దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటింది. నేటికీ పేదరికం పరిష్కారం కాలేదు. దేశంలో దాదాపు 30 కోట్ల మంది కఠిన దారిద్య్రంలో ఉన్నారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నవారు కూడా పేదరికాన్ని అనుభవిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 50 శాతానికి పైగా ప్రజలు పేదరికంలో ఉన్నట్టే. ఇటీవల విడుదలైన ‘గ్లోబల్ హంగర్ ఇండె క్స్’ ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్లకంటే కూడా భారత్ వెనుకబడి 107వ ర్యాంకులో ఉన్నది. ‘ఆక్స్’ నివేదిక ప్రకారం ఇండియాలో ఒక శాతం ప్రజల చేతుల్లో 45.5 శాతం సంపద, 10 శాతం ప్రజల చేతుల్లో 80 శాతం సంపద, 50 శాతం ప్రజల చేతుల్లో 3 శాతం సంపద మాత్రమే ఉన్నది. ఈ విధంగా అసమానతల భారత్గా రూపాంతరం చెందింది.
ఆదిమ సమాజంలో కలిసి వేటాడటం, వేటాడిన ఆహారాన్ని సమ పంపిణీ చేసుకోవడం, కలిసి జీవించడం లాంటి ఆదిమ కమ్యూనిజం ఉండేది. నేడు ఆటవిక న్యాయం కంటే హీనస్థాయిలో సమాజంలో మానవ దోపిడీ, శ్రమ దోపిడీలు జరుగుతున్నాయి. భారత పాలకులకు దూరదృష్టి కొరవడింది. తమకు తెలియదు.. చెబితే వినరు తమను తాము దైవాంశ సంభూతులుగా భావిస్తారు. ఆభిజాత్య పోకడలు.. దాని ఫలితమే నేటికీ పైన పేర్కొన్న అసమానతలు. సంపద ఎంత పెరిగినా ప్రపంచంలో 5వ ఆర్థికవ్యవస్థగా డాంబికాలు చెప్పుకొన్నా సమ్మిళత అభివృద్ధి లేకుంటే, అభివృద్ధి ఫలితాలు క్షేత్రస్థాయికి చేరి, ఆఖరి వ్యక్తి వరకు చేరకుంటే ప్రజలు ఇంకెన్నేండ్లని ఓపిక పడుతారు. ఈ దశలో మొత్తం ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక విధానాలను పునరాలోచన చేయవలసిన అవసరం ఉన్నది. మ్యాక్రో ఎకనమిక్స్ (స్థూల ఆర్థిక విధానాలు) రూపకల్పన సంపద పెరుగుదలకు దోహదకారి అవుతుంది. ఆ సంపద కష్టించే ప్రతి శ్రమజీవికి తమ కష్టానికి అనుగుణంగా శ్రమ దోపిడీ లేకుండా అందితే దేశాభివృద్ధి మరింత ఉజ్వలంగా ముందుకువెళ్తుంది. దీనికోసం మైక్రో ఎకనమిక్స్ (సూక్ష్మ ఆర్థిక విధానాలు), సోషల్ ఇంజినీరింగ్ సమన్వయం చేసి సమ్మిళిత అభివృద్ధి సాధించే దిశగా ఆర్థిక శాస్త్రవేత్తల, సామాజిక శాస్త్రవేత్తల, విజ్ఞాన శాస్త్రవేత్తల ఆవిష్కరణలను అనుసంధానం చేయాలి.
ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లి ఫలితాలు సాధించాలంటే రాజ్యపాలకులకు దూరదృష్టి, రాజ్యధర్మం, మనుషులపై ప్రేమ, సంకల్ప సిద్ధి ఉండాలి. కానీ, పాలకులకు సమయం లేదు, ఓట్ల వేట, కుర్చీలాట, కులమత సంఘర్షణలు రెచ్చగొట్టడంలో వారికున్న తెలివిని, సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ అల్ప రాజకీయ నాయకులుగా మారుతున్నారు. రాజకీయ నాయకుడు తన రాజకీయ ప్రయోజనం, పదవీలాలసత లాంటి ఆలోచనల్లో బందీ అయితే రాజనీతిజ్ఞ్ఞుడు భవిష్యత్తరాల గురించి ఆలోచన చేసే దార్సినికుడవుతాడు. కానీ నేడు రాజనీతిజ్ఞులు లేరు. కేవలం హ్రస్వదృష్టి, అల్పబుద్ధి కలిగిన రాజకీయ నాయకులు తయారవుతున్నారు.
కొంతమంది కుహనా మేధావులు పలు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, కమ్యూనిస్టుల పోరాటాలు మర్చిపోయి కువిమర్శలకు పాల్పడుతున్నారు. ఆ విమర్శలు చేసేవారు ఒక విషయాన్ని కచ్చితంగా అంగీకరిస్తున్నారు. అదేమంటే పోరాటాలు కమ్యూనిస్టులు మాత్రమే చేయగలరు, తాము ప్రకటనలు మాత్రమే చేయగలమనే అంశాన్ని వారు అంగీకరిస్తున్నారు. వారు ఒక అంశాన్ని గమనంలోకి తీసుకోవాలి. ప్రజా పోరాటాలు అనేక రూపాల్లో ఉంటాయి. ఒకనాడు సాయుధ పోరాటం, ప్రజాస్వామ్య వెలుగులో నేడు సమ్మెలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు, చైతన్యయాత్రలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు పేరేదైనా, రూపం ఏదైనా ఇవన్నీ ప్రజల హక్కుల కోసం చేసే పోరాటాలు, ఈ పోరాటాల్లో కమ్యూనిస్టుల పాత్ర చిరస్మరణీయం. గతంలో ప్రజాస్వామ్య పద్ధతిలో భావస్వేచ్ఛ, సమాజాన్ని కదిలించే కళారూపాలు, రచనలు, కవితలు, ఇతర ఉద్యమాలకు అవకాశం ఉండేది.
నేడు ఏ ఉద్యమానికి శ్రీకారం చుట్టినా ముందస్తు అరెస్టులతో ఆ ఉద్యమాన్ని నడవనీయకుండా ప్రభుత్వాలు కొత్త తరహా నిర్బంధకాండకు పాల్పడుతున్నాయి. కమ్యూనిస్టుల ఉద్యమాలకు ప్రసార మాద్యమాల్లో కూడా తగు చోటు కల్పించడం లేదు. అయినప్పటికీ అన్ని అవరోధాలను అధిగమిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నది కమ్యూనిస్టులే. ఈ పోరాట రూపాల్లో భాగంగా ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నుంచి మే 14 వరకు తీవ్ర ఎండల్లో సైతం దేశవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ యాత్రలు జరిగాయి.
పోడు భూమి లాంటి అంశాలపైన సీపీఐ, సీపీఎం, నక్సల్ పార్టీలు కలివిడిగా, విడివిడిగా అనేక పోరాటాలు చేశాయి. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాయి. ఆ విధంగా చివరి వ్యక్తికి ప్రయోజనం అందేవిధంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, పింఛన్, గృహవసతి లాంటి సమస్యల పరిష్కారం కోసం, రైతాంగ, పారిశ్రామిక, పేదరిక సమస్యలు పరిష్కరించే దిశలో ప్రభుత్వాలు తమ విధానాలు, ఆలోచనలు మార్చుకొని ఆరోగ్య, ఆనందదాయకమైన సమాజాన్ని నిర్మాణం చేసే క్రమంలో కమ్యూనిస్టు పార్టీల పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కార్మిక పట్టణమైన కొత్తగూడెంలో జూన్ 11న ‘ప్రజాగర్జన’ పేరుతో లక్ష మందిని సమీకరించేందుకు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ శక్తివంతమైన పిలుపునిస్తున్నది.
(వ్యాసకర్త: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి)