ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకప్పుడు కరువు ప్రాంతం. నేడు ఎటు చూసినా ఆకుపచ్చని చెట్లు, పచ్చని పంటలు, నిండిన చెరువులు, కుంటలు పెరిగిన భూగర్భ జలాలు. కండ్ల ముందు కనబడుతున్న ప్రకృతి రమణీయ దృశ్యం. సంకల్ప సిద్ధి ఉన్న పాలకులు ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని రుజువు చేసిన అపర భగీరథ ప్రయత్నం.
రాష్ట్రంలో కరువును తరిమికొట్టి సస్యశ్యామలం చేసే దిశగా అపర భగీరథుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రయత్నమే కాళేశ్వరం ప్రాజెక్ట్. దీని ద్వారా 16.40 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే బృహత్తర ప్రణాళిక అమల్లోకి వచ్చింది. నాటి ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి తెలంగాణలోని అనేక ప్రాజెక్టులు నిరాదరణకు గురయ్యాయి. ఉద్యమకారులే పాలకులైతే, వారికి చిత్తశుద్ధి ఉంటే ఏ విధంగా లక్ష్యసాధన చేయవచ్చో నిరూపించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్.
నాడు మధ్య మానేరు నుంచి 6 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. దీని ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో కేవలం 0.35 టీఎంసీల నీటి సామర్థ్యంతో నూతన జలాశయ నిర్మాణానికి (ప్యాకేజీ 9లో భాగంగా) ప్రతిపాదన జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా మెట్ట ప్రాంతం. ఇక్కడ నీటి సౌకర్యం కరువై రైతన్నలు సాగు, తాగునీటి కోసం వారి భూముల్లో ఎన్నో బోర్లు వేసిన సందర్భాలు ప్రత్యక్షంగా చూశాం. బోర్లు ఫెయిలై అప్పుల బాధలు భరించలేక అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నాడు 800 ఫీట్ల మేర బోరు వేసినా చుక్కనీరు రాని దుస్థితి. ఇక్కడ పంటలు ప్రధానంగా వర్షాలు, బావుల మీద మాత్రమే ఆధారపడి సాగయ్యేవి. యువత ఉపాధి కరువై బొంబాయికి, గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళేవారు. కల్లోలిత ప్రాంతం కావడం వల్ల గతంలో ఆంధ్ర పాలకులు ఈ ప్రాంత అభివృద్ధికి చొరవ చూపలేదు. ఆనాడు ఈ పరిస్థితులన్నింటినీ ప్రత్యక్షంగా చూసి చలించి పోయిన సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వరరావు ఈ మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, రైతాంగ ఉపాధి కోసం ఎత్తిపోతల పథకం ఒక్కటే శరణ్యమని ప్రతిపాదించారు.
మల్కపేట వాస్తవ్యులు, ఉమ్మడి సిరిసిల్ల ఎమ్మెల్యే కీర్తిశేషులు కర్రోళ్ల నర్సయ్య స్థానిక యువకులతో చాలా సందర్భాల్లో మాట్లాడుతూ పాలకులు మారినా ఈ ప్రాంత బతుకులు మారవని, ఎత్తిపోతలు ఎప్పుడూ ఎన్నికల హామీగానే మిగిలిపోతుందని దిగులు చెందేవారు. ఈ మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సాగునీరు ఉండాలని, దానికి ఎత్తిపోతల ఒక్కటే మార్గమని బలంగా కాంక్షించేవారు.
ఉద్యమ కాలంలో ప్రజల కష్టాలు, ముఖ్యంగా రైతుల కష్టాలు ప్రత్యక్షంగా చూసి చలించి పోయిన ఆనాటి ఉద్యమ నాయకులు, నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతులు స్వరాష్ట్రంలో సంక్షోభంలో కాకుండా సంక్షేమంలో చల్లగా బతుకాలని కోరుకున్నారు. తద్వారా వారు ఆర్థికవృద్ధికి నోచుకోవాలని సంకల్పించారు. దానికోసమే కాళేశ్వర ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. సిరిసిల్ల జిల్లాలో కరువు నివారణకు, రైతుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ఎమ్మెల్యే, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ భావించారు. దానికోసం మల్కపేట జలాశయం సామర్థ్యాన్ని 0.35 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచాలని నీటిపారుదలశాఖకు సూచించారు. జలాశయ సామర్థ్యం మూడు టీఎంసీలకు పెంచడం వల్ల ఆయకట్టు చాలావరకు పెరుగుతుందని తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించి కేటీఆర్ ఈ సూచనలు చేశారు. కేటీఆర్ సూచనలకు అనుగుణంగా మల్కపేట జలాశయం రీఇంజినీరింగ్లో భాగంగా జలాశయ సామర్థ్యం 3 టీఎంసీలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 2017 నుంచి అనేక సందర్భాల్లో ప్రాజెక్టు పనులను పరిశీలించి, అధికారులతో రివ్యూలు నిర్వహించారు. తక్కువ సమయంలో ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేటీఆర్ చేసిన కృషి హర్షణీయం.
3 టీఎంసీల సామర్థ్యంతో ఏడు గుట్టల మధ్య 5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన మల్కపేట రిజర్వాయర్లోకి 130 మీటర్ల లోతు నుంచి 1100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు 30 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు మోటర్లతో పంప్హౌస్ను ఏర్పాటు చేశారు. సర్జ్పూల్ పంపుహౌస్ల ద్వారా నీటిని మల్కపేట రిజర్వాయర్లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి గ్రావిటీ కాలువల ద్వారా ఎల్లారెడ్డిపేట మండలం సింగసముద్రం చెరువు, గంభీరావుపేట మండలం బట్టల చెరువులను నింపే పనులు పూర్తయ్యాయి. బట్టల చెరువు నుంచి ఎగువ మానేరు ప్రాజెక్టులోకి కాలువ ద్వారా నీటిని తరలించే పనులు సైతం పూర్తి చేశారు. త్వరలోనే మల్కపేట రిజర్వాయర్ అందుబాటులోకి రానున్నది. తద్వారా పసిడి పంటలు పండనున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్-9లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న మల్కపేట జలాశయం ద్వారా జిల్లాలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట్, ముస్తాబాద్, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట మండలాలలో దాదాపు లక్ష ఎకరాల మెట్ట భూమి మాగాణిగా మారనున్నది. భూగర్భ జలాలు పెరగడంతో పాటు, వ్యవసాయ రంగ అభివృద్ధి, అనుబంధ రంగాలైన మత్స్య, పాడి, పర్యాటకం అభివృద్ధి చెంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్-9 మల్కపేట ప్రాజెక్టుకు చెన్నమనేని రాజేశ్వరరావు పేరు పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. చిన్న, సన్నకారు రైతుల అభివృద్ధి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన రాజేశ్వరరావు పేరు పెట్టడం చాలా గొప్ప విషయం. సిరిసిల్ల వేములవాడ ప్రాంతాలకు సాగునీరు అందించాలని ఎన్నో పోరాటాలు చేసిన ఘనత ఆయనది. ఈ ప్రాంతంలో సాగునీరు కోసం ఎత్తిపోతల పథకమే శరణ్యమని ఆనాడే పోరాటాలకు రూపకల్పన చేసిన దార్శనికుడు. త్వరలోనే మల్కపేట రిజర్వాయర్ను ప్రారంభించనున్నారు. సిరిసిల్ల, వేములవాడ మెట్ట ప్రాంతానికి ఈ రిజర్వాయర్ వరప్రదాయనిగా నిలువనున్నది. అసాధ్యం అనుకున్న 60 ఏండ్ల కలను నెరవేర్చిన అపర భగీరథుడు కేసీఆర్కు ఈ ప్రాంత ప్రజలు ఎల్లకాలం రుణపడి ఉంటారు.
-పాకాల శంకర్ గౌడ్
98483 77734