ఎక్కడెక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యం, సర్వ విజయం, సకల సమృద్ధి, ధర్మం ఉంటాయని భగవద్గీత చెప్పింది. తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో అభినవ కృష్ణార్జునుల్లా స్వారీ చేస్తున్నారు మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు. ఈ బావబామ్మర్దులిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం కోసం బాధ్యతను భుజానికెత్తుకుని కష్టపడుతున్నారు. మామకు తగ్గ అల్లుడు ఒకరైతే, తండ్రికి తగ్గ తనయుడు మరొకరు.
గత రెండు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కేటీఆర్, హరీశ్రావులిద్దరూ చేసిన కృషి అందరికీ తెలిసిందే. ఈసారి కూడా ఇద్దరు అదే పనిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ వ్యూహాలను గ్రౌండ్ లెవెల్లో అంతే స్థాయిలో అమలు చేయడంలో బావ బావమర్దులు ఎప్పుడూ ముందుంటారు. బీఆర్ఎస్ పార్టీని వెనుక ఉండి నడిపించే రెండు చక్రాలు వీరిద్దరు. ప్రతిపక్ష పార్టీల మాటలకు తూటాల వంటి సమాధానాలు ఇచ్చి మారు మాట్లాడకుండా చేయగల సమర్థులు వీరు. సీఎం కేసీఆర్ మనసెరిగి నడిచే వీరిద్దరూ రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారు. కాళ్లకు బలపం కట్టుకుని రాష్ట్రమంతా అవిశ్రాంతంగా పర్యటిస్తున్నారు. అధినేత చేతిలో బ్రహ్మాస్ర్తాలై ప్రత్యర్థి పార్టీలకు గుబులు పుట్టిస్తున్నారు.
సాధారణ నాయకుల్లా భేషజాలకు పోకుండా కిందిస్థ్ధాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలుకరిస్తూ ముందుకు సాగుతున్న తీరు వారి నాయకత్వ పటిమకు అద్దం పడుతున్నది. ఊరూరా కార్యకర్తలను గుర్తుపట్టి భుజం తట్టడం, సాధకబాధకాలను ఆరాతీస్తూ ఎక్కడ ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా వెంటనే అక్కడ వాలిపోయి సమస్యను సరిదిద్దటం వంటి పనులతో కృష్ణార్జునులు అగ్రస్థాయి నేతలుగా ఎదిగారు. ప్రతి పార్టీ ఎంత ఆర్భాటంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినా పోలింగ్ సమయంలో మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే బోల్తా పడుతుంది. కీలకమైన ఈ అంశంలో కేసీఆర్ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయడంలో కేటీఆర్, హరీశ్రావులను మించిన చాణక్యులు లేరనేది వాస్తవం. అధినేత ఆలోచనలో ఏముందో గుర్తించి తూచ తప్పకుండా ఆచరణలో పెట్టడంలో ఇద్దరూ ఇద్దరే.
రాజకీయమైనా, ప్రభుత్వ వ్యవహారమైనా ఇద్దరూ కలిసి గోదాలోకి దిగిపోతారు. ప్రత్యర్థులను చీల్చి చెండాడటంలోనూ, పదునైన విమర్శలు సంధించడంలోనూ, దీటైన వ్యూహాలు రచించి అమలు చేయడంలోనూ ఎవరికి వారే సాటి. బుజ్జగింపులు, హెచ్చరికలతో దారికొస్తే సరి, లేదంటే తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోవడమే ఆ ఇద్దరికీ తెలిసిన రాజకీయం.
సీఎం కేసీఆర్ తర్వాత వీరిద్దరూ బీఆర్ఎస్కు కర్త, కర్మ, క్రియ. ఒకరు హైదరాబాద్లో ఉంటే, మరొకరు జిల్లాల్లో, ఒకరు మెదక్లో ఉంటే, మరొకరు నల్లగొండలో, తూర్పు వైపు ఒకరు వెళితే, ఉత్తరాన చక్కబెట్టే వారు మరొకరు. అసంతృప్తులను బుజ్జగించడం, ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం.. ఇలా అటూ ఇటూ రాజకీయం నెరుపుతూ అదుర్స్ అనిపిస్తున్నారు కేటీఆర్, హరీశ్రావులు.
సీఎం కేసీఆర్ నాలుగు నెలలు ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించి విపక్ష పార్టీలకు షాక్ ఇచ్చారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత అసమ్మతి నేతలు భారీగా కాంగ్రెస్, బీజేపీలోకి వలస వస్తారని ఆ పార్టీ నేతలు ఆశించారు. కానీ కేటీఆర్, హరీశ్రావు తమ పదునైన వ్యూహాలతో ఆ రెండు పార్టీల ఆశలపై నీళ్లు చల్లారు. రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పటికే నిరూపించుకున్నారు మంత్రి కేటీఆర్. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్.. తెలంగాణ సమాజాన్ని ఆలోచనలో పడేసేలా సూటిగా, స్పష్టంగా తన వాదన వినిపిస్తూ ఉంటారు.
రాజకీయాల్లోనే కాదు తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులపైనా, కంపెనీలను ఆకర్షించడంలోనూ కేటీఆర్ మార్క్ వేరు. ఇక, హరీశ్రావు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మామను మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో మరేపార్టీకి లేని ఆయుధాలు వాళ్లు. యూత్ ఐకాన్, ైస్టెలిష్ పొలిటీషియన్ అని ఒకరిని, ఆరడుగుల బుల్లె ట్, ట్రబుల్ షూటర్ అని మరొకరిని పార్టీ శ్రేణులు ఇష్టంగా పిలుచుకొంటారు.
ఆగస్టు 21న బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటినుంచి మంత్రులిద్దరూ రాష్ట్రంలోని 64 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చారు. మంత్రుల సుడిగాలి పర్యటనలతో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా హ్యాట్రిక్ కొట్టాలన్న వజ్రసంకల్పం బీఆర్ఎస్ శ్రేణుల్లో తొణకిసలాడుతున్నది. బీఆర్ఎస్ శ్రేణుల సమరోత్సాహ ప్రదర్శనను చూసి కాంగ్రెస్, బీజేపీలు బెంబేలెత్తిపోతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ.. సంక్షేమ ఫలాలు అనుభవించిన కుటుంబాలను నేరుగా కలుస్తూ బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూ డో సారి అధికారాన్ని చేపట్టాల్సిన అనివార్యతలను ప్రజలకు వివరిస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ను నిలబెట్టేది ఈ కృష్ణార్జునులే అన్నది జగమెరిగిన సత్యం. మరి సీఎం కేసీఆర్ చరిష్మా, వీరి వ్యూహాలతో ఎన్నికల కురుక్షేత్రంలో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం సునాయాసమేనని చెప్పడంలో సందేహం లేదు.
కోలేటి దామోదర్
98491 44406