‘ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలి. మరో ముగ్గురితో మొక్కలు నాటించాలి’ అనే ఒక చిన్న ప్రయత్నం రికార్డులను తిరగరాసింది.
గాలి, నీరు, ఆహారం.. ఈ మూడు లేకుంటే మనిషి మనుగడే ప్రశ్నార్థకం! ఈ మూడు కచ్చితంగా మనిషికి సమపాళ్లల్లో లభించాలంటే మొక్కలు కావాలి. మొక్కలే లేకుంటే గాలి లేదు. గాలి ఆధారంగా ఏర్పడే మేఘం లేదు. గాలి కారణంగా కరిగే మేఘం లేదు. మేఘంగా కరిగి కురిసే చినుకూ లేదు. కానీ ఈ మొక్కల విలువను కొంతమంది మాతమే గుర్తెరిగారు. వారే చరిత్రలో నిలిచిపోయారు.
చిన్నప్పుడు పుస్తకాల్లో అశోకుడు మొక్కలు నాటించెనని చదివినప్పుడు మొక్కలు నాటిస్తే పుస్తకాల్లో పాఠాలుగా చెప్పడం ఏమిటని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితిని చూస్తుంటే పాఠ్యాంశంగా రూపొందించడంలో తప్పులేదనిపిస్తున్నది. అశోకుడి గురించి నేను పుస్తకాల్లో చదువుకున్నదే. సుందర్లాల్ బహుగుణ గురించి కూడా అదేవిధంగా తెలుసుకున్నాను. మా ఖమ్మం జిల్లాలో వనజీవి రామయ్య అనే ప్రకృతి ప్రేమికుడు ఈ కాలం నాటి వాడు కాబట్టి మొక్కలను నాటి వృక్షాలుగా పెంచితే ఎంతటి స్వీయానుభూతి ఉంటుందో దగ్గరుండి చూశాను. కానీ మనసులో ఏదో వెలితి, ఇంకేదో కొరత. అప్పుడు నాకు లభించిన సమాధానం రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్.
మన పూర్వీకులు ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్నారు. ఈ మాటను ఆచరించేందుకు సంతోష్కుమార్ పడుతున్న తపన అంతా ఇంతా కాదు. కేవలం మొక్కలు పెంచేందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్థాపించడం అంటే మాటలు కాదు. దీని ద్వారా ఆయన లక్షల మందిని కదిలించారు. కోట్ల మొక్కలు నాటించారు. అందుకోసం నిరంతరం అకుంఠిత దీక్షతో పరిశ్రమిస్తున్నారు. ఒక మనిషి హరిత సంకల్పాన్ని ఇంకెలా అర్థం చేసుకోగలం? సెలబ్రిటీలతో మొక్కలు నాటించడం వెనుక అసలు కారణం హరిత లక్ష్యాన్ని బలంగా చాటడం, జనాల్లోకి మరింత ఉధృతంగా తీసుకెళ్లడం. పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునివ్వడం, అడవిని దత్తత తీసుకోవడం, ఊరూరా ప్రతీ గుడిలో జమ్మి మొక్కలు నాటించడం.. సీడ్ బాల్స్ వేయడం, హరిత స్ఫూర్తిని కొనసాగిస్తున్న వ్యక్తులను సన్మానించడం.. మరీ ముఖ్యంగా వృక్ష జాతులను ఈ తరానికి పరిచయం చేస్తూ ‘వృక్ష వేదం’ అనే పుస్తకాన్ని రూపొందించడం.. ఇవన్నీ పచ్చదనం పట్ల ఉన్న దీక్షను చాటుతాయి.
ఇక్కడ అదిమ రెడ్ ఇండియన్ల సామెత గుర్తుకు వస్తుంది- ‘తరాలకు సరిపడా పోగేసుకున్నా తర్వాత.. విపరీతంగా సంపాదించిన తర్వాత.. నీకు అనిపిస్తుంది నువ్వు తినేందుకు ఏ డబ్బూ పనికిరాదని.. చిట్టచివరి గాలి కాలగర్భంలో కలిసిన తర్వాత.. చివరి నీటిబొట్టు ఆవిరయ్యాక అప్పుడర్థమవుతుంది నీకు సంపద ఎందుకూ ఉపయోగపడదని’. బహుశా ఇలాంటి పరిస్థితి ఎవరూ ఎదుర్కోవద్దనే సంతోష్కుమార్ ఈ హరిత యజ్ఞానికి నడుం బిగించినట్టున్నారు. అందుకే ఈ దేశంలో లక్షల మంది నాయకులున్నప్పటికీ ఎవరూ చేయని గొప్ప కార్యకమాన్ని వ్యక్తిగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న గొప్ప నాయకుడు సంతోష్కుమార్. బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో స్వాతంత్య్రానంతరం ఒక సామాజిక ఆశయం కోసం (మొక్కల పెంపకానికి) ఇంతమంది ప్రజలను, ప్రముఖులను మమేకం చేసిన కొద్దిమంది నాయకుల్లో సంతోష్కుమార్ ఒకరనడంలో సందేహం లేదు.
చుట్టూ ఉన్న వాతావరణం కాలుష్యకోరల్లో చిక్కుకుని, పర్యావరణమంతా నాశనమవుతుంటే ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ బాధ నుంచి పుట్టిందే ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఇంతింతై వటుడింతై అన్నట్టు ఇవ్వాళ ఇది ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచంలోని అన్ని ఖండాల్లో మొక్కలు నాటించిన ఏకైక ఉద్యమంగా ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ప్రశంసలు పొందింది.
ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి సూపర్స్టార్ల వరకు, ఆధ్యాత్మిక గురువుల నుంచి గ్లోబల్ లీడర్ల వరకు ఎందరో ప్రముఖులు గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. అందరూ తమ వంతుగా దాని గొప్పతనాన్ని వివరించారు. వనజీవి రామయ్య, సాలుమరద తిమ్మక్క, జాదవ్ పయాంగ్తో పాటు బచ్పన్ బచావో ఆందోళన్ సంస్థ స్థాపకులు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బహ్మకుమారి సమాజం, సద్గురు జగ్గీవాసుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ వంటి ఎందరో ప్రకృతి ప్రేమికులు గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆశయాన్ని విశ్వవ్యాప్తం చేశారు..
‘ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలి. మరో ముగ్గురితో మొక్కలు నాటించాలి’ అనే ఒక చిన్న ప్రయత్నం రికార్డులను తిరగరాసింది. ఈ ఆలోచన హరిత ఉద్యమస్థాయికి చేరుకోవడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల అపార కృషిని నిక్షిప్తం చేసే ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్’లో సంతోష్కు చోటు లభించడం అరుదైన విషయం. నాబోటి డాక్టర్లు కూడా తమ వంతుగా మొక్కలు పెంచుతున్నారు, పంచుతున్నారూ అంటే దానికి కారణం ఆయన ఇచ్చిన ప్రేరణే. ఆయన హరిత సంకల్పం గొప్పది కాబట్టే నాతో ఖమ్మం జిల్లావ్యాప్తంగా దేవాలయాల్లో జమ్మి మొక్కలు నాటించింది.
(వ్యాసకర్త: ఏవో, ఖమ్మం ప్రభుత్వ ప్రధాన దవాఖాన)
– డాక్టర్ కేసగాని రాజశేఖర్గౌడ్ 98484 80890