అధ్యయనం చేయనివారు ఉత్తమ పాలకులు కాలేరు. దేశ సమస్యలను పరిష్కరించాలన్న తపన, అందుకు అవసరమైన జ్ఞానార్జన చేయనివారు దేశానికి మార్గ దర్శకత్వం వహించలేరు. ప్రస్తుత పాలకులకు ఆ తపన, జ్ఞానం కొరవడటం వల్లే దేశం ఈ దుస్థితిలో ఉంది. కానీ తన సమర్థతతో, జ్ఞాన సంపదతో తెలంగాణను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ ప్రజలకు ఆశా కిరణంలా కనిపిస్తున్నారు. భారత్ను అగ్ర దేశంగా నిలిపే ప్రణాళికను ఆవిష్కరించిన ఆయనను దేశ రాజకీయాల్లోకి స్వాగతిస్తున్నారు.
దేశాన్ని ఉద్ధరించడానికి కేవలం ఎన్నికల్లో గెలిస్తే చాలదు! దేశ ప్రజల కష్ట నష్టాలకు, సామాజిక అసమానతలకు గల కారణాలను, వాటికి గల పరిష్కారాలను, ప్రగతి సాధన మార్గాలను తెలుసుకోగల్గిన సుస్పష్టమైన జ్ఞానం దేశాధినేతకు కావాలి’ అన్నారు గాంధీ. ‘జ్ఞానాన్ని మించిన శక్తి లేదు! మనిషిలో నిద్రాణమై ఉన్న శక్తియుక్తులను వెలికితీసి, ఆచరణలో పెట్టించగలిగేది సుస్పష్టమైన జ్ఞానమే పార్థా!’ అంటున్నది భగవద్గీత. జ్ఞానం ఆకాశం నుండి ఊడి పడదు. నిరంతర అధ్యయనమే జ్ఞానార్జనకు మార్గం. నాడు జైళ్ళలో ఉన్నప్పుడు కూడా అధ్యయనం చేసిన గాంధీ, నెహ్రూ, నేతాజీ, అంబేద్కర్, భగత్ సింగ్, రాధాకృష్ణన్ వంటి మహనీయులు కనుమరుగై పోవడమే నేటి మన దేశ దురదృష్టానికి కారణం!
‘పాలకులకు చదివే తీరిక ఉండదు! కానీ అధ్యయనం చేయనివారు ఉత్తమ పాలకులు కాలేరు’ అన్నారు ప్లేటో. డబ్బుతో అధికారం, అధికారంతో డబ్బుగా మారిన నేటి రాజకీయ వ్యవస్థలో, నిరంతరం ధనార్జన చేసి ఆ ధనంతో ఓటర్లనే కాదు, ఏకంగా ఎమ్మెల్యేలనే కొని, ప్రభుత్వాలను కూల్చి గద్దె నెక్కే కుతంత్రాలలో మునిగి తేలుతున్న మన దేశాధినేతలకు ఇంక చదివే తీరిక కూడానా? అయితే దుష్ట సంక్షోభ రాజకీయ ప్రవాహ ఉధృతిని తట్టుకుంటూనే అనుభవం ద్వారా చూడటం, పరిశీలించటం; విజ్ఞులు, నిపుణులు చెప్పేవి వినటం; మంచి గ్రంథాలను, పత్రికలను చదవడం; సమాజాలను, వ్యవస్థలను అధ్యయనం చేయటం ద్వారా జ్ఞాన సంపన్నుడు కావటమే కేసీఆర్ విశిష్టత. అందువల్లనే చైనా ప్రగతి సాధించిన విధానాన్ని అధ్యయనం చేసి, ఆ మర్మాన్ని గ్రహించ గలిగారాయన.
భారత్, చైనా వంటి అధిక జనాభా గల దేశాలలో దాదాపు 50 శాతం ప్రజలు, వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలపై మీద ఆధారపడి జీవిస్తుంటారు. ఇందువల్ల వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే, వారి కొనుగోలు శక్తిని(ఆదాయం) పెంచగలిగితే వాళ్లు వివిధ వస్తువులు కొంటారు. దీని వల్ల ఆయా వస్తు పరిశ్రమలు కొత్తగా ఏర్పడతాయి. వీటి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగాల కోసం చదువుకునేవాళ్లు పెరుగుతారు. ఇలా దేశ సర్వతోముఖాభివృద్ధికి వ్యవసాయాభివృద్ధే దృఢమైన పునాది అని రష్యాలో స్టాలిన్, చైనాలో డెంగ్ గ్జ్యావో పింగ్ నిరూపించారు. దీని వల్ల చైనాలో అత్యధిక ప్రజల కొనుగోలు శక్తి పెరగటంతో, దేశదేశాల పారిశ్రామిక వేత్తలంతా రెక్కలు గట్టుకుని చైనాలో వాలారు. అలా చైనా పారిశ్రామికాభివృద్ధిని కూడా సాధించింది. అగ్ర రాజ్యం అమెరికానే సవాలు చేయగల్గిన స్థాయికి ఎదిగింది!
సూర్య కాంతిని తనలో నింపుకుని లోకానికి వెలుగునిస్తుంటాడు చంద్రుడు. అలాగే చైనా వగైరా దేశాల ప్రగతి సాధనా జ్ఞానాన్ని తనలో నింపుకుని తెలంగాణను ప్రగతి కాంతులతో నింపారు కేసీఆర్. ఆ స్ఫూర్తితో, ఆత్మ విశ్వాసంతో, దేశమంతటా ప్రగతి కాంతులను వెదజల్లేందుకు సంసిద్ధులయ్యారు. అందుకు ‘బీఆర్ఎస్’ రహదారిని రూపొందించుకున్నారు. భారత్లో 45 కోట్ల ఎకరాల సాగు భూములు, 70 వేల టీఎంసీల నదీ జలాలు ఉన్నాయని వాటి ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయవచ్చని కేసీఆర్ వివరించారు. దేశమంతటా 24 గంటల విద్యుత్తు ఇచ్చినా 108 సంవత్సరాలపాటు చాలినంత విద్యుత్తు ఉత్పత్తికి సరి పడిన బొగ్గు నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ బొగ్గులో కేవలం 20 శాతం మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామని గణాంకాలతో సహా చెప్పారు. దీనికి కారణం… వివిధ రంగాల నిపుణుల నివేదికలను ఆయన అధ్యయనం చేయడమే. జింబాబ్వే, రష్యా, ఈజిప్ట్, కొలంబియా, చైనా దేశాల స్ఫూర్తితో భారీ రిజర్వాయర్ల నిర్మాణాల ద్వారా దేశంలో ప్రతి ఎకరానికి సాగునీటిని, ప్రతి గ్రామానికి తాగునీటిని అందించ వచ్చని ఆయన చెబుతున్నారు. థర్మల్, సౌర, పవన, జల విధానాల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. తద్వారా భారతీయుల కొనుగోలు శక్తిని పెంచి, పారిశ్రామికాభివృద్ధి సాధించి భారత్ను ప్రపంచంలోనే అగ్ర దేశంగా తీర్చిదిద్దాలని సంసిద్ధులయ్యారు కేసీఆర్.
నేడు అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్న దేశ్కీ నేత కేసీఆర్! అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ వారంతా ఆశగా, ఆనందంగా ఆయనను స్వాగతించడానికి కారణం… ఆయన మాటలకు మంత్రముగ్ధులై కాదు, కేవలం 8 ఏండ్లలో దేశంలో అత్యధిక వృద్ధి రేటు సాధించిన 4వ రాష్ట్రంగా; వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్న రాష్ట్రంగా; పారిశ్రామిక, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను; హైదరాబాద్ను విశ్వ నగరంగా, గ్రీన్ సిటీగా, ప్రశాంతతకు నిలయంగా తీర్చిదిద్దిన కేసీఆర్ ఆచరణకు, జ్ఞాన శక్తికి ముగ్ధులై! అలాంటి జ్ఞాని అయిన ప్రజా నేత కేసీఆర్ భారత్ను కూడా ప్రగతి పథాన పరుగెత్తించగలడన్న పూర్ణ విశ్వాసంతోనే ఆయనను స్వాగతిస్తున్నారనేది అక్షర సత్యం! (వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్)