రుతుక్రమం సమయంలో సెలవు మంజూరు చేయాలనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నది. ఈ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించగా.. తాజాగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. కొందరు ఆమె తీరును తప్పుబడుతుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు.
Smriti Irani | రుతుక్రమం సమయంలో సెలవులు ఇచ్చేలా చట్టాలు రూపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం బంతిని కేంద్ర ప్రభుత్వం కోర్టులో పడేసింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను సంప్రదించడం సబబుగా ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
తాజాగా ఈ అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయడం కుదరదని కరాఖండిగా చెప్పారు. మరో అడుగు ముందుకేసి అదేమీ వైకల్యం కాదని, మహిళల జీవితంలో సాధారణ అంశమేనని చెప్పడం గమనార్హం. రుతుక్రమం సమయంలో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు గానూ ‘జాతీయ రుతుక్రమ పరిశుభ్రత విధానం-2023’ ముసాయిదాను రూపొందించినట్టు వివరించారు.
ఆ సమయంలో వచ్చే నొప్పి అందరిలో ఒకేలా ఉండదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేశారు. పెయిన్ కిల్లర్ల సాయంతో కొంతమందిలో నొప్పి తగ్గిపోతుందని చెప్పడాన్ని చూస్తే సెలవుల మంజూరుపై బీజేపీ సర్కార్ ప్రతికూలంగా ఉన్నదని అర్థం అవుతున్నది. కాగా, కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. రుతుక్రమ సెలవును తిరస్కరించడమంటే.. అసంఖ్యాక స్త్రీలు భరించే జీవసంబంధమైన నొప్పిని విస్మరించడమేనని చెప్తూ మహిళా లోకం తరఫున గళం వినిపించారు.
రుతుక్రమం.. మహిళల జీవిత క్రమంలో ఒక భాగం. సుమారు పన్నెండేండ్ల బాలికల నుంచి 50 ఏండ్ల మహిళల దాకా ప్రతి నెల వారిలో ఇది సాధారణంగా జరిగే ఓ ప్రక్రియ. సుమారు 5 రోజుల పాటు ఇబ్బందులు తప్పవు. ఆ సమయంలో మహిళలు పాటించాల్సిన శుభ్రత గురించి ప్రభుత్వాలతో పాటు ఎన్జీవోలు, సంస్థలు బాలికలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. అందుకనుగుణంగా 2014 నుంచి ఏటా మే 28న అంతర్జాతీయ రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. జర్మనీకి చెందిన వాష్ యునైటెడ్ సంస్థ దీన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది.
స్త్రీల జీవితంలో ప్రత్యేకమైన ఈ సమయంలో వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తున్నది. ఈ అంశంపై స్పెయిన్ ఇప్పటికే చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. మూడు నుంచి ఐదు రోజుల పాటు సెలవు తీసుకునే వెసులుబాటు అక్కడి మహిళలకు ఉంది. మన దేశంలోనూ కేరళ ప్రభుత్వం విద్యార్థినులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులకు రుతుక్రమం సమయంలో సెలవు తీసుకునే వెసులుబాటును ఆ రాష్ట్ర సీఎం పినరాయి విజయన్ కల్పించారు.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెలవు ఇవ్వడాన్ని తప్పుబట్టడం వివక్ష అవుతుందా? సెలవు ఇచ్చి మహిళలను ప్రత్యేకంగా చూడటం వారి పట్ల వివక్ష అవుతుందా? అనేది ఎవరూ తేల్చుకోలేకపోతున్నారు. రుతుక్రమం సమయంలో సెలవు మంజూరు చేయడమనేది లింగ వివక్ష కిందికి వస్తుందని పలువురు వాదిస్తున్నారు. ‘సమానత్వం అనేది సారూప్యత కలిగిన వ్యక్తులను ఒకేలా ట్రీట్ చేయడం’ అనే అరిస్టాటిల్ సూత్రాన్ని ఈ వర్గం వారు ఉదహరిస్తున్నారు. ‘ఒకే దగ్గర పని చేయడమే’ మహిళలు, పురుషుల మధ్య సారూప్యత అని ఈ వర్గం వారు అనుకుంటూ ఉండొచ్చు. కానీ, మహిళలు, పురుషులు వేర్వేరు అనే అసలు విషయాన్ని వారు మర్చిపోతున్నారని మరో వర్గం వారు చెప్తున్నారు. సమానత్వం అనేది సమాన అవకాశాలు, ప్రోత్సాహం, బహుమానాలు తదితర విషయాల్లో ఉండాలని మరో వర్గం వాదన. స్త్రీ, పురుషులు సమానమేనని అనుకుంటే.. మహిళలు మాత్రమే నొప్పిని ఎందుకు భరించాలని ప్రశ్నిస్తున్నారు.
మహిళలు, పిల్లల విషయంలో ప్రత్యేక చట్టాలను చేసుకునే అవకాశం రాష్ర్టాలకు రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ -15 ప్రకారం.. వివక్ష నిరోధానికి సంబంధించి రాష్ర్టాలు చట్టాలను రూపొందించుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న ఈ అంశంలో రాష్ర్టాలు చొరవ తీసుకొని చట్టాలు రూపొందిస్తాయా? లేదా? అన్నది తేలాల్సి ఉన్నది.
– ఎడిటోరియల్ డెస్క్