(ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మాడల్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం పూర్తిపాఠం)
భారతదేశానికి తెలంగాణ అభివృద్ధి మాడల్ ఓ దిక్సూచి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించింది. పరిపాలనలో మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారు. సీఎం కేసీఆర్ అభినవ చాణక్యుడు. అహింసామార్గంలో తెలంగాణను సాధించిన మరో గాంధీజీ. ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంట పొలాలుగా తీర్చిదిద్ది దేశానికి సీఎం కేసీఆర్ స్ఫూర్తినిచ్చారు.
ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ చాలా ముందున్నది. నేటి తెలంగాణ శాంతిసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదు. తెలంగాణ మాడల్ అంటే ఆర్థిక గణాంకాలు కాదు, అది మారిన తెలంగాణ జీవన స్థితిగతులను తెలియజేస్తుంది. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకువెళ్తున్నది. అన్నిరంగాల్లో తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రగామిగా నిలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేసీఆర్తోనే సఫలమైంది. ప్రత్యేక తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం సాగిన సంగతి తెలిసిందే. 2001లో సీఎం కేసీఆర్ తెలంగాణ మలిదశ పోరాటాన్ని ప్రారంభించారు. దాంతో 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్లో చేర్చింది.
ఆ తర్వాత కేసీఆర్ ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో 2009లో తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చివరికి 2014లో ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాల్లో 9 వెనుకబడిన జిల్లాలుండేవి. రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండేది. 2700 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేది. విద్యుత్తు లేక పరిశ్రమలను వారంలో రెండు రోజులపాటు మూసివేసేవారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సమూలమైన సంస్కరణల ద్వారా పూర్తిగా ఆ పరిస్థితులను మార్చివేశారు. విద్యుత్తు మిగులు సాధించాం. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానానికి చేరింది.
2014-15 నుంచి 2022-23 మధ్యకాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 118.2 శాతం పెరుగగా.. తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 155.7 శాతం పెరిగింది. అంటే జాతీయ సగటుకు మించి తెలంగాణ పయనిస్తోంది. జీఎస్డీపీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది. తెలంగాణ ఏర్పాటయ్యే సమయానికి రూ.1,12,162 ఉన్న తలసరి ఆదాయం 2022-23 నాటికి రూ.3,14,732 కి పెరిగింది. తలసరి ఆదాయం పెరుగుదలలో ఇతర రాష్ర్టాలకు మించి దూసుకెళ్తున్నది. అందరికి సమాన సంపద విధానాన్ని సీఎం కేసీఆర్ అవలంబిస్తున్నారు. ఎన్ఎఫ్ హెచ్ఎస్ 2019-21 ప్రకారం సమానాదాయ పంపిణీలో తెలంగాణ నెంబర్వన్గా ఉన్నది.
2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెగెటివ్ వృద్ధిలో ఉన్న తెలంగాణ 2022-23 నాటికి 15.7 శాతం వృద్ధి సాధించింది. చివరి గింజ వరకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రైతుబంధు పేరిట ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇప్పటివరకు 65 లక్షల మంది రైతులకు రూ.72,815 కోట్లు అందించారు. ఈ చర్య వల్ల రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేసే పరిస్థితి పోయింది. ఎక్కడా లేనివిధంగా రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుంది. రైతాంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నది కూడా కేసీఆరే. తెలంగాణ వ్యవసాయం ఇప్పుడు పండగలా మారింది. ధరణి పోర్టల్ ద్వారా భూ రికార్డుల కంప్యూటరీకరణ చేపట్టి విప్లవాత్మక మార్పునకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 99 శాతం భూ రికార్డులు భద్రంగా ఉన్నాయి. తద్వారా అవసరమైన రుణాలను కూడా బ్యాంకులు ఇస్తున్నాయి. మిషన్ కాకతీయ కింద చెరువులు మరమ్మతు చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో చెరువులు నిండుకుండల్లా మారాయి. దాంతో భూగర్భజలాలు పెరగడమే కాకుండా మత్స్య సంపద కూడా పెరిగింది.
రికార్డు స్థాయిలో మూడున్నరేండ్ల కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన రికార్డు సీఎం కేసీఆర్ సొంతం. ఆ ప్రాజెక్టు వల్ల రైతులు మూడు పంటలు పండిస్తున్నారు. 2004-2014 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వాలు వ్యవసాయానికి రూ.7,994 కోట్లు ఖర్చుచేస్తే గత తొమ్మిదిన్నరేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1,91,612 కోట్లు ఖర్చుచేసింది. బలమైన విధానాలు రూపొందించడం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయి. సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాల నుంచి 2 కోట్ల పైచిలుకు ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది తెలంగాణ.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే మరో 50 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. 2014లో రూ.62 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు రూ.2 లక్షల 94 వేల కోట్లకు చేరుకుంది. తాగునీటిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.36 వేల కోట్లు ఖర్చుచేసింది. మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ కల్పించారు. విద్యుత్తు రంగంలో రూ.38 వేల కోట్లు ఖర్చుచేశారు. 2014లో 7,778 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తయ్యేది. ఇప్పుడది 18,453 మెగావాట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకున్నది. పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలోనూ తెలంగాణ ఎంతో ముందుంది. తలసరి విద్యుత్తు వినియోగం 2,126 యూనిట్లకు చేరింది. ఇది దేశంలోనే అత్యధికం. కాగా, పర్యావరణ సవాళ్లను అధిగమించడానికి 280 కోట్ల మొక్కలు నాటారు. అందుకు తెలంగాణకు హరితహారం కింద రూ.10 వేల కోట్లను ఖర్చుచేశారు. ప్రతీ గ్రామంలో నర్సరీని నెలకొల్పారు. ప్రపంచంలో ఈ స్థాయి పచ్చదనం అభివృద్ధి ఎక్కడా లేదు.
పరిశ్రమల ఏర్పాటుకు వేగవంతంగా అనుమతులు ఇస్తున్నారు. టీఎస్ ఐపాస్ విధానం ద్వారా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు లభిస్తున్నాయి. ఆ లోగా అనుమతులు రాకపోతే పరిశ్రమను స్థాపించుకునే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. 2014 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.3.31 లక్షల కోట్ల పెట్టుబడులతో 22,100 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది. తద్వారా 22 లక్షల 36 వేల పరోక్ష ఉద్యోగాలను సృష్టించారు. 2014లో రాష్ట్రం నుంచి రూ.57 వేల కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతవ్వగా.. ఇప్పుడు రూ.1.83 లక్షలకు చేరాయి. యాపిల్, గూగు ల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలు సైతం తమ యూనిట్లను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయి. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఇదంతా సాధ్యమైంది.
అలాగే, వైద్యరంగంలోనూ తెలంగాణ ఎంతో పురోగమించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ దవాఖానల్లో కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలుండేవి. సీఎం కేసీఆర్ ఇప్పుడు 104 కేంద్రాలకు పెంచారు. రూ.11 వేల కోట్లకుపైగా ఆసరా పథకం కింద 44 లక్షల మందికిపైగా అర్హు లకు పింఛన్లు అందించారు. విద్యారంగంలో రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చారు. 10 వేల మెడికల్ సీట్లను పెంచారు. ప్రతీ జిల్లా దవాఖానకు అనుబంధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుంది. వెనుకబడిన వర్గాలవారి విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళా సాధికారతకు ఎంతో కృషి చేస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ల చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కులాంటిది. పార్లమెంటు ఆమోదించిన తర్వాత కూడా రిజర్వేషన్ల చట్టం అమలుకావడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించింది. ఈ ఐదు రాష్ర్టాల ఎన్నికల నుంచే చట్టాన్ని అమలుచేయాలని డిమాండ్లు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్రానికి చిత్తశుద్ధి లేదు. అన్ని పార్టీలు డిమాండ్ చేసినా ఓబీసీ కోటా కూడా కల్పించలేదు.