తెలంగాణ ప్రజలకు ‘కేసీఆర్’ అంటే ఒక భావోద్వేగం. స్వరాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన మలిదశ ఉద్యమ పోరాటం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం కేసీఆర్ చేసిన అభివృద్ధే అందుకు తార్కాణం. అయితే గతేడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్వల్ప తేడాతో అధికారం కోల్పోయినప్పటికీ, ప్రజలు అనతికాలంలోనే మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకు రెండు కారణాలున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన పదేండ్ల పాలనా కాలంలో రాష్ర్టాన్ని దేశానికి దిక్సూచిగా నిలపడం ఒకటైతే, ‘మార్పు’ పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనాతీరుపై రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే ఏవగింపు రావడం రెండవది.
100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. వచ్చీరాగానే ఆ పార్టీ ప్రజలను మోసానికి గురిచేయడం ప్రారంభించింది. అంతేకాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అలా మొదలైందో లేదో రాష్ట్రవ్యాప్తంగా తాగు, సాగు నీటికి కొరత ఏర్పడింది. కేసీఆర్ పాలనలో క్షణం కూడా కరెంటు పోకుంటే కాంగ్రెస్ పాలనలో గంటల పాటు కరెంటు కోతలు మొదలయ్యాయి. పదేండ్ల కేసీఆర్ హయంలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలైతే, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకుండా కేసీఆర్ మార్క్ పాలనను చెరిపివేసే కుట్రలు మొదలుపెట్టింది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తే పోయేవికావని గ్రహించిన ప్రజలు కాంగ్రెస్ కుటిల పన్నాగాలపై కోపోద్రిక్తులవుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ కుంగిపోలేదు. తెలంగాణ ప్రజలు తమకు అప్పజెప్పిన బాధ్యతాయుతమైన ప్రతిపక్షపు హోదాను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే మరోసారి ప్రజా నాయకుడు అనిపించుకుంటున్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బస్సుయాత్రకు.. ఏమరుపాటులో జరిగిన బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ప్రజలు తండోపతండాలుగా కదిలివస్తున్నారు. ఊరూరా ఆయనకు గుమ్మడికాయలతో దిష్ఠితీస్తూనే పూలు చల్లుతూ స్వాగతం పలుకుతున్నారు. అశేష జనవాహిని రాకతో ‘కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్’ అని బస్సుయాత్ర మరోసారి రుజువు చేస్తున్నది.
మలిదశ ఉద్యమంలో తెలంగాణ సకల జనుల మదిని దోచిన కేసీఆర్ నేడు ప్రతిపక్ష నాయకుడిగానూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్న నేటి కేసీఆర్ను చూస్తుంటే నాటి ఉద్యమ కేసీఆర్ గుర్తొస్తున్నారని ప్రజలు ఆయనకు పిడికిలెత్తి జై కొడుతున్నారు. కష్టపడి కట్టుకున్న పక్షిగూడులో రాబందులు వాలినట్టు.. తెలంగాణ పునర్నిర్మాణం సాఫీగా జరుగుతున్న వేళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు అప్పగించిన బాధ్యతాయుత అధికారాన్ని అపహాస్యం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. దేశాన్ని పదేండ్ల పాటు నిరవధికంగా పాలించిన బీజేపీ తెలంగాణ పట్ల ఎప్పుడూ సవతి తల్లిప్రేమనే చూపించింది.
తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడమే కాకుండా తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని తెలంగాణ ఏర్పాటు పట్ల విషం చిమ్మింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. మే 13న రాష్ట్రంలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని బస్సు యాత్రలో కేసీఆర్ పిలుపునిస్తుంటే ప్రజలు తమ కరతాళ ధ్వనులతో జవాబు చెప్తుండటం ముదావహం.
పలు ఉద్యమ పద్ధతులను అవలంబించి ముందుకుసాగిన కేసీఆర్ ఓటమి ఎరుగని మహానేత. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకుంటా ఎన్నో శక్తులు అడ్డుకున్నాయి. అంతమాత్రాన తెలంగాణ రాకుండా ఉండలేదు కదా? అచ్చం అలాగే పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ను చూసి కొన్ని శక్తులు ఓర్చుకోలేకపోయాయి. అందుకే కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలారు. ప్రజలను తప్పుదోవ పట్టించడంలో విజయం సాధించారు. కానీ, ఇప్పుడు ప్రజలు నిజానిజాలు గ్రహిస్తున్నారు.
అభివృద్ధి అంటే ఏమిటో, అబద్ధపు హామీలు అంటే ఏంటివో ప్రజలకు అనుభవం లోకి వచ్చింది. ప్రజలను మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకునే మనిషి కాదు కేసీఆర్. అందుకే ఏడు పదుల వయస్సు, అందులో అనారోగ్యం.. అయినా పోరాటంలో కేసీఆర్ వెనక్కి తగ్గడం లేదు. తెలంగాణ ప్రజల బాగోగుల కోసం ఊతకర్రతోనూ ఉద్యమం చేస్తానంటూ ఆయన బస్సుయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికిపోయినా కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం తెలంగాణకు శుభ సూచకం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుడు, కేయూ)
పిన్నింటి విజయ్కుమార్
90520 39109