2019 జనవరి మూడోవారం. ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మహా చండీయాగం ఘనంగా నిర్వహిస్తున్న సందర్భమది. చండీయాగం దిగ్విజయంగా పూర్తయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో కొందరు బ్రాహ్మణ పండితులతో కలిసి హైదరాబాద్ రావడానికి బయల్దేరుతున్నాం. ఇంతలో వెనుక నుంచి నిశ్శబ్దంగా ఒక పెద్దాయన వచ్చారు.
రావడంతోనే నన్ను , నా వెనుక ఉన్న అందరినీ చూసి ‘బ్రాహ్మణులందరూ భోజనాలు చేశారా? అంటూనే అందరికీ సంభావనలు అందాయా? అని అడిగారు. చాలా బాగా చేశారంటూ పండితులందరికీ చేతులు జోడించి నమస్కరించారు. వడివడిగా అడుగులేసుకుంటూ హెలికాప్టర్ వద్దకు బయల్దేరారు. ఆయన ఎవరో కాదు మన ముఖ్యమంత్రి కేసీఆర్. తన చుట్టూ ఉన్న సెక్యూరిటీని దాటుకొని ప్రయాణానికి ఆలస్యమవుతున్నా వేదపండితులను చూసి దగ్గరకు వచ్చి వారి యోగక్షేమాలను కనుక్కొన్న రాజకీయ మహర్షి కేసీఆర్. ఆ క్షణాలను ప్రత్యక్షంగా చూసి ఆయన పలకరింపును, బ్రాహ్మణ పండితుల పట్ల ఆయనకున్న భక్తిని స్వయంగా అనుభవించిన నాకు తెలంగాణలో ‘బ్రాహ్మణ సదన్’ భవనం ప్రారంభమైన తరుణంలో నాటి జ్ఞాపకాలు పదేపదే గుర్తుకొస్తున్నాయి.
లౌకికవాదానికి నిలువెత్తు సాక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నది. మతసామరస్యాన్ని కాపాడుతూనే అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. వేదాలను, సంప్రదాయాలను సంరక్షించే బ్రాహ్మణ సమాజం గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాల చేయూత, ఆదరణ లేకపోవడంతో నిస్తేజంగా మారుతూ వస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమం పట్ల చూపిస్తున ప్రత్యేక శ్రద్ధ, ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ చేపడుతున్న యాగాలు, యజ్ఞాలు , హోమాలు, పూజా కార్యక్రమాలు మిగిలిన వర్గాల వారికి కూడా స్ఫూర్తిదాయకంగా మారాయనడంలో సందేహం లేదు.
గత దశాబ్దకాలంలో తెలంగాణలోని పట్టణాలతో పాటు పల్లెల్లో చండీయాగాలు, హోమాలు, పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలు జరుగుతుండటం వెనుక కేసీఆర్ ఆచరించి చూపిన యజ్ఞఫల ప్రభావమేనని చెప్పవచ్చు. ఈ రోజు తెలంగాణ సమాజంలో వేద పండితులకు, యజ్ఞయాగాదులు నిర్వహించే పండితోత్తములకు లభిస్తున్న ఆదరణ గతంలో ఏనాడూ లేదు. పౌరోహిత్యం గిట్టుబాటు కాక, కుటుంబ పోషణ భారం కావడం, ప్రభుత్వాల ఆదరణ లేకపోవడంతో రాష్ట్రంలో బ్రాహ్మణ పండితులు తగ్గిపోతూ వస్తున్నారు. వంశాచారంగా వస్తున్న పౌరోహిత్యానికి దూరమవుతూ వస్తున్న తరుణంలో కేసీఆర్ చూపించిన ప్రత్యేకశ్రద్ధ బ్రాహ్మణ సమాజంలో కొత్త ఆశలు చిగురింపచేసింది.
‘తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్’ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, ఏటా వారి సంక్షేమానికి సుమారు 100 కోట్లు కేటాయించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రత్యేకించి వేద పండితులకు అందిస్తున్న సహకారం, వేద సంరక్షణకు పాటుపడుతున్న వారికి అండగా నిలుస్తున్న వైనం కేసీఆర్ను బ్రాహ్మణ సమాజంలో చిరస్థాయిగా నిలబెడుతున్నాయి. తెలంగాణ రాకకోసం ఉద్యమ సమయంలో ఢిల్లీలో నిర్వహించిన చండీయాగం , రాష్ట్రం ఏర్పడ్డాక చేపట్టిన అయుత చండీయాగం, విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి సూచనలతో చేపట్టిన రాజశ్యామలయాగం , సుదర్శన యాగాలు కేసీఆర్కు దైవం పట్ల ఉన్న భక్తి శ్రద్ధలు, పండితుల పట్ల ఉన్న ప్రగాఢమైన నమ్మకాన్ని తెలుపుతున్నాయి.
ఈ రోజు తెలంగాణ అన్ని రంగాలతో పాటు ఆధ్యాత్మిక రంగంలోనూ అగ్రగామిగా రూపొందింది. కేసీఆర్ చేపట్టిన ఈ క్రతువులో భాగంగా గోపనపల్లిలో రూ.12.50 కోట్ల వ్యయంతో నిర్మితమైన ‘తెలంగాణ బ్రాహ్మణ సదన్ భవన సముదాయం’ బ్రాహ్మణ సమాజానికి కేసీఆర్ అందిస్తున్న మరో అరుదైన కానుక. ఆంధ్రా ప్రాంతంలో పుట్టి పాత్రికేయ వృత్తిలో రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణ ప్రాంతంలో పనిచేసిన నేను కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను, బ్రాహ్మణ సమాజం
పట్ల ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.
(వ్యాసకర్త:అడ్వయిజర్- టీటీడీ ఎస్వీబీసీ)