Mahatma Gandhi | ఏ ఆయుధమూ లేకుండా కేవలం అహింసా సిద్ధాంతంతో క్రూరమైన ప్రభుత్వం మెడలు వంచవచ్చని నిరూపించిన ఏకైక మహనీయుడు మహాత్మాగాంధీ. గాంధీజీ వంటి మహనీయుడు రక్తమాంసాలతో ఈ భూమ్మీద నడయాడాడంటే ముందు తరాల వారికి నమ్మశక్యం కాదని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నారు. కులమత విద్వేషాలు, అవినీతి, స్వార్థం పెరిగిపోతున్న ఈ కాలంలో గాంధీజీ సిద్ధాంతాలను పాటించడం తప్ప దేశ సమైక్యతకు, సమగ్రతకు, పురోభివృద్ధికి మరో మార్గం లేదన్న విషయాన్ని మనమంతా గ్రహించాలి. గాంధీజీ జయంతి నేపథ్యంలో ఆయన బోధనలను మరోసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఈనాడు మనదేశంలో ఏర్పడింది.
జాతీయోద్యమంలో పాల్గొన్న ఏ నాయకుడి గురించైనా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ, పార్టీలకతీతంగా, మతాలకతీతంగా భారతీయులందరూ మహాత్మాగాంధీని జాతిపితగా ఈనాటికీ గౌరవిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కరెన్సీ నోట్లపై ఆయన బొమ్మను ముద్రించి అత్యున్నత గౌరవాన్నిస్తున్నారు. మన దేశంలోనే కాదు, గాంధీజీ ప్రభావం పాశ్చాత్య దేశాల్లో సైతం ఉన్నది. గాంధీజీ ప్రభావానికిలోనైన ప్రపంచ ఉద్యమ నాయకులలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒకరు. ఆయన గాంధీజీ గురించి మాట్లాడుతూ క్రీస్తు మాకు లక్ష్యాలను నిర్దేశిస్తే, వాటిని చేరడానికి మార్గాన్ని గాంధీజీ చూపించారన్నారు. లక్షలాది మంది ఆఫ్రికన్, అమెరికన్ నీగ్రోల హక్కుల కోసం పోరాడటానికి ఆయన గాంధీజీ అహింసా సూత్రాన్ని ఆయుధంగా ఎంచుకుని విజయం సాధించారు.
దక్షిణాఫ్రికాలో నల్ల జాతి ప్రజలకు తెల్లవారి బానిసత్వం నుంచి విముక్తి కలిగించిన పోరాట యోధుడు నెల్సన్ మండేలా కూడా గాంధీజీ సిద్ధాంతాలనే తన పోరాటానికి ఆయుధంగా ఎంచుకున్నారు. తెల్లవారి దౌర్జన్యాలకు భయపడకుండా 20 సంవత్సరాలకు పైబడి జైలు జీవితాన్ని గడిపి, తన లక్ష్యాన్ని సాధించారు. ప్రపంచానికి అంతగా పరిచయంలేని సీజర్ చావెజ్ అనే అమెరికాకు చెందిన ప్రజాహక్కుల నాయకుడు గాంధీజీ మార్గంలోనే పోరాడి, అమెరికాలోని వ్యవసాయ కూలీలకు న్యాయం చేశారు. నిరసనలు తెలియజేయడానికి గాంధేయ మార్గాన్ని మించిన మహాస్త్రం మరొకటి లేదని ఆయన భావించారు. యాజమాన్యాల మెడలు వంచడానికి ఆయన ఒకసారి ఏకంగా 25 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి, జాతినంతటినీ ఏకం చేశాడు. ఆయన గొప్ప నాయకుడుగా ఎదగడానికి గాంధీజీ అహింసా విధానమే ఆయనకు తోడ్పడింది. అయితే, ఈయన గురించి మన దేశంలో చాలా మందికి తెలియదు. ఈయనే కాదు, అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామా, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్గా పనిచేసిన యూ థాంట్, ప్రఖ్యాత అమెరికన్ జర్నలిస్ట్ లూయిస్ ఫిషర్ వంటి వారంతా గాంధీజీ అభిమానులే. గాంధీజీ మార్గంలో ప్రయాణించి, వారు గొప్ప గుర్తింపు పొందారు.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మన దేశంలోని గాంధీజీ విగ్రహాలకు ఇంచుమించు సమానంగా అమెరికాలో కూడా ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఈనాడు గాంధీజీ సిద్ధాంతాలపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్న దేశాలలో అమెరికా ఒకటి. అక్కడ బాగా చదువుకున్నవారంతా గాంధీజీని అభిమానిస్తున్నారు. దీన్ని బట్టి గాంధీజీ ప్రభావం మన దేశంలో కంటే కూడా విదేశాల్లోనే ఎక్కువగా వుందని మనం గ్రహించవచ్చు. విదేశాల్లో గాంధీజీ తాత్వికత సిద్ధాంతాలపై చాలా గొప్ప పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వారిలో ముఖ్యులు జర్మనీకి చెందిన క్రిస్టియన్ బార్ టాల్ఫ్. ఈయన ఎన్నో దేశాలలో విస్తృతంగా పర్యటించి, గాంధీజీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా విదేశీయులు సైతం గౌరవించే మరొక మహనీయుడు ప్రపంచంలో మరొకరు లేరు! దీన్ని బట్టి గాంధీజీని ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి చెందిన వ్యక్తిగా భావించలేం. ఆయన యావత్ ప్రపంచ మానవాళికి మార్గనిర్దేశకులు. గాంధీజీ సిద్ధాంతాల ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమ పంథాలోనే పెను మార్పులు సంభవించాయి. సాయుధ పోరాటాల కంటే అహింసాయుత పోరాటాల వల్ల విజయాలను సునాయాసంగా సాధించవచ్చని ప్రపంచవ్యాప్తంగా ఉద్యమ నాయకులంతా గ్రహించారు.
గత శతాబ్ది కాలంలో జరిగిన పోరాటాల్లో సాయుధమైనవి 27 శాతం విజయాన్ని సాధిస్తే, అహింసా మార్గంలో జరిగిన పోరాటాల్లో 51 శాతం విజయం సాధించాయి. ఆ విధంగా గాంధీజీ సిద్ధాంతాలకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతూనే వస్తున్నది.
గాంధీజీ కేవలం స్వాతంత్య్రోద్యమ నాయకుడు మాత్రమే కాదు, గొప్ప రచయిత కూడా. ఆయన ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ భాషలలో ఎన్నో రచనలు చేశారు. ఆయన జీవిత కాలంలో రాసిన పుస్తకాలు, పత్రికా వ్యాసాలు, కరపత్రాలు, ఉత్తరాలు – అన్నీ కలిపి వంద సంపుటాలు అంటే సుమారు 50 వేల పేజీలు ‘ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ గాంధీ’ పేరుతో మనకు అందుబాటులో ఉన్నాయి. ఆయన స్వాతంత్రోద్యమంలో తలమునకలవుతూనే ఇన్ని రచనలు చేశారంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఆయన ఎంత విస్తృతంగా, ఎంత వేగంగా రచనలు చేసేవారో ఆ తరువాతి కాలంలో మొత్తం ప్రపంచం ఆయన గురించి అంత తీవ్రంగానూ, అంత లోతుగానూ ఆలోచన చేస్తున్నది. చర్చిస్తున్నది. ఒక అంచనా ప్రకారం మొత్తం ప్రపంచంలో అన్ని భాషల్లో కలిపి ఎక్కువ రచనలు బైబిల్కు సంబంధించి ఉండగా, రెండవ స్థానాన్ని గాంధీజీ సాహిత్యం ఆక్రమిస్తున్నది. దీన్ని బట్టి గాంధీజీ రచనలు ఎంతటి విశిష్టమైనవో మనం గ్రహించవచ్చు.
గాంధీజీ జర్నలిస్టుగా కూడా మంచి పేరు పొందారు. గాంధీజీ 19 ఏండ్ల వయసులో ఇంగ్లాండ్కు వెళ్ళారు. అక్కడ పత్రికలు చదవడం ద్వారా ఆయనకు కొత్త ప్రపంచం పరిచయమైంది. 21 ఏండ్ల వయసులో గాంధీజీ శాఖాహారం విశిష్టతపై తన తొలి వ్యాసాన్ని ప్రచురించారు. భారతదేశం నుంచి ఇంగ్లాండ్ వెళ్లే విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని లండన్ గైడ్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. 30 ఏండ్ల వయసులో దక్షిణాఫ్రికాలో ‘ఇండియన్ ఒపీనియన్’ అనే పత్రికను స్థాపించి, దానికి సంబంధించిన అన్ని పనులను తానే స్వయంగా నిర్వహించేవారు. 1920లో ‘యంగ్ ఇండియా’, ‘నవజీవన్’ పత్రికలను ఆయన నడిపారు. 1933లో తన 64 ఏండ్ల వయసులో ‘హరిజన్’ పత్రికను స్థాపించారు. ఇది ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలి, ఒడియా భాషల్లో మంచి ప్రాచుర్యం పొంది విజయవంతంగా నడిచింది. ఆయన రోజుకు సాధారణ రాతలో 50 పేజీల వరకు రాసేవారు. ఆయన జీవిత కాలంలో ఒక లక్ష ఉత్తరాలను రాశారట. గాంధీజీ ఒక గొప్ప రచయితగా ప్రపంచంలో గుర్తింపు పొందారు. ఆయన రచనల్లో తొణికిసలాడే మానవతా వాదమే అందుకు కారణం. భారత్లోని వివిధ భాషల ప్రసిద్ధ కవులు, రచయితలందరూ ఆయన ప్రభావానికి లోనైన వారే. ఇందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహాకవులు, రచయితలు కూడా మినహాయింపు కాదు.
సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో ఒక వైపు ఉద్ధృతంగా పనిచేస్తూనే, మరొక వంక గాంధీజీ సమాజాన్ని ప్రభావితం చేసే రచనలు చేయడంతో పాటు, దేశ ప్రజలలో సామాజిక పరివర్తన తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు.
పారిశుద్ధ్యం గురించి అవగాహన పెంచడం, దేశీయ వ్యవసాయ పరిజ్ఞాన వ్యాప్తి, విజ్ఞాన పరిశోధనలను గ్రామగ్రామానికీ తీసుకెళ్ళడం, మద్యపానం దురలవాటును నిర్మూలించడం, గ్రామ పునర్నిర్మాణం, విదేశీ వస్తు బహిష్కరణతో పాటు, స్వయం సమృద్ధిని సాధించడానికి రాట్నం తిప్పి, నూలు తీసి బట్టలు నేయడంతో పాటు, అనేకానేక కుటీర పరిశ్రమలను నెలకొల్పడం, జాతీయ విద్యావిధానాన్ని రూపొందించి, జాతీయ పాఠశాలలు, కళాశాలలు నెలకొల్పడం వంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలను చేపట్టి, విజయవంతంగా నిర్వహించారు. ఆయన ఉద్యమ ధాటికి ఇంగ్లాండ్లో వస్త్ర పరిశ్రమకు పేరుపడ్డ మాంచెస్టర్లో బట్టల మిల్లులు మూతపడ్డాయంటే గాంధీజీ ఉద్యమ ప్రభావం ఆనాడు ఎంతగా ఉండిందో మనం గ్రహించవచ్చు. గాంధీజీ ప్రభావంతో నిద్రాణంగా ఉన్న పల్లెలు ఆనాడు చైతన్యాన్ని పొంది, విదేశాల మీద ఆధారపడకుండా స్వయంసమృద్ధిని సాధించాయి. గాంధీజీ ఎంతో నేర్పుగా ఈ స్ఫూర్తిని స్వాతంత్య్రోద్యమానికి ఇంధనంగా వాడుకుని ఉద్యమాన్ని అహింసాయుత మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్ళారు. గాంధీజీ జీవితాంతం ఖద్దరు వస్ర్తాలను ధరించడం మాత్రమే కాక, మిల్లు వస్ర్తాల వాడకాన్ని పూర్తిగా పరిత్యజించారు.
మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీజీ సిద్ధాంతాలను తూ.చ. తప్పకుండా అమలుచేస్తున్న మహానాయకుడు. దేశానికి గాంధీజీ జాతిపిత అయితే, తెలంగాణ జాతిపిత కేసీఆర్. కులమతాలకు అతీతంగా అందరి శ్రేయస్సును కోరుకునే మానవతావాది కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు రూపొందించినా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభించినా ఇవన్నీ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే. దళితబంధు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కంటి వెలుగు, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ లాంటి అనేక పథకాలను బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఖర్చెంతైనా వెనుకాడక కేసీఆర్ అమలు చేస్తున్నారు. తెలంగాణను మాత్రమే కాక, యావద్దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడానికి కంకణం కట్టుకున్నారు కేసీఆర్. గాంధీజీ అడుగుజాడల్లో ముందుకు పోతున్న కేసీఆర్కు మనమంతా అండగా నిలిచి, దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ )
– కోలేటి దామోదర్ 98491 44406