నాటి ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తది.. అని వెక్కిరించిన నోర్లు ఎన్నో ఉన్నాయి. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ ఎట్లా సాధ్యమైతుందంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వారున్నారు.. తెలంగాణను కబ్జా చేయాలని.. హైదరాబాద్లోనే తెలంగాణ ఉనికి లేకుండా చేయాలనే ఆనాటి రాజకీయ పరిస్థితులను ఛేదించారు కేసీఆర్.. ఆనాడు జలదృశ్యంలో పురుడుపోసుకొని హైదరాబాద్ నడిబొడ్డున ‘తెలంగాణ భవన్’ రూపుదిద్దుకోవడంతో..స్వరాష్ట్ర ఆకాంక్షకు మరింత బలం చేకూరినట్లయింది.
రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే 33 జిల్లాలను ఏర్పాటు చేసుకొన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్తో రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చుకున్నాం. అందుకే ఈ రోజు తెలంగాణ ఆచరిస్తున్నది. దేశం అనుసరిస్తున్నది.
వాస్తవానికి కట్టడాలనేవి కేవలం వసతి కో సం మాత్రమే కాదు… ఆ భవనాలను చూసినప్పుడు మనలో చైతన్యం ఉప్పొంగాలి. అందుకే ఉద్యమానికి సిద్ధాంతం ఎంత ముఖ్యమో… ఆత్మగౌరవపు భవనాలు అంతే అవసరం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ పేరు పలకడమే నిషేధం అన్నట్లుగా ఆంధ్ర ప్రాంత పాలకులు కక్ష గడితే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు సైతం స్తబ్ధుగా ఉన్న సంద ర్భం. అంతటి నిర్భంధంలో..ఉద్యమానికి ‘తెలంగాణ భవన్’ తో కేసీఆర్ ఓ రూపాన్నిచ్చా రు. హైదరాబాద్కు గుండెకాయలాంటి బంజారాహిల్స్లో తెలంగాణ గులాబీ జెండా రెపరెపలాడుతూ..ఉద్యమానికి ఊపిరులూదింది.
ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమించడానికి, మా కంటూ అస్తిత్వం ఉందనే ధీమాను కలిగించిం ది. తెలంగాణ భవన్ను చూస్తూ నాడు ఉద్యమస్ఫూర్తి పొందిన వారెందరో. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, వివక్ష పై చర్చించుకోవడానికి విశాల భాగ్యనగరంలో కాస్త చోటు లేని పరిస్థితి. తెలంగాణ భవన్ నిర్మాణంతో తెలంగాణ ప్రజల్లో ఆనాడు కొత్త ఉత్సాహం నిండుకొని ఉద్యమ ఉత్తేజానికి కారణమైంది.
దేశ రాజధానిలోనూ తెలంగాణకు గుర్తింపును ఇవ్వడంలో రాజకీయ కక్ష స్పష్టంగా కన్పించింది. ఆంధ్రభవన్ పేరుతో తప్ప తెలంగాణ వాసులకు స్థానం లేకుండా చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఢిల్లీ వెళ్తే.. అక్కడ కనీస సౌకర్యాలు లభించని పరిస్థితి. అంతటి వివక్షను ఒక్కొక్కటిగా జయిస్తూ… ఉద్యమ సారథి కేసీఆర్ తెగువతో పరిష్కారం చూపగలిగారు.
తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం ఒకవైపు చేపడుతూనే..మరోవైపు తెలంగాణ గడ్డ దేశం కోసం… దేశ ప్రజల బాధలను దూరం చేయడానికి పిడికిలి బిగించింది. దేశ ప్రజల కన్నీటి గోస ను తీర్చడానికి ముఖ్యమంత్రి, ఉద్యమ రథసారథి కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. భారత రాష్ట్ర సమితితో జాతీయ రాజకీయాల్లో కి అడుగు పెట్టారు కేసీఆర్. ఆనాడు హైదరాబాద్లోని తెలంగాణ భవన్ తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి తెలంగాణను సాధించేలా చేసింది.. ఇప్పుడు దేశ రాజధాని హస్తినలో భారత్ రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం నిర్మితమై నేడు ఘనంగా ప్రారంభించుకుంటున్నాం. ఈ భవన నిర్మాణంతో దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మగౌరవ నినాదం మారుమోగనున్నది. దేశం లో అధికార మార్పుదిశగా అడుగులు పడడానికి భవన్ వేదికకానున్నది. హైదరాబాద్ తెలంగాణ భవన్ ఆత్మగౌరవ ఉద్యమానికి ఊపిరిపోస్తే, ఢిల్లీలోని బీఆర్ఎస్ భవన్ ‘అబ్కీబార్ కిసాన్ సర్కార్’ నినాదానికి కొత్త ఉత్తేజాన్నివ్వనున్నది. ఆ దిశగా కేసీఆర్ అడుగుజాడల్లో దేశ మంతా నడవడానికి సిద్ధమవుతున్నది.
(వ్యాసకర్త : దళిత విద్యార్థి నాయకుడు)
-సంపత్ గడ్డం
7893303516