గొప్ప విజనరీలమని చెప్పుకొని తిరిగే నాయకులెవరూ చేయలేని పనులు తెలంగాణ యువనేత, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిశ్శబ్దంగానే సాధించుకువస్తున్నారు. ‘మాటలు తక్కువ చేతలు ఎక్కువ’ అనే సిద్ధాంతాన్నే నమ్ముకున్న ఆయన దావోస్ వేదికగా ఏటా జరిగే ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ సదస్సులో భారత్ తరఫున మరోసారి తురుపు ముక్కగా నిలిచారు. ప్రతీ దాన్నీ ‘నేనే’ కనిపెట్టానని, ఏ అభివృద్ధి జరిగినా అది తన చలవేనని సెలవిచ్చే డొల్ల ప్రచారకర్తల పనితీరుతో పోలిస్తే కేటీఆర్ పనితీరు ఆకాశమెత్తున ఉంటుంది. దీనికి నిదర్శనం ఆయన ఏటికేడు దావోస్ లాంటి విశ్వవేదికలపై సాధిస్తున్న విజయాలే.
నాకింకా గుర్తుంది. 2018లో తొలిసారి దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు మాది చాలా చిన్న బృందం. మొదటిసారి వెళ్తున్నాం కాబట్టి, అసలు దావోస్ వేదిక తెలంగాణకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దామని ప్రయోగాత్మకంగా వెళ్లాం. రాష్ట్ర పెవిలియన్ కూడా ఒక చిన్న గదిలో ఉండేది. మా ఎదురుగానే భారీ సైజులో విజనరీ గారి పెవిలియన్. అందులో భారీగా భోజనాల వడ్డింపులు జరిగేవి. భూమీ, ఆకాశం ఒక్కటయ్యేంత ప్రచార ఆర్భాటం ఉండేదక్కడ. కానీ నాలుగు రోజులు గడిచేసరికి మొత్తం పరిస్థితి తారుమారయింది. తొలిసారిగా అక్కడికి వచ్చిన తారకరామారావు ఆ ఆల్ప్స్ మంచుశిఖరాలపై తెలంగాణ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు.
కేటీఆర్ తన తొలి దావోస్ పర్యటనలోనే ప్రపంచ రాజకీయ, వాణిజ్య ప్రముఖులెందరినో మెప్పించారు. తెలంగాణ అంటే ఎక్కడుందో తెలియని అనేకమందికి ఇండియా అంటే తెలంగాణ అనే రేంజ్లో ఆయన మన రాష్ర్టాన్ని అక్కడ ప్రమోట్ చేశారు. తొలి పర్యటనలోనే దావోస్ సదస్సుపై తనదైన మార్కు వేసిన కేటీఆర్ మరో ఏడాది గడిచేసరికి అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు.
ఈసారి దావోస్ సదస్సు జరుగుతుండగా అక్కడి తెలంగాణ పెవిలియన్కు టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాని వచ్చారు. ఆయన వచ్చిన సమయంలో మంత్రి మరోచోట సమావేశంలో ఉన్నారు. అలా ఆయన మూడు రోజుల్లో మూడు సార్లు తెలంగాణ పెవిలియన్కు వచ్చినా కేటీఆర్ వరుస సమావేశాల్లో ఉండటం వల్ల కలవలేకపోయారు. అయినప్పటికీ ఆయన పెవిలియన్లో ఒక ఫొటో దిగి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లో పుట్టి దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒక దానికి సీఈఓ అయిన సీపీ గుర్నాని వంటివారు తెలంగాణ నా రాష్ట్రం అని ప్రేమగా ప్రకటించినప్పుడు ఏ తెలంగాణ బిడ్డకైనా గర్వంతో ఛాతీ ఉపొంగుతుంది.
నిజానికి ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’లో జరిగే అనేక చర్చాగోష్టుల్లో కేంద్ర మంత్రులనే వక్తలుగా పిలుస్తారు. కానీ అలాంటి అనేక కార్యక్రమాల్లో కేటీఆర్కే ఒక రాష్ట్ర మంత్రిగా పాల్గొనే ఆహ్వానం అందింది. చెప్పాలనుకున్నదాన్ని సూటిగా, సుత్తిలేకుండా చెప్పగలగడం, ఇంగ్లిషులో చక్కటి ప్రావీణ్యం, ఎంతటివారినైనా మెప్పించే చాకచక్యం, ఆకట్టుకునే ఆహార్యం, సమయస్ఫూర్తి, రాష్ట్ర అభివృద్ధి కోసం మొక్కవోని తపన… ఇవన్నీ కలగలసిన అరుదైన నాయకుడు కేటీఆర్ కావడం వల్లనే ఏ ప్రపంచస్థాయి సదస్సుకు వెళ్లినా అక్కడ ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.
ఒక్క బిజినెస్ మీటింగ్లే కాదు, సమయం దొరికినప్పుడల్లా ఆయన స్థానిక ప్రవాస భారతీయ మిత్రులతో ‘మీట్ ఎండ్ గ్రీట్’ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్నారైలు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు అంటూ వారికి తెలంగాణ ప్రగతి ప్రస్థానం వివరించి, ఈ ప్రయాణంలో మీరూ భాగస్వాములు అవ్వండని పిలుపునిస్తారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏదైనా పర్యటన చేయాల్సి వస్తే మంత్రి కేటీఆర్ తన బృందంతో కలిసివేసే ముందస్తు ప్రణాళికల గురించి చెప్పుకోవాలి. నిజానికి గత తొమ్మిదేండ్లుగా సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో యువమంత్రి కేటీఆర్ నాయకత్వంలో రోజూ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ వార్త వినడం అలవాటైన మనకు ఇవేవో అనాయాసంగా వచ్చేస్తున్నాయనుకుంటే పొరపాటే. ఒక్కో కంపెనీ తెలంగాణలోకి రావాలంటే దానివెనుక ఎన్నో నెలలు, ఒక్కోసారి ఏండ్ల కృషి ఉంటుంది. నేడు పెట్టుబడుల కోసం పోటీ కేవలం భారత్లోని రాష్ర్టాల మధ్యలోనే లేదు. ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఈ పోటీలో ఉన్నాయి. కనుక ఒక కంపెనీని ఒప్పించి తెలంగాణలో పెట్టుబడి పెట్టేలా చేయాలంటే దానికి ఎంతో కసరత్తు చేయాలి. ఆ నిర్ణయం అనేక సమావేశాల అనంతరం జరుగుతుంది కాబట్టి దావోస్ లాంటి వేదికలు తక్ష ణం వచ్చే పెట్టుబడుల కోసమే కాకుండా భవిష్యత్తులో మరెన్నో పెట్టుబడులకు కూడా దోహదపడుతాయి.
కేటీఆర్ నిరంతర కృషి ద్వారా మన రాష్ర్టానికి గత ఎనిమిదేండ్లలో సుమారు రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా తద్వారా 22.5 లక్షల ఉద్యోగావకాశాలు మన యువతకు కల్పించబడ్డాయి. యువతకు ఉద్యోగాలే ఉద్యమంలో ప్రధాన నినాదమైన తెలంగాణలో ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొనసాగుతుండగా, మరోవైపు ప్రైవేటురంగంలో కూడా ఉద్యోగ కల్పనకు రాష్ర్టానికి వస్తున్న పెట్టుబడులు ఎంతో కీలకం.
ఉద్యోగ కల్పనతోనే సరిపెట్టుకోకుండా స్థానికులకు ఉపాధినిచ్చే కంపెనీలకు ప్రోత్సాహకాలు ప్రకటింపజేశారు కేటీఆర్. మన బిడ్డలకు ఈ కొలువులు దక్కడం కోసం అవసరమైన శిక్షణ కోసం ‘తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ ఎండ్ నాలెడ్జ్’ అనే సంస్థను కూడా స్థాపించి నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక పలురంగాల్లో విశేష అనుభవం ఉన్న మెరికల్లాంటి యువ అధికారులతో కూడిన ఒక టీమ్ను సమకూర్చుకున్నారు కేటీఆర్.
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏదైనా దిగ్గజ కంపెనీతో సమావేశం జరపాలంటే ఆ రంగానికి చెందిన ఒక డైరెక్టర్ రంగంలోకి దిగి, కంపెనీకి అవసరమైన సమాచారం మొత్తం సేకరించి, ముందస్తు సమావేశాలు కొన్ని నిర్వహించి ఆ చర్చలు ఒకస్థాయికి వచ్చాక మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగుతారు. కంపెనీ సీఈఓ లేదా అధ్యక్షుడితో నేరుగా సమావేశాలు నిర్వహించి, ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణనే ఎందుకు సరైన ప్రదేశమో సోదాహరణంగా వివరిస్తారు. వారి సందేహాలు తీర్చి, వారికొక భరోసా కల్పిస్తారు.
దేశంలోని 28 రాష్ర్టాల్లో కేటీఆర్ వలె తమ రాష్ర్టాన్ని ప్రమోట్ చేసే నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఇదేదో నేనంటున్నది కాదు. కొంతకాలం కిందట కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖకు చెందిన సీనియర్ అధికారిణి ఒకరు కేటీఆర్తో ‘మిమ్మల్ని క్లోన్ చేసి 28 రాష్ర్టాలకు 28 మంది కేటీఆర్లను ఇవ్వగలిగితే బాగుండ’న్నారు.
కేటీఆర్ ముందుచూపు ఎలా ఉంటుందో అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. 2016 మొదట్లో మన కేంద్రం పౌరుల డేటాను టెక్నాలజీ కంపెనీలు ఈ దేశంలోని సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలని, దాన్ని
ఇతర దేశాల్లోని డేటా సెంటర్లకు పంపొద్దని ఒక కొత్త చట్టం తెచ్చే యోచన మొదలుపెట్టింది. దీనిగురించి వార్తాపత్రికల్లో రాగానే మంత్రి కేటీఆర్ ఐటీ శాఖాధికారులతో
ఒక సమావేశం ఏర్పాటుచేశారు.
‘ఈ నూతన చట్టం అమల్లోకి వస్తే మన దేశంలో డేటా సెంటర్ల మార్కెట్ విస్తృతంగా పెరుగుతుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు మనం సిద్ధంగా ఉండాలి. డేటా సెంటర్లు పెట్టాలనుకునే కంపెనీల కోసం ప్రత్యేకంగా ఒక పాలసీని రూపొందించండ’ని ఆదేశాలు ఇచ్చారు. అప్పటికే డేటా సెంటర్ల హబ్గా పేరుగాంచిన అమెరికాలోని వర్జీనియా రాష్ర్టాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్న తెలంగాణ ఐటీ శాఖ 6 నెలలు శ్రమించి ‘తెలంగాణ డేటా సెంటర్స్ పాలసీ’ని 2016 నవంబర్లో విడుదల చేసింది.
రెండేండ్లు గడిచాయి. ఒకటి రెండు చిన్నచిన్న కంపెనీలు వచ్చి డేటా సెంటర్లు పెట్టాయి కానీ, పెద్ద కంపెనీలు ఎవరూ రాలేదు. ఒకరోజు ముంబై కేంద్రంగా నడిచే బిజినెస్ పత్రిక మన డేటా సెంటర్స్ పాలసీ మీద పెద్ద నెగెటివ్ వార్త రాసింది. పాలసీ తెచ్చి రెండేండ్లయినా పెద్ద కంపెనీలు ఒక్కటీ రాలేదు తెలంగాణకు అని.
కట్చేస్తే.. ఇవ్వాళ ప్రపంచ దిగ్గజ కంపెనీలు అమెజాన్ రూ.36,000 కోట్లు, మైక్రోసాఫ్ట్ రూ.32,000 కోట్లు, ఎయిర్టెల్ రూ.2000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో డేటా సెంటర్లు పెడతామని ఇటీవలే ప్రకటించాయి. దేశం మొత్తంలో దిగ్గజ కంపెనీలను ఆకర్షించడంలో తెలంగాణ ముందున్నదంటే దానికి కారణం మన నాయకత్వపు ముందుచూపే! ఆరేండ్ల కిందటే కేటీఆర్ నాటిన విధాన నిర్ణయం అనే విత్తనం ఇవ్వాళ మొలకెత్తి, ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు అల్లంత ఎత్తుకు ఎదిగి తెలంగాణకు అభివృద్ధి ఫలాలు ఇస్తున్నది. ఇది కేవలం ఒక్క ఉదాహరణే. ఒక ‘టీ-హబ్’, ఒక ‘వీ-హబ్’, ‘టీ-వర్క్స్’, ‘తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్’, ‘రీసెర్చ్ ఎండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్’, ‘టీశాట్’, ‘టాస్క్’… చెప్పుకొంటూ పోతే కేటీఆర్ మదిలోంచి పుట్టి ఇవ్వాళ తెలంగాణ ప్రగతికి సోపానాలు వేస్తున్న సంస్థలెన్నో.
ఇదీ విజన్ అంటే!..
మీరెప్పుడైనా కేటీఆర్ ప్రసంగాలు గమనించారా? ఆయన ఎన్నడూ ‘నేను’ అనే పదం వాడడు. ఎంత గొప్ప విజయం సాధించినా దాని క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలనే యావ ఆయనలో లేశమాత్రమైనా కనిపించదు. తన పని ముగిసిన వెంటనే ఒక కర్మయోగిలా మరో ఛాలెంజ్ వెతుక్కుంటారు. తమ హయాంలో యాదృచ్ఛికంగా జరిగినవాటిని కూడా తమ ఖాతాలో వేసేసుకునే ‘నేను వీరుల’ కాలంలో కేటీఆర్ నిజంగానే విభిన్న శ్రేణి నాయకుడు.
-కొణతం దిలీప్