‘అవ్వ అరుగు మండారే కొద్దిగ సోరు పోడ’, ‘అరే సీనా.. నాను పని మేనే ఇక్కిరే నీనే పోటుగుండు ఉను’… ఇదేదో కిలికిలి భాష లెక్కుందని పరేషాన్ గాకుర్రి. ‘అమ్మా.. ఆకలైతున్నదే, కొంచెం బువ్వెయ్యే’ అని నేనంటే కొట్టుకొచ్చిన ఈత బరిగెలను ముందటేసుకున్న అమ్మ ‘అరే సీనా.. నేను పని మీదున్న.. బువ్వ నువ్వే ఏసుకొని తినుపోరా…’ అని శెప్పవట్టింది. ఇంతకు మేం మాట్లాడుకున్నదేం భాషనో తెలుసా? ‘ఎరుకలి’ భాష. అవును మేం ఎరుకలోల్లమే.
‘ఎందాసే మొనుకు సోరు పోడు నీ పని మేనే మన్నోడా..’, ‘ఇయిద్దన పనిగూడ ఇళ్లకుంటే అయిద్దన సోరు గూడ దొరుకుదుల్లా..’ పందులను గూట్లెకు దోలవోతున్న బాపు ‘నీ పనికినా వారెత్తు.. పోరనికన్న ఎక్కువనా, ఆనికి ముందుగాళ్లనైతే బువ్వెయ్యిపో’ అని అమ్మ మీదికి గుడ్లు దెర్సి గుర్కాయించి జూసిండు. ‘మాసాల్ గని పోవయా… చేసే పనిని తిట్టవడ్తివి, ఇదే పని లేకుంటే మనకు, మన పోరగాండ్లకు బువ్వ దొరుకుతుండేనా..’ అమ్మ పోశవ్వకు కోపం నషాళానికంటి బాపును బైటికి గెదిమింది. ‘నింగులు లొల్లి ఇట్టుగమానే నానే సోరు పోటుగుండు ఉంకేగాని..’ అమ్మా-బాపుల లొల్లి జూసి.. ‘మీరు లొల్లి వెట్టుకోకుర్రే, బువ్వేసుకొని నేను మా తింటగని’ అనుకుంటా కుండకాడికుర్కిన.
నాకు నాలుగేండ్లున్నప్పుడు… ఇప్పటి పెద్దపల్లి జిల్లా కాసులపల్లి మా ఊరు. అక్కన్నుంచి సొప్పదండికి వలసొచ్చినం. సొప్పదండిలనే బాపు సాయిలు రోజు పందులను కాస్తుండె, అమ్మ ఈదుళ్లల్లకు వొయి ఈత బరిగెలు కొట్టుకత్తుండె. వాటిని పల్గజీరి తట్టలు, గంపలు, కోడిగూళ్లు తయారుజేస్తుండె.
ముందుగాళ్ల అక్క, ఆమె తర్వాత నేను, నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు. అమ్మ ఐదు తట్టలల్లిస్తే అడ్డెడు వడ్లు వోసేటోళ్లు కాపుదనపోల్లు. బాపుకున్న ముప్పై, నలభై పందులే మా ఆస్తిపాస్తులు. బాపు దంటకు నేను పందుల గాయవోతే… అమ్మ దంటకు అక్కాతమ్ముళ్లు ఈతబరిగెలు కొట్టుకరావడానికి వోయేటోళ్లు. ఇగ తిండికే తిప్పలుందంటే ప్రైవేటు బడులెక్కడియి? అటు నపరో సార్గం జేసుకుంటనే ఇటు సొప్పదండి సర్కారు బళ్లనే ఇంటి నలుగురం సదువుకున్నం.
2008ల బాపు సడుగుపొంటి పందులను మేపుతున్నడు. ఎర్కలేని రెండుగీరల బండోడు రువ్వడిగొచ్చి బాపును గుద్దివోయిండు. ఆ దెబ్బకు ఆయన కోమాలకు వోయిండు. కొన్ని రోజులకు కోలుకున్నా… ఆయన మంచానికే పరిమితమైండు. మునుపటి లెక్క ఎగవడి పని చేయలేకపోయిండు. కాల్జేతులాడితేగానీ కడుపునిండని మా జీవితాలకు బాపు సాయిలుకు జరిగిన ప్రమాదం పెద్ద దెబ్బ. ఇదిట్ల ఉంటే ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ తట్టల పుణ్యమాని అమ్మకు చేతిపని కూడా కరువైంది. ఎన్నటికీ కరుగని ప్లాస్టిక్ తట్టలు, గంపల ముందు అమ్మ తెలివి శిన్నవోయింది. తిండికి తిప్పలై ఒగల్ని జూసి ఒగలు కడుపు మాడ్సుకొని పండుకున్న రోజులు మస్తుగున్నయి. ఇగ లాభం లేదని అమ్మనే తెగించి ముందడుగేసింది. ప్లాస్టిక్ కవర్లు, పాత పేపర్లు, రేకు డబ్బాలు ఏరుకొచ్చి పోశవ్వనే మా ఇంటిని సాకింది.
‘మన రాష్ట్రం మనకొస్తే… మన ఉద్యోగాలు మనకొస్తయి’ అనే నినాదమే నన్ను ఎంబీఏ దాన్క సదివిపిచ్చింది. 2012ల ఎంబీయే అయిపోయింది. 2014 జూన్ 2న తెలంగాణొచ్చింది. తెలంగాణొచ్చినంకనే నా మకాం సొప్పదండి నుంచి కన్నారంలోని గీతాభవన్ ఎన్క సందిలకు మారింది. నాటి నుంచి 2018 దాన్క తెల్లారితే సదువుడే, పొద్దుగూకితే సదువుడే. కడుపుకు అన్నం లేకున్నా మంచిదే గనీ, చేతిల కితాబ్ లేకుండా మాత్రం నిద్రవోలె. తిండికి తిప్పలైనప్పుడల్లా సోపతిగాళ్లే నన్ను ఆదుకున్నరు. ఎట్లజేసి ఉద్యోగం కొట్టాలెనన్న కసితోని సదివితే… 2019 ఏప్రిల్ 12న జూనియర్ పంచాయతీ సెక్రటరీగా ఎంపికైన. మొట్టమొదటిసారి ‘సార్ల శ్రీనివాస్’ అని ఫైల్ మీద ఒక అధికారిగా సంతకం జేసినప్పుడు మస్తు సంబురమైంది.
నౌకరి ఎక్కినకాన్నుంచి మొదలు గత నాలుగేండ్లుగా కన్నారం జిల్లా గంగాధర మండలం గట్టుభూత్కూర్లనే పన్జేస్తున్న. నౌకరి ఎక్కినప్పుడే ఒట్టేసిన.. భూత్కూర్ను గట్టు మీద కూసోవెడుతనని. నేననుకున్నట్టే ఇప్పుడు ‘గట్టు భూత్కూర్’ ఆదర్శ గ్రామం. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఉన్నతాధికారులు, సర్పంచి, ఇతర నాయకులు, ప్రజల సహకారంతో గట్టుభూత్కూరుకు రెండు జాతీయ అవార్డులు వచ్చినయి. ట్రైనీ ఐఏఎస్లు 25 మంది మా గట్టుభూత్కూరును సందర్శించిపోయిండ్రంటే మా ఊరు ఎంత మంచిగైందో అర్థం జేసుకోర్రి.
నౌకరి సంగతట్లుంటే.. అదెప్పుడు పర్మినెంట్ అయితదా అని ఆశకొద్ది ఎదిరిజూసినం. ఇంతల్నే… ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్)లను క్రమబద్ధీకరిస్తూ మొన్న మొన్న నిర్ణయం తీసుకున్నడు. కేసీఆర్ నిర్ణయం నా అసొంటి 9 వేల మంది కుటుంబాల్లో వెలుగులు నింపింది. నిజమే… తెలంగాణొస్తే మన కొలువులు మనకొస్తున్నయి.