఆర్ ప్రభుత్వం పై ముప్పేట దాడిచేశారు.
తెలంగాణలోని జాతీయ పార్టీల స్థానిక నాయకత్వాలను ప్రజలు విశ్వసించరని, వారు చెప్తే ప్రజలు నమ్మరని వారి అధిష్ఠానాల పెద్దలే హామీలు ఇచ్చారు. వారే డిక్లరేషన్లు ప్రకటించారు. ఇలా హామీలను, డిక్లరేషన్లను కూడా ఢిల్లీ పెద్దలచే చెప్పించే ఆయా పార్టీల స్థానిక నాయకత్వాలు రేపు ఎన్నికల్లో ఒకవేళ గెలిస్తే తిరిగి ఢిల్లీ పెద్దల అనుమతుల కోసం ఎదురు చూడాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రప్రభుత్వ స్టీరింగ్ ఢిల్లీ అధిష్ఠానాల చేతుల్లో ఉంటుంది. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు సాగిలపరచటం కాదా. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరచడం కాదా.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన నిరుద్యోగ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, ఆరు గ్యారెంటీలు, ఎన్నికల మేనిఫెస్టోలను ఎవరు ప్రకటించారో, ఎవరు విడుదల చేశారో, అలాగే బీజేపీ వారి హామీలను ఎవరు ఇచ్చారో కూడా చూశాం క దా. అంతెందుకు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థుల జాబితాలను ప్రకటించడానికి కాంగ్రెస్, బీజేపీ లకు ఎన్ని రోజుల సమయం పట్టిందో చూశాం. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు వరకు అభ్యర్థుల ను ప్రకటించిన జాతీయ పార్టీల తీరుతెన్నులను చూశాం.
ఇక ఎన్నికల హామీల పరంపర ప్రజలపై ప్రత్యక్ష పరోక్ష పన్నులభారం మోపటమో, వీలున్నంతవరకూ రకరకాల అప్పులుతేవటమో, ప్రభుత్వ ఆస్తులను తెగ నమ్మటమో చేసేలా ఉన్నాయి. కాంగ్రెస్ హామీల పరంపర చూస్తే ఏడాదిలో అమలు చేయాల్సిన హామీల కోసం రెండేండ్ల్ల బడ్జెట్ కూడా సరిపోదు అన్నట్టుగా ఉన్నది.
జాతీయ పార్టీలు తమ హామీలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాయి. తమ దాడినంతా కేసీఆర్ పైనే కేంద్రీకరించి విమర్శలు చేశాయి. దేశంలో ఏ చట్టమూ చెప్పని అంగీకరించని చర్యలు తీసుకుంటామని వాచాలత్వం ప్రదర్శించాయి. ఉద్యోగ నియామకాల విషయాల్లోనూ అవాస్తవాలు సత్య దూరమైన ప్రచారాలు, విమర్శలు చేశాయి. ప్రాజెక్టుల విషయంలోనూ పసలేని ఆరోపణలే. ఇక కాంగ్రెస్ చెప్పే ఆరు గ్యారెంటీల అమలుకు ఎన్నికోట్లు అవుతుందో కూడా ఆ పార్టీకి అవగాహన లేదు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీల అమలు సాధ్యమయ్యేదేనా?
ఒకపక్క బక్కపలుచని కేసీఆర్ ఒక్కడిని చేసి ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు మిడుతల్లా ముప్పేట దాడి చేశారు. మరోపక్క అలవి కానీ, ఆచరణ సాధ్యం కానీ హామీలు కుప్పించి ప్రజలని మా యోపాయం చేశారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే నెలరోజుల్లో రాష్ట్రమంతా తిరిగి తమ ప్రభుత్వం ఏం చేసింది. మళ్లీ గెలిస్తే ఏం చేస్తుం దో సవివరంగా వివరించారు.
నేడు ఓటు వేయబోతున్న తెలంగాణ ప్రజానీకం తమ భవిష్యత్తు భద్రత గురించి సరైన నిర్ణయం తీసుకోవాలి. స్థానిక పార్టీని, నాయకత్వాన్ని బలపరిచేలా ఆ నిర్ణయం ఉంటుందని ఆశిద్దాం.
కె ఎస్ ఎన్ ప్రసాద్
94925 22089