ఏదేని విషయంలో ఒక మనిషిని ఎన్నుకోవాలంటే ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి? నిజానికి ఏ ఎన్నికైనా ఆ మనిషి ప్రవర్తనను నిశితంగా పరిశీలించాలి. ఆ ప్రవర్తన ద్వారా అతని లేక ఆమె ఆలోచనలు అర్థం చేసుకోవాలి. ఆలోచనలు రెండు విధాలుగా బయటపడుతాయి.మనిషి మాట, మనిషి ప్రవర్తన అయితే చాలాసార్లు వ్యక్తిని బేరీజు వెయ్యటానికి వీలులేకుండా ఉంటాయి. రాజకీయ రంగంలో అయితే ఇది ఎక్కువగా చూస్తాం. ఉదాహరణలను కింద చూద్దాం పదండి…
2014లో నరేంద్ర మోదీ ఏం చెప్పారు? అధిక కాలం పాలించిన కాంగ్రెస్ నేతలు విదేశాల్లో దాచుకున్న నల్లధనం తీసుకువచ్చి ప్రతీ భారతీయుడికి 15 లక్షలు ఇస్తామనీ, అందరినీ బ్యాంకు ఖాతాలు తెరిచి సిద్ధంగా ఉండమనీ చెప్పారు. అది మాట! మరి ఈ పదేండ్లలో ఒక్క పైసా అయినా ఇచ్చారా? పైగా మానవ మాత్రుడికి తెలియకుండా అర్ధరాత్రి అకస్మాత్తుగా పెద్దనోట్లు రద్దు చేసి సామాన్యులందరినీ సతమతం చేశారు. మార్పిడి కోసం బ్యాంకు లైన్లలో నించున్నవారు దాదాపు 700 మంది మృత్యువాత పడ్డారు. ధనవంతులైన వారు దర్జాగా ఇంటిదగ్గర కూర్చొని కోట్లకు కోట్లు బ్యాంకు వ్యానుల్లోనే డబ్బు మార్చుకున్నారు. దీనివల్ల ఏం తెలుస్తోంది? మన ప్రధానమంత్రి చెప్పింది చేయరు, చేసేది చెప్పరు! ఇలా బోలెడు ఉదాహరణలు చెప్పవచ్చు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిచ్చారా 2014 ఎన్నికల భాషణల్లో చెప్పినట్టు? రెండవసారి ఎన్నికలప్పుడు రైతుల మీద గురిపెట్టారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.
గెలిచారు. ఏం చేశారు. దేశంలోని రైతులంతా ఏకీకృత (కార్పొరేట్) కంపెనీలు నడిపే ధనవంతుల పంజాల్లో బందీలయేటట్టు నల్లచట్టాలు తెచ్చారు. విస్తుపోయిన రైతులంతా నిరసన తెలుపుతూ ఏడాదిపైన రోడ్ల మీద ఉద్యమం చేశారు. అన్యాయంగా 750 మంది చనిపోయారు. మరి మోదీ చెప్పిందేమిటి? చేసిందేమిటి? అంటే మాటకు, ప్రవర్తనకు ఎంత తేడా ఉంది? ఇంకొక్క ఉదాహరణ! కాంగ్రెస్ ప్రభుత్వం ధరల పెరుగుదలను ఆపడంలో విఫలమై సామాన్యుల జీవితాలు దుఃఖమయం చేసిందని ఎన్నికల భాషణలిచ్చి తను అధికారంలోకి వచ్చాక ఆయన చేసిందేమిటి? 20 కోట్ల మంది ప్రజలు కిందిస్థాయి జీవితంలోకి జారిపోయారు. ధరలు ఆకాశాన్నంటడం కాదు, ఇంకా పైపైకి అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాయి. తెలంగాణలో గెలిచిన బీజేపీ నాయకులు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చారా? మరి ఆలోచనలు దాచుకొని, అబద్ధపు మాటలు చెప్పే నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని నమ్మి ఓటేయాలా? వారి ప్రవర్తనను పరిశీలించి వారి మనస్సులో ఉన్న ఆలోచనలు అర్థం చేసుకొని పదేండ్ల అనుభవం చాలని వారిని తరిమికొట్టాలా? ప్రజలు నిశితంగా ఆలోచించుకోవాలి.
ఇక రెండో పార్టీ కాంగ్రెస్! 60 ఏండ్లు దేశాన్ని పరిపాలించి, మేధావులను విదేశాలకు పంపి, దేశంలో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా, కనీసం మంచి తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు ఇవ్వకుండా పరిపాలన సాగించారు. ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ దవాఖానలను పట్టించుకోకుండా, వెనుకబడిన వర్గాలకు ఏ సహాయం చేయకుండా స్వాతంత్య్రం మేమే తెచ్చామని డప్పు కొట్టుకొని గెలుస్తూ వచ్చారు. మరి మన అనుభవానికి షష్టిపూర్తి ముగిసింది. ఇంకా ఈ పార్టీ నాయకులు చెప్పే మాటలు నమ్ముదామా? నిన్న మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచి రెండు నెలలు కాకుండా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను పడుకోబెట్టింది. చేతులెత్తేసింది. మరి వారి మాటలకు, చేతలకు ఎంత తేడా ఉన్నదో అర్థం చేసుకోవాలి. ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి, తర్వాత అవినీతి సాగించే ఆ పార్టీ ఆలోచనలు అర్థం చేసుకోవాలి.
ఒక మనిషి మనకు చూడగానే అర్థం కాడు. మాటలు కూడా అతని లోపలి ఆలోచనలకు సరైన కొలమానం కాదని మోదీ ప్రవర్తన, కాంగ్రెస్ నాయకుల పరిపాలన మనకు చక్కగా పాఠాలు చెప్పాయి. మరి ఈ గతాన్ని లెక్కచేయకుండా, మళ్లీ వారిని పీఠం మీద కూర్చోపెడితే సామాన్యుల బతుకు బండలవదా? ఆలోచించండి. ఇక ఇప్పుడు మన రాష్ర్టాన్ని పరిపాలిస్తున్న బీఆర్ఎస్ పార్టీ గురించి చూద్దాం!
కేసీఆర్ పద్నాలుగేండ్లు ఉద్యమం నడిపారు. ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు భరించి, సహించి, ఇటు రాష్ట్రంలో అధికారం చెలాయించి ఆంధ్రా నాయకులను, అటు కేంద్రంలో పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, ఇతర పార్టీల నాయకులను ఒప్పించటానికి అష్టకష్టాలు పడ్డారు. 38 పార్టీలను ఒప్పించే బాధ్యత తీసుకొని వారితో సంప్రదింపులు జరిపారు. చివరికి రాష్ట్ర ప్రకటన చేసి, మళ్లీ ఇతర శక్తులకు లొంగి ప్రక్రియను వెనక్కితోసిన కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ ఆఖరు పోరాటం మొదలు పెట్టారు. తన ఆమరణ నిరాహార దీక్షతో రాష్ర్టాన్ని సాధించారు. అంటే ‘రాష్ట్రం వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో’ అని చెప్పిన మాటకు కట్టుపడ్డారు.
రాష్ట్రం సాధించాలనే ఆలోచన, మాట, ప్రవర్తన అన్నీ కలిసి ఉన్నాయి ఆయనలో. అంటే ఏ పనిచేసినా త్రికరణ శుద్ధిగా చేసే రాజకీయ నాయకుడు ఆయన. మరి అటువంటి నాయకుడు ఇంకొకరు వర్తమాన రాజకీయాలలో ఉన్నారా? ఊరికే తూతూ మంత్రంగా చెప్పినవి చేయడం కాదు; అహర్నిశలు ప్రజల గురించి ఆలోచిస్తూ ఇంకా వారికి ఏం చేయగలన ని తపన పడే నాయకుడు. ఎన్నికల ముందు ఆయన చెప్పింది చేశారా లేదా అన్నది ఈ తొమ్మిదేండ్లలో ప్రజల ముందున్నది. చెప్పనివి కూడా ఏం చేశారు అన్న చర్చ చేయాలి ప్రజలు. గర్భిణుల గురించిన ఆలోచనతో పుట్టబోయే తరం వారి ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నారో విశ్లేషించాలి. రైతులు, విద్యాలయాలు, కలెక్టరేట్ భవనాలు రోడ్లు వంటి వివిధ సౌకర్యాలు, ముఖ్యంగా పల్లెలు, పట్టణాల అభివృద్ధి, చివరికి చనిపోయిన మనిషిని గౌరవంగా సాగనంపటానికి వైకుంఠధామాలు ఇవన్నీ ఎవరికోసం చేస్తున్నారు? ప్రజల కోసమేగా!
ఈ విషయాలు నేతల రాజకీయ ప్రవర్తన, గత అనుభవాలు క్రోడీకరించి, జాగ్రత్తగా ఓటుహక్కును వినియోగించుకోవాలి ప్రజలు. సరైన ఎంపిక అభివృద్ధికి దారితీస్తే, మాటల రాయుళ్ళ మాయమాటల్లో పడి తప్పు ఎంపిక చేస్తే అధఃపాతాళానికి తీసుకెడ్తుంది ప్రజలను. 2014 దాకా కాంగ్రెస్ పాలన, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పాలన అంతే కదా చేసింది! ధనవంతులెప్పుడూ తమ ధనబలంతో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ మాట సాగించుకుంటారు. కానీ, 85 శాతం సామాన్య ప్రజలు మాత్రం నష్టపోతారు.
అందుకే ఎన్నికలొచ్చినప్పుడు వారు అప్రమత్తంగా ఉండాలి; మాటలకు, ప్రలోభాలకు లొంగకూడదు.గత అనుభవాన్ని అర్థం చేసుకొని ప్రజల పట్ల అభిమానం, రాష్ర్టాభివృద్ధి జరగాలనే ఆలోచన ఉండి రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకు, రాష్ట్ర ప్రగతికి పనిచేసేవాళ్లకే ఓట్లు వేయాలి. చిత్తశుద్ధి, ప్రజల పట్ల అభిమానం, ప్రగతి సాధించగలిగిన నాయకుడైన కేసీఆర్ 2014 నుంచి చెప్పినవి, చేసినవి చూసి ఆయన ఆలోచన ఏ దారిలో ఉందో అర్థం చేసుకొని, చాలా జాగ్రత్తగా సరైన పార్టీని అధికారంలో కూర్చోబెట్టాలి. అటువంటి విచక్షణ ప్రజలకున్నదని ఆశిద్దాం!
-కనకదుర్గ దంటు
89772 43484