‘కేసీఆర్ ఇచ్చినంతనే తప్ప.. పింఛను పెంచలేదు, కొత్తగ ఇవ్వలేదు..’ అనే కోణంలో సార్వత్రిక ఎన్నికల్లో లాభితులు, ఆశావహుల మనసు కేసీఆర్వైపే గుంజిందని వినవస్తున్నది. ఈమాత్రం పింఛను కేసీఆర్ పుణ్యమే కదా అని పోలింగ్ సరళిని ఇమాందారి పట్టించినట్టు తెలియవస్తున్నది. రైతు లోకానిదీ దాదాపు ఇటువంటి అంతరంగమేనని వినికిడి. సామాజిక భద్రత పింఛనుదారుల్లో మాదిరిగానే, అన్నదాతల్లోనూ సగటున వయసులో పెద్దవారే ఎక్కువగా ఉంటారు. ఈ వర్గాల్లో చాలామంది స్వీయ మథనం మీదటే ఈవీఎంల బటన్ ఒత్తినట్టు చర్చ జరుగుతున్నది.
తొమ్మిదిన్నరేండ్ల పాటు కడుపారా సంక్షేమాన్ని ఆస్వాదించిన ఆయా వర్గాలు ఈ ఐదు మాసాల అనుభవాన్ని బేరీజు వేసుకుని ఉంటారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఇవి జాతీయ ఎన్నికలే అయినప్పటికీ, వయసు పైబడిన వారిలో చాలా మంది ఆలోచన భిన్నంగా ఉండొచ్చు. తమ సంక్షేమం ‘కేంద్రం’గానే వారు ఓటును నిర్ణయిస్తుంటారు. తెలంగాణలో వివిధ రకాల పింఛను లబ్ధిదారుల సంఖ్య దాదాపు 44.82 లక్షలు. సాధారణ పింఛను రూ.2 వేలు. అయితే వచ్చే నెల నుంచి రూ.4 వేలు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
అప్పటి పింఛనుకు చిహ్నంగా చేతి రెండు వేళ్లు, తాము అధికారంలోకి వచ్చిన తదుపరి మాసం నుంచి ఇచ్చే రూ.4 వేలకు గుర్తుగా చేతి నాలుగు వేళ్లను చూపిస్తూ ఆ విషయాన్ని ఆయన జనంలోకి బాగా తీసుకెళ్లగలిగారు. పింఛన్ డబుల్ అవుతుందనే ఆశలు రేకెత్తించారు. అయితే సీఎంగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు దాటినా డబుల్ పింఛను లబ్ధిదారుల అనుభవంలోకి రాలేదు. ఈ అంశం వాళ్లలో అనేక మందిని ఆలోచింపజేసిందని అంటున్నారు. ఆ మేరకు ఓటింగ్లో ప్రభావం పడటంపై విశ్లేషిస్తున్నారు. పింఛను పెంపుతో నిమిత్తం లేకుండా కనీస సామాజిక భద్రత పారితోషికాన్ని రూ.2 వేలు చేసింది కేసీఆరే కదా అనే కృతజ్ఞతతో కట్క ఒత్తారని కూడా అంటున్నారు.
ఇదిలా ఉంటే.. మొత్తానికి ఆపసోపాలతో కడపటి ఫసలు రైతుబంధు చాలామటుకు వేసినప్పటికీ సాగదీత ధోరణి కర్షకులు మనసు మీదకు తీసుకునేలా చేసిందనే అభిప్రాయం లేకపోలేదు. రాష్ట్రంలో 1.43 కోట్ల ఎకరాలకు గానూ 58.33 లక్షల మంది వ్యవసాయదారులకు కేసీఆర్ సర్కారు సాలీనా రెండు పర్యాయాలు కలిపి రూ.10 వేల చొప్పున నగదు బదిలీ చేసింది. రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం బాస చేసింది. పెంపు అటుంచి పాత మొత్తం ఇవ్వడంలోనే తటపటాయింపులు రైతులను కినుక వహింపజేశాయనే మాట వచ్చింది. ఇదీ ఎంత వరకు ప్రభావితం చేసి ఉంటుందన్న తీసివేతలు, కూడికలు జోరందుకుంటున్నాయి. విశ్వసనీయతా కొలమానం అవుతున్నది.
ఈ లోక్సభ ఎన్నికల నాటికి 3.32 కోట్ల మంది ఓటరు జాబితాల్లో ఉన్నారు. వీరిలో 50 ఏండ్లు పైబడిన వారు రమారమి 95 లక్షల మంది. అన్ని వయసుల వారికీ ప్రీతిపాత్రులైన కేసీఆర్ ముఖ్యంగా పెద్దవాళ్ల మదిలో గట్టిగా సంక్షేమ ముద్ర వేశారనే పేరుంది. ‘కేసీఆర్ గుండెల్లో తెలంగాణ.. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్’ అనే కేసీఆర్ వాక్కు ఈవీఎంలలో ప్రతిఫలిస్తుందనే అంచనాలున్నాయి.
ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384