మన దేశానికి మేలు చేసిన మహానుభావులను తలుచుకోవడంలో, గౌరవించుకోవడంలో తెలంగాణ సమాజంలో ఆద్యులు కేసీఆర్. సమర్థులు, త్యాగశీలురు, దివికేగినా, మన మధ్యలో ఉన్నా, ఎక్కడున్నా ఆ కీర్తి శిఖరాలను నేటి, రేపటి తరాల ముంగిట నిలుపగలిగే శక్తిసంపన్నులు కేసీఆర్. దేశాన్ని సుస్థిరం చేసిన దివంగత పీవీ గొప్ప ప్రజ్ఞ గురించి ఏకంగా ఏడాది పాటు సజీవంగా ఉంచడం తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్కు మాత్రమే సాధ్యమైంది. అందుకు అక్షర సంతకం చేయడంలో ‘నమస్తే తెలంగాణ’ తోడయింది.
బహుశా ఆ ప్రభావం కూడా కేంద్రానికి ప్రేరణ అయి ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ, ఎన్డీయే ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించడం వెనుక కేసీఆర్ మనో ముద్ర, అఖండ సంకల్పం ఉండకపోదు. బహుముఖ ప్రజ్ఞాశాలి, అధ్యయన శీలి, సంస్కరణల పితామహుడు, బహు భాషావేత్త, కవి, పండితుడు, రచయిత అనే విశేషణాల మాల ప్రస్తావన పూర్తి కాకముందే పీవీ ఆటోమేటిక్గా ధ్వనిస్తారు. స్ఫురిస్తారు.
సీఎం టూ పీఎం దాకా ఆ పీఠాలకే వన్నె తెచ్చిన పీవీ.. ఆ రెండు పదవుల నడుమ పోషించిన విదేశాంగ శాఖ ప్రపంచానికి మన దేశాన్ని సరికొత్తగా పరిచయం చేసింది. ముఖ్యంగా మన తెలంగాణ రేపటి పౌరులు కచ్చితంగా ఈ విశేషాలు ఔపోసన పట్టాలి. ఎందుకంటే, మన తెలంగాణలోని కరీంనగర్, ఓరుగల్లు ముద్దుబిడ్డ కాబట్టి. మనో వికాసానికి, జీవన-జన జీవన నైపుణ్యానికి, నాయకత్వ నేర్పరితనం వంటి అనేక ప్రత్యేకతల సమాహారం తన 84 ఏండ్ల జీవన విధానం కాబట్టి. పాములపర్తి వెంకట నరసింహారావు సంక్షిప్తంగా పీవీ. మన తెలంగాణ ఠీవీ.
కాకతాళీయంగా, యాదృచ్ఛికంగా లేదా దైవ బలం కాబోలు తెలంగాణ సాధకుడే ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో పీవీ శత జయంతి తలుపుతట్టింది. అప్పుడిక ఓ దండేసి, రెండు వాక్కులు చెప్పి ఊరుకునే బాపతా కేసీఆర్! కానేకాదు, ఎవరి దార్శనికత ఏమిటో, దేశానికి, సమాజానికి ఎవరెంత తోడ్పడ్డారో వర్తమాన నేతల్లో కేసీఆర్కు తెలిసినంతగా ఇంకెవరికి తెలుసు? అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేకే సారథ్యంలో కమిటీ వేసి, 2020-21లో పీవీ శత జయంత్యుత్సవాలను ఈతి బాధలు, పచ్చి కరోనా పీడనల కాలంలోనూ సంవత్సరమంతా సుసంపన్నంగా జరిపారు. సమసమాజ కాంతుల దీప స్తంభం పీవీ ఘనతను ‘లోకల్ టూ గ్లోబల్ నౌ ఏ డేస్’లో చాటించారు. ఢిల్లీలోనూ పీవీ శక్తియుక్తులను ప్రజ్వలింపజేశారు.
ఎన్నో ఆటుపోట్లు, సంక్లిష్టతలను జయించిన పీవీ విజయాలు 1990 దశకంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆఖరికి బంగారు నిల్వలను దేశం తాకట్టు పెట్టే దుస్థితి నుంచి జాతి తలెత్తుకునే సంస్కరణల ఉపాయాలు రచించి, ఆచరించిన పీవీ నాయకత్వ పటిమను దశాబ్దాల తర్వాత మళ్లా మననంలోకి తెచ్చారు. అనేక సవాళ్ల వలయంలో మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం ఐదేండ్లు కొనసాగించిన పీవీ మేధోసంపత్తి సత్తాను జనం మదిలో మరోసారి నిక్షిప్తం చేశారు. భూ, ఆర్థిక సంస్కరణల ఫలాల తాలూకు విశేషాలనూ, నవీన, నాగరిక సమాజంగా తీర్చిదిద్దిన సంగతులనూ ఏడాదంతా సాగిన నూరేండ్ల వేడుకల్లో కండ్లకు కట్టించారు.
అంతటి అత్యున్నత నాయకత్వ శిఖరం పీవీ పరమపదించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించింది. తెలుగు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ చిదిమేసింది. కానీ, తెలంగాణ ప్రతీక కేసీఆర్ మాత్రం భవిష్యత్తు తరాలకు పీవీ త్యాగాలను స్మరణలో ఉంచారు. శతజయంతి ఉత్సవాలకు ముందే పీవీ కుమార్తె, విద్యావేత్త వాణిదేవిని ఎమ్మెల్సీగా పెద్దల సభకు పంపించి విశేషంగా ఆదరించారు కేసీఆర్. దక్షిణ భారత తొట్టతొలి బాహుబలి భారత ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని 2021 జూన్ 28 నాటి శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుక ఆకాంక్షించింది. ఇప్పుడా ఉబలాటం, ఆ మనోభీష్టం నెరవేరింది. తెలంగాణ మురుస్తోంది. తెలంగాణ మనసు నిండింది.
ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384