తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ముదిరాజుల పరిస్థితి, రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఏర్పాటైన బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ముదిరాజుల ప్రగతిపై సమగ్ర వివరణ, విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పడిన తర్వాత 17 మంది ముదిరాజులు మాత్రమే శాసనసభసభ్యులుగా అడుగుపెట్టగలిగారు.
2014.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముదిరాజులు అత్యధికంగా ఉన్నారని గ్రహించిన సీఎం కేసీఆర్ వారికి ప్రాధాన్యం కల్పించారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యం చూసి మిగతా రాజకీయ పార్టీలు కూడా ముదిరాజులకు అవకాశాలు కల్పిస్తామని ఇప్పుడు ప్రకటిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ముదిరాజులకు అవకాశాలు కల్పిస్తూనే ఉన్నది. దానిలో భాగంగానే ఉద్యమకాలంలో గోవిందగిరి ముదిరాజుకు, కృష్ణారావు ముదిరాజుకు, 2009లో ఈటల రాజేందర్ ముదిరాజు, మెట్టుకాడి శ్రీనివాస్లకు టికెట్లు కేటాయించిం ది. 2002లో పార్టీలో చేరిన ఈటెల రాజేందర్కు 2004లో కమలాపూర్ టికెట్ కేటాయించింది. 2009లో పార్టీలో అప్పటికే మంత్రి పదవులు చేసినవారున్నప్పటికీ అనేకమంది సీనియర్లను కాదని ఈటెల రాజేందర్కు ఫ్లోర్ లీడర్ పదవిని ఇచ్చారు. దీంతో సీఎం కేసీఆర్ ముదిరాజుల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
2017లో 64 మందితో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో జనరల్ సెక్రటరీగా ఈ వ్యాసకర్తకు, సెక్రెటరీలుగా అందె బాబయ్య ముదిరాజ్, వీకే మహేష్, సఫన్ దేవ్ ముదిరాజులకు పదవులు ఇచ్చారు. ముదిరాజులకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ పార్టీ, అధినేత కేసీఆర్కు స్పష్టమైన అవగాహన ఉన్నది. వాస్తవానికి ముదిరాజుల నుంచి గతంలో రాజ్యసభకు నామినేట్ అయిన దాఖలాల్లేవు. ఈ వ్యాసకర్తను రాజ్యసభకు పంపి ముదిరాజు జాతి పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. రాజ్యసభకు ఎన్నికవడం ఒక్కరిద్దరితో సాధ్యం కాదు.
యావత్ బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతుతో, 34 మంది ఎమ్మెల్యేల ఓట్లతో రాజ్యసభకు ఎన్నిక జరుగుతుంది. డాక్టర్ బండా ప్రకాశ్ను రాజ్యసభకు పంపేందుకు 4 జిల్లాల ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వీళ్లంతా వేర్వేరు జిల్లాల వారు. భిన్న కులాలు, విభిన్న మతాలకు చెందినవారు. అంటే ముదిరాజులకు రాజకీయ అవకాశాలపై బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టతతో ఉన్నది. ఈటెల రాజేందర్ పార్టీని వీడిన తర్వాత చట్టసభల్లో ముదిరాజులకు అందుబాటులో ఉండేలా శాసనమండలికి పంపి అత్యున్నత పదవి అయిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా క్యాబినెట్ హోదాను కల్పించి సీఎం కేసీఆర్ ముదిరాజులను మరోసారి గౌరవించారు.
రాజకీయ పార్టీగా ముదిరాజుల సంక్షేమం, వారి ప్రగతిపై బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నది. అందు లో భాగంగా 2001 నుంచి నేటివరకు బీఆర్ఎస్ పార్టీ ముదిరాజుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2004లో నారాయణరావు, 2009లో ఆకుల రాజేందర్ శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ ఎవ్వరికి మంత్రి పదవి వరించలేదు. కానీ, స్వరాష్ట్ర ఏర్పా టు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈటెల రాజేందర్ ముదిరాజుకు మంత్రివర్గంలో స్థానం కల్పించి పాలనలో ముదిరాజులకు ప్రాధాన్యం ఇచ్చి, భాగస్వాములను చేసింది.
ఎన్నికల సమయంలో పార్టీలు విధానపరమైన నిర్ణయా లు తీసుకుంటాయి. వాటిని వివాదాస్పదం చేయడం రాజకీయ కుటిల నీతికి అద్దం పడుతుంది. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ పార్టీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. దాని ప్రకారమే కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ప్రకటించారు. విధానపరమైన నిర్ణయం తీసుకోవడం వల్లనే ముదిరాజులకు ఈసారి అసెంబ్లీ టికెట్లను కేటాయించలేకపోయారు.
అందుకు స్వల్పంగా మార్చిన సీట్లలో ముదిరాజులకు కేటాయించాలనే ఆలోచన పార్టీకి ఉన్నప్పటికీ మార్చిన స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపే ముదిరాజు లీడర్లు లేకపోవడంతో అక్కడ టికెట్లు కేటాయించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ప్రతి కార్యక్రమంలో ముదిరాజులకు ప్రాధాన్యం కల్పిస్తూనే ఉన్నది. పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న ముదిరాజులు వివిధ కారణాల వల్ల పార్టీకి దూరమైనందున పదవుల్లో ముదిరాజులకు స్థానం కల్పించలేకపోయింది.
బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఉన్నచోటల్లా ప్రభుత్వంలో ముదిరాజులను భాగస్వాములను చేసింది. మొట్టమొదటిసారి న్యాయవ్యవస్థలో నలుగురు ముదిరాజు విద్యావంతులకు ప్రభుత్వ న్యాయవాదులుగా హైకోర్టులో అవకాశం కల్పించింది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ నామినేటెడ్ పదవుల్లో కూడా అవకాశం కల్పించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్, మార్కెట్ కమిటీలు, దేవాలయ ధర్మకర్తల మండలిలలో కూడా అవకాశాలు కల్పించారు. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్లకు ముదిరాజులను చైర్మన్లుగా నియమించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారి మత్స్య సహకార ఫెడరేషన్ చైర్మన్గా ముదిరాజును నియమించింది. కాంగ్రెస్ పదేండ్ల కాలంలో ముదిరాజులకు ఇచ్చే అవకాశం ఉన్నా మంత్రి పదవి ఇవ్వలేదు. ముదిరాజులకు రాజకీయ పదవుల విషయంలో కూడా కాంగ్రెస్ అన్యాయమే చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముదిరాజులకు రాజ్యసభ మొదలుకొని స్థానిక సంస్థల వరకు జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయుల్లో అవకాశాలు కల్పిస్తామని ప్రకటించడం ముదిరాజుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఒక లక్ష్యం, విశాల దృక్పథంతో ముదిరాజుల ఉమ్మడి ప్రగతి స్వావలంబన కోసం ప్రభుత్వం పనిచేసింది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల్లో ముదిరాజులకు తెలంగాణ రాష్ర్టాభివృద్ధి అంశాల్లో ముదిరాజుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడిం ది. అస్థిరపరిచే రాజకీయాల కోసం విషపు బీజాలు నాటే ప్రయత్నాలకు ముదిరాజుల్లో ఉన్న ఐక్యత చెదిరిపోదు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పట్ల ఉన్న విశ్వసనీయతను ముదిరాజులు విస్మరించరు. ముదిరాజులకు ఆర్థిక స్వావలంబన, రాజకీయ సాధికారత మరింత చేకూరాలన్నా, భవిష్యత్తులో అవకాశాలు మెరుగ్గా ఉండాలన్నా కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీ ని మరోసారి ఆశీర్వదించాలని ముదిరాజులకు పిలుపునిస్తున్నాం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరుతున్నాం.
(వ్యాసకర్త: డిప్యూటీ చైర్మన్, శాసనమండలి, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు)
డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్