అన్నా.. నువ్వు మా కన్నీళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకొని ఉద్యమాన్ని ఎక్కుపెట్టి, మహా జనావళిని కదిలించావు. స్వరాష్ట్ర సాధన నా స్వప్నం, అదే నా జీవిత ధ్యేయమని ప్రకటించి తెలంగాణ ప్రజలందరినీ గెలిపించావు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం గెలిచింది. స్వరాష్ట్ర సిద్ధి జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ ఉద్యమాన్ని చేపట్టి పునర్నిర్మాణధారివయ్యావు.భూములకు సాగునీరు, గొంతు తడపటానికి మంచినీళ్లివ్వడమే నీ ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని మిషన్ భగీరథను, మిషన్ కాకతీయ పథకాల ప్రాజెక్టులను చేపట్టావు.
ఇంటింటికి నల్లా నీళ్లివ్వటానికి మా ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ నుంచే మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టావు. మంచినీళ్లు లేక ఫ్లోరోసిస్తో నవిసిన ఫ్లోరిన్ పీడిత గ్రామాల పీడను పోగొట్టి ఇంటింటికి నల్లానీళ్లిచ్చే పైపులైన్గా మారి పునర్నిర్మాణం చేసుకుంటూ సాగిపోతున్నావు. హైదరాబాద్ మహానగర పాయిఖానా మూసీ మురికినీళ్లా మా సూర్యాపేట ప్రజలు తాగాల్సిందని దుశ్చర్ల ఆగ్రహమాటలకు విముక్తి కలిగించి నీళ్ల గోస తీర్చినవ్.
ఉద్యమంలో నువ్వు ఎండిన పంటల్ని, నీళ్లు లేక తోటలను నరికేసుకున్న రైతులను, ఎన్ని బోర్లేసినా నీళ్లు పడని నేలలను చూసుకుంటూ వాటికి శాశ్వత పరిష్కారాలేమిటని గొంతెత్తి అరుచుకుంటూ ఉద్యమ నిప్పులను ఎగజిమ్ముకుంటూ పోయావు. ఇప్పుడు మిషన్ కాకతీయతో పచ్చటి రంగేసిన భూములను, వ్యవసాయం చేయటం దండుగ కాదు పండుగగా మార్చి, ఎండిన పల్లెల్ని చిగురింపజేసి, ఎక్కడ గడ్డపార వేసినా, మోకాలు లోతు తవ్వినా గంగమ్మ వచ్చేటట్టు చేసి పాడిపంటలకు లోటులేదన్న ఊరూరి ధైర్యాన్ని ధీమాగా చూసుకుంటూ, పునర్నిర్మాణంలో పూసిన పున్నమి వెన్నెల తెలంగాణను వీక్షించుకుంటూ, ఇదీ తెలంగాణ అని 33 జిల్లాల పాలనా ఫలితాలను గడప గడపకు పంచుకుంటూ, మా సూర్యాపేటకు వస్తున్నాడదిగో ఆ బక్కపల్చటి దేహమున్నవాడు, తెలంగాణను బాహుబలిగా మార్చినవాడు, అభివృద్ధిని పూయిస్తూ, కాయిస్తూ, చెమట చుక్కలన్నింటినీ సంపద చేతులుగా మార్చి చెమటచుక్కల చేతులకే అభివృద్ధి ఫలాలను పంచుకుంటూ సూర్యాపేటకొస్తున్నాడు.
రాష్ట్రమొచ్చిన కొత్తలోనే మంచినీళ్లు లేక సూర్యాపేటలో ఇళ్లకు తాళాలేసుకునే స్థితి వచ్చిందని జగదీష్ చెప్తుంటే విని ఎర్రటెండల్లో శ్రీశైలం తలుపులు తెరిపించి సూర్యాపేటకు మంచినీళ్లు ఇచ్చినోడివి నువ్వు. నీళ్లు లేని భూములకు నీళ్లందించి సూర్యాపేట జిల్లాలో కృష్ణా, గోదావరి మూసీ మూడు నదుల సంగమంగా మార్చి పంటలను పెంచి, నల్లగొండను ధాన్యపురాసుల కొండ ను చేసి తెలంగాణను దేశానికే ధాన్యాగారం చేసి, పరిఢవిల్లుతున్న అభివృద్ధిని చూసుకుంటూ వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పేందుకు పరిపరివిధాల ఆలోచించుకుంటూ, ఆ ఆలోచనలను ఈ నేలంతా వెదజల్లుకుంటూ నూతన వ్యవసాయాధారిత ఆలోచనల పరిశ్రమలాగా వస్తున్నాడు.
‘మా తండాలో మా రాజ్యం అన్నది’ ఇప్పుడు నినాదం కాదు. అది గిరిజన బిడ్దల స్వయం పాలనాకేంద్రంగా చేసిన జొన్నరొట్టెల చెలికాడు కేసీఆర్ సూర్యాపేటకు వస్తున్నాడు. బస్తీ దవాఖానలు, పల్లెదవాఖానలే కాదు, జిల్లాకొక మెడికల్ కాలేజీలను బెట్టి, వైద్యరంగాన్ని జిల్లా నడిబొడ్డులో ప్రతిష్ఠించుకుంటూ వస్తున్నాడు.
జిల్లాకొక మెడికల్ కాలేజీ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. కొన్నేండ్లకు క్యూబాలాగా తెలంగాణ డాక్టర్లు ప్రపంచపటంలో ఎక్కడికైనా వెళ్లిపోగలరన్న భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించుకుంటూ సూర్యాపేట మెడికల్ కాలేజీని ప్రారంభించటానికి వస్తున్నాడు.
తెలంగాణ కోసం ఇంతగా తెగించి పనిచేస్తున్నోడివి నీ ఎనకనే తెలంగాణ ఉంటది. జనం మేలుగోరి జనం పక్షాన నిలిచినోళ్లు సల్లంగుండాలని దీవించే సంస్కృతి తెలంగాణది. తెలంగాణ జనహృదయంలో సుస్థిర స్థానాన్ని పొందిన కేసీఆర్ ను ఎప్పటికీ సూర్యాపేట గడ్డ మరిసిపోదు. కేసీఆర్ నువ్వు తెలంగాణను దేశానికే మోడల్గా నిలిపావు. నీ దార్శనిక ఆలోచనల ఆచరణకు అండగా సమస్త తెలంగాణ సమాజం తోడుగా నిలిచి తీరుతుంది. మన తెలంగాణ గెలిచి తీరుతుంది.
(వ్యాసకర్త: రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్)
-జూలూరు గౌరీశంకర్
94401 69896