ఇప్పటిదాక దేశంలో అన్ని పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో తమను గెలిపించమని ప్రజల దగ్గరికెళ్తారు. ప్రజలకు తమలో ఉన్న గుణగణాలను చెప్పటం కన్నా ప్రత్యర్థులపై ఆరోపణలు, నిందలు వేయటం వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మరికొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులను గిల్లి.. గిచ్చి.. రెచ్చగొట్టి తద్వారా నాలుగు ఓట్లు రాబట్టుకోవాలని చూస్తారు. వ్యక్తిగత నిందలు, వ్యక్తిత్వ విమర్శలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రసంగాలు చేస్తుంటారు. అదే రాజకీయమని సిద్ధ్దాంతీకరించారు కూడా.
ఎన్నికలంటే పరస్పరం దూషించుకోవడం, బట్టకాల్చి మీదేయటం అనుకొని రెచ్చిపోతుంటారు. కానీ, తెలంగాణలో అందుకు భిన్నమైన వాతావరణం బీఆర్ఎస్ రూపంలో ప్రత్యేకించి కేసీఆర్ తీరుతో ఒక కొత్త అధ్యాయానికి తెరదీసిందని చెప్పాలి.
2014 నుంచి ఇప్పటిదాక జరిగిన రెండు సాధారణ ఎన్నికలు, ఆ మధ్య కాలంలో వచ్చిన ఉప ఎన్నికల సందర్భంలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు ఒక సరికొత్త రాజకీయ పరిణతికి బాటలు వేశాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే లేదా ప్రసంగిస్తే వాటి పర్యవసానాలెలా ఉంటాయో తెలిసిన నాయకుడిగా పరిపక్వ రాజకీయ ప్రసంగాలు చేస్తూ తెలంగాణ ప్రజలను తన విద్యార్థులుగా తలచి, వారిని సన్మార్గంలో నడిపించే ప్రయత్నంలో భాగంగా ఆయన అడుగులు వేస్తున్నారు.
2014 ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీగా అధికారంలోకి వచ్చి తెలంగాణ ఎలా మారుతుందో బాధ్యతగా చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించగలిగారు కేసీఆర్. 2018 ఎన్నికల్లో తెచ్చుకున్న తెలంగాణను కాపాడే ప్రయత్నంలో, సంక్షేమాభివృద్ధి పథకాలకు అంకురార్పణ చేసి వాటి ఫలితాల ఆవశ్యకతను చెప్పి మరీ ఓటర్ల మదిని గెలిచారు. ఇప్పుడూ అంతే బాధ్యతతో రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా, దేశంలో ఎక్కడాలేని సంక్షేమ రాజ్యం తీసుకొచ్చిన ప్రభుత్వంగా మరోసారి ప్రజల మనసులు గెలవాలన్న సత్సంకల్పంతో ఎన్నికల్లో పార్టీలు కాకుండా ప్రజలే గెలువాలనీ, ప్రతి ఎన్నికల సభలో కేసీఆర్ ప్రసంగిస్తున్న తీరును జనం స్వాగతిస్తున్నారు.
ఎన్నికల ప్రచార సభల్లో ‘తెలంగాణ ఒకప్పుడు ఎట్లున్నది.. ఇప్పుడు ఎలా మారిందో’ వివరిస్తున్నారు. స్పష్టమైన విధానంతో, అవగాహనతో ఓటింగ్ జరిగినప్పుడే ప్రజలు గెలుస్తారని, ప్రజల కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు. ‘ఎన్నికలు చాలా వస్తయి, చాలా పోత యి, ఎవరో ఒకరు గెలుస్తుంటరు. ఎన్నికలు రాంగనే ఆగమాగం కావొద్దు. రాయేందో.. రత్నమేందో ఆలోచించాలె. మనకు పనికొచ్చేదేందో గుర్తు వట్టాలె’ అని చెప్పుకొస్తున్నారు. ఎవరో చెప్పారని ఓట్లు వేయొద్దని, ఓటు మన తలరాతను మారుస్తుందని పేర్కొంటున్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతుకు తెల్లందాక కరెంటు పెట్టబోయే బాధ లేదు. ఇప్పుడు కంటి నిండా నిద్ర.. కడుపు నిండా కరెంటు .. కల్లా ల నిండా వడ్లు.
ఏ గ్రామంలో చూసి నా, ఏ తారు రోడ్డులో చూసినా ధాన్యపు రాశులు. ప్రతి ఊరిలో వైకుంఠధామాలు, ప్రకృతివనాలు, కొత్త పంచాయతీ భవంతులు, సరికొత్త గుడులు, బడులు ఇలా చెప్పుకుంటూ పోతే పల్లే హాయిగా నిద్రపోయే పరిస్థితి. అందుకే ‘మాకు తెలిసిన తెలంగాణ అట్లున్నది… కానీ, ఇప్పుడు తెలంగాణ ఇట్లున్నదని’ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను వల్లె వేస్తూ ఆ తరం ఈ తరంతో చర్చ పెడుతున్నది. గతంలో పింఛన్ రూ.200 ఇచ్చారని కేసీఆర్ ప్రతి సభలో గుర్తుచేస్తున్నారు. ఎందుకు పింఛన్ ఇవ్వాలి?. ఎందుకు ఆ పింఛన్ను పెంచాల్సి వచ్చిందోనని విడమరిచి చెప్తున్న తీరుపై వయో వృద్ధులు కచ్చీర్లలో చర్చలు పెడుతున్నారు. తడారిన నేలకు కాళేశ్వరం నీళ్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్తో పాటు ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకానికి లబ్ధిదారుడుంటారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు యువతను రెచ్చగొట్టినా, ప్రలోభాలకు గురిచేసినప్పటికీ ప్రజా విజయాలు-ప్రభుత్వ ఫలాల రూపంలో కండ్లముందే కనపడుతున్నాయి.
వ్యవసాయ మార్కెట్లు ఆధునికీకరించటంతో పాటు గ్రామగామాన రైతు వేదికలు, ధరణితో భూ హక్కుల కల్పన, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, బోదకాలు, కిడ్నీ బాధితులకు, వికలాంగులకు ఆసరా పింఛన్లు ఇచ్చి వారిలో ఆత్మైస్థెర్యం నింపటం, పూజారు లు, ఇమామ్లు, మౌజంలకు గౌరవ వేతనాలివ్వటం, ఉమ్మడి పాలనలో శంకుస్థాపనలకే పరిమితమైన ప్రాజెక్టులను పూర్తిచేయడం, చేప పిల్లల ఉచిత పంపిణీ, గొల్ల కుర్మలకు గొర్లను పంచి వారి జీవితాల్లో ఆనందాలు పంచడం వంటివాటిపై ఆయా సామాజికవర్గాల్లో చర్చ జరుగుతుండటం ముదావహం. అలాగే అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలు నిర్మించి పాలనా వ్యవస్థను గ్రామీణ ప్రజలకు చేరువ చేసిన తీరుపై జనంలో చర్చ జరుగుతున్నది. వైద్యారోగ్యంలో విప్లవాత్మక మార్పులు, 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు, బస్తీ, గ్రామీణ దవాఖానలతో పాటు రూపురేఖలు మారిన హైదరాబాద్, కొత్త ఫ్లై ఓవర్లు, కొత్త సచివాలయం, అంబేద్క ర్ విగ్రహం, ఐటీ వృద్ధిపై సానుకూల చర్చ జరుగుతున్నది. ప్రజలు గెలువ టమంటేనే ఇలాంటివన్న దృక్పథం ప్రతి పల్లెలో కనిపిస్తున్నది. ప్రజలు గెలిచిన తీరు, గెలువాల్సిన ఆవశ్యకత పై కేసీఆర్ తన నాలుగు కోట్ల మందిని జాగృతం చేయటంలో సఫలీకృతులయ్యారనే చెప్పాలి.
-వెంకట్ గుంటిపల్లి
94949 41001