మార్పు ప్రకృతి సహజం. కావాల్సిన సమయంలో తప్పకుండా జరగాల్సిందే. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవ్వరు ఆపాలని చూసినా అది జరగాల్సినప్పుడు ఆరు నూరైనా, నూరు ఆరైనా జరిగి తీరుతుంది. మార్పులో మంచికి ఎక్కువ స్థానముంటే అంతా సంబురపడుతారు. అలాకాకుండా ముంచేతత్వంతోనే మార్పును కోరుకుంటే మొదటికే మోసం.
తెలంగాణ రాష్ట్రం ఒక కల. కోట్లాది తెలంగాణ బిడ్డలను ఊరించిన ఆరున్నర దశాబ్దాల వాంఛ. ఎందుకోసమో కలిపారు. మరెవరి కోసమే ఈ ప్రాంతాన్ని తొక్కిపెట్టారు. చేయని తప్పుకు చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకోవడం తప్ప ఇక్కడి ప్రజలు చేసేదేమీ లేక భరించారు. ప్రాణాలను అర్పించారు. అయినవాళ్లను కోల్పోయారు. కుటుంబ పెద్దలు పోయి న పుట్టెడు దుఃఖంలో కలో, గంజో తాగి ప్రాణాలు నిలపుకొన్నారు. ఎక్కిరిస్తే పడ్డారు. ఎగతాళి చేస్తే భరించారు. కాళ్లకింద నలిపేస్తే కిక్కురుమనకుండా ఊరుకున్నారు. దేనికైనా ఓ సమ యం ఉంటుందన్నట్టుగానే ఓపికకు కోపం వచ్చి ఇక తెగించాల్సిందే అని తిరగబడ్డారు. 60, 70లలోనే అంతా కలిసి కలియబడ్డారు. తమను తొక్కేస్తున్న శక్తులను ప్రతిఘటించారు. ఆ సమయంలో కూడా కొందరు స్వార్థ నాయకుల పదవీ వ్యా మోహానికి దగాపడిన తెలంగాణ ప్రజాశక్తి చాలక చతికిలపడ్డారు. వెన్నుపోటు రాజకీయాలకు, ఢిల్లీ పెద్దలు ఆడించిన నాటకాలకు సర్కస్లోని జంతువుల మాదిరిగా వ్యవహరించిన కొందరు నేతల కక్కుర్తికి ఈ ప్రాంత ప్రజలంతా బిక్కమొహం వేయాల్సిన దుస్థితి దాపురించింది. నాలుగు వందలకు పైగా ప్రాణాలు గాల్లో కలిసినా చేసేదేమీ లేక అనుకున్నది సాధించలేక చేతులు ముడుచుకోవాల్సి వచ్చింది.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కోటి ఎకరాల మాగాణమే పరమావధిగా శ్రమిస్తున్న ఉద్యమ నాయకుడి విజన్, నెట్టుకొస్తున్న తీరు, చక్కదిద్దేందుకు శ్రమిస్తున్న తీరు నచ్చాల్సింది ముమ్మాటికీ జనాలకు. అన్నింటికీ అంతిమమైన ఆప్షన్ వారి చేతుల్లోనే ఉంటుంది. ఎత్తుకోవాలన్నా వారే.. కుదేసి పడేయాలన్నా అవకాశం వారికే. వారి విచక్షణపై ఆధారపడి మసులుకోవాల్సిందే తప్ప, ఏ నాయకుడు, ఏ పార్టీ కూడా వారిని కాదని, వారిని పట్టించుకోకుండా గుడ్డిగా పోతానంటే అంగీకరించిన దాఖలాలు లేవు. అలాంటి వారి వెంట ప్రజలు నడిచి న చరిత్ర కూడా ఎక్కడా కానరాదు. రాష్ట్రం సాధించిన గొప్పతనాన్ని గుర్తించకున్నా పర్లేదు కనీసం దాన్ని గౌరవించాల్సిన అవసరాన్నయినా గమనించకపోవడమే దరిద్రం. ప్రజల కో సం పనిచేయడం దేవుడెరుగు, పదవుల కోసమే పరితపిస్తున్న తీరే బాధాకరం. పార్టీలే పరమావధిగా, ఇష్టారీతిగా ప్రకటించే ఎజెండాలే తమ విస్తృతిగా చెలరేగిపోతున్న నాయకుల వ్యవహారం జుగుప్సాకరం. నాయకుల మధ్య సవాలక్ష సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉండనీగాక, ప్రజల్లో మెదులుకోవాల్సిన సమయంలో ప్రదర్శించాల్సిన హుందాతనం లోపించడమే ప్రజాస్వామ్య వ్యవస్థకు అగౌరవం కలిగించే విధానం.
పార్టీ ఏదైనా ముందుగా ప్రజల శ్రేయస్సే అంతిమంగా ఉండాలి. స్వప్రయోజనాల కోసం నోటికెంతొస్తే అంత మాటలనేసి, చేతికెంతొస్తే అంతా ఇస్తామని ప్రకటిస్తూ పూట గడుపుకొంటామంటే అతి అపహాస్యం చేయడమే. ఒంటెత్తు పోకడలతో ప్రవర్తిస్తానంటే ప్రజలను కించపర్చడమే కాకుండా, గత చరిత్ర తాలూకు కష్టాలను, ఉద్యమ నేపథ్యాన్ని కావాలని తొక్కేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఒక్కనాటి కోసం ఎల్లకాలం ఉండే నిజాలను మరుగునపడేసేలా మసలుకోవడం సరికాదు.
ఎవరు ఔనన్నా, కాదన్నా తెలంగాణ రాష్ట్రం కోసం కావాల్సిన ఓ కేంద్ర బిందువు కేసీఆర్ రూపంలో లభించిన మాట వాస్తవం. ఎవరికి వారుగా పోరు సల్పి ఉండొచ్చు, ఎవరికి తోచిన విధంగా వారు నిరసనలు తెలిపి ఉండి ఉండొచ్చు గానీ అందరికీ కేరాఫ్గా నిలిచిన చారిత్రక ఉద్యమానికి ఆయనే ఓ ఆయువుపట్టు. యుద్ధంలో సైన్యమంతా తలపడినా, వెనుకుండి నడిపించే రాజే అంతిమంగా కర్త, కర్మ, క్రియగా నిలుస్తారు. ఓటమి చెంది మరణ దండన స్వీకరించాలన్నా, గెలుపు బావుటా ఎగరేసి కోల్పోయిన సంపదను తిరిగి సముపార్జించేలా ప్రణాళికలు రచిస్తూ, ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్నా రాజుకు తప్పని పరిస్థితి.
కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజల పక్షాన సాధించడానికి ఒంటరిగా ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఎవరూ వెంట నడవని రోజు కూడా పట్టు కోల్పోక, ధైర్యాన్ని కూడగట్టుకొని ఎందరెందరినో ఎదిరిస్తూ, బలం కూడగట్టుకొని దేశమే చూసేలా చావును ముద్దాడి మరీ రాష్ర్టాన్ని సాధించిన నేత. ఈ పదేండ్లలో జరిగినవెన్నో, ఇంకా జరగాల్సినవి ఎన్నెన్నో.. అన్నీ ప్రజలు చూస్తున్నారు. ప్రతీది వారి మెమొరీలో పొందుపర్చుకుంటున్నారు. కేవలం పీఠాల కోసమే పాకులాడుతున్నదెవరో, ప్రజల కోసం అన్నీ భరిస్తున్నదెవరో అంతా చూస్తున్నదే. ఆ వేళ ప్రత్యేక ఉద్యమాన్ని మట్టి కరిపించేందుకు వైరి పక్షంలో నిలిచిన నేతలంతా ఇప్పుడు ఆ ఒక్కడిని ఎదుర్కోవడానికి ఏకమవుతున్న సందర్భమే అతి విచిత్రం. రాష్ట్రం ఎటుపోతే మాకేంటి, అప్పటి మా ప్రయోజనాలు, మా ప్రభువులు, మా ప్రభుత్వాలుంటే చాలనుకున్నవారంతా ఇప్పుడు ప్రజల పక్షాన పోరు సల్పుతున్నది తామే అనే ధోరణిలో ప్రవర్తించడం అతి విడ్డూరం. అంతా రాజులుగా చెలామణి అయిన సందర్భం మరిచి, ఇప్పుడు ప్రజలే రాజులు, మేం మీకు బానిసలం అంటూ సాగిస్తున్న వింత ప్రవర్తన అంతా గమనిస్తున్నారు. మాటలతో ఏమార్చే ప్రయత్నం చేసినా రుజువులు కండ్లముందు కనిపిస్తున్న విషయాలను మర్చిపోవద్దు. స్వార్థాన్ని చూసుకోకుండా దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటానికి అంతిమ పరిష్కారం చూపాలని దండును కదిలించిన ఆనాటి ముచ్చట్లను అంతా మర్చిపోయారనుకుంటే తెలివి తక్కువతనమే.
కేసీఆర్ చేసిన త్యాగం ముందు ఇప్పుడు వీరు చేస్తున్న నక్క విన్యాసాలు ఎక్కడికక్కడ విచ్చుకుపోవాల్సిన తరుణం చూడటానికి ఇంకొన్ని రోజులు సమయం పట్టొచ్చుగానీ, అప్పటివరకు ‘వేషాల’తో వ్యవహారం నడిపిస్తామంటే జనాలేం ఆలోచన లేనివారు కాదు. ఆ మాటకొస్తే ఆ బాపతు నాయకులు వేలం వెర్రిగా చేసే విన్యాసాలతో తెలంగాణ ఉనికి, ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలన్నీ కాలగమనంలో కలిసిపోయే ప్రమాదాన్ని పసిగట్టాల్సిన అవసరం సమస్త జనంపైనా ఉంది. దానిని అడ్డుకట్ట వేయకపోతే భరించాల్సిన నష్టం భావితరాలకు చిక్కులు తెస్తుందనే కఠోర సత్యాన్ని అంతా గమనిస్తేనే మనుగడకు ముప్పు తప్పుతుంది. చివరగా కోట్లాదిగా కొట్లాడిన పోరాటానికి ఒక్కడై నిలిచిన చరిత్ర మాసిపోనిది, చరిత్ర ఎప్పుడూ తుడిచివేయలేనిది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
– రాజేంద్ర ప్రసాద్ చేలిక 99858 35601