Satabdi Roy : పశ్చిమబెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) లో రేగిన తిరుగుబాటు జ్వాలలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన 20 మంది లోక్సభ సభ్యులు (Lok Sabha Members) ఇప్పటికే అధికార ఎన్న్డీయే కూటమి (NDA Alliance) కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ తిరుగుబాటు గ్రూప్నకు డిప్యూటీ లీడర్గా ఎన్నికైన ప్రముఖ బెంగాలీ నటి, నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శతాబ్ది రాయ్ (Satabdi Roy) ఈ సంక్షోభంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009 నుంచి మమతా బెనర్జికి అత్యంత నమ్మకస్థురాలిగా ఉన్న ఆమె.. తాము పార్టీని వీడటానికిగల అసలు కారణాలను ‘ఎన్డీటీవీ ’ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘గత కొన్నేళ్లుగా దీదీ చాలా మారిపోయారు’ అని శతాబ్ది రాయ్ వ్యాఖ్యానించారు. మమతా బెనర్జితో తనకు ఇప్పటికీ బలమైన బంధం ఉందని, అయితే అంతకంటే ప్రజా పనులే ముఖ్యమని ఆమె స్పష్టంచేశారు. పార్టీలో అంతర్గతంగా పెరిగిపోయిన అవినీతి, నాయకత్వానికి-ప్రజాప్రతినిధులకు మధ్య పెరిగిన దూరంవల్లే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. పార్టీలో కేవలం కొంతమంది ఎంపిక చేసిన నేతలకు మాత్రమే మమతాబెనర్జీని కలిసే అవకాశం ఉండేదని శతాబ్ది రాయ్ ఆరోపించారు. మిగిలిన ఎంపీలు, సీనియర్ల గళాన్ని పూర్తిగా నొక్కేశారని, కనీసం తమ నియోజకవర్గ సమస్యలను చెప్పుకుందామన్నా అధిష్ఠానం వినే పరిస్థితి లేదని మండిపడ్డారు.
బెంగాల్ ప్రభుత్వంలోని మంత్రులు కూడా ఎంపీలకు అపాయింట్మెంట్లు ఇచ్చేవారు కాదన్నారు. ఎలాంటి నిర్ణయాల్లోనూ ఎంపీలను సంప్రదించేవారు కాదని, ఏమైనా మాట్లాడాలని చూస్తే ‘నోరు మూసుకుని కూర్చోండి’ అని అనేవారని ఆరోపించారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్లో అవినీతి పరాకాష్ఠకు చేరిందని శతాబ్ది రాయ్ చెప్పారు. అయితే తనపై ఎలాంటి అవినీతి మరకలు లేవని, ఇమేజ్ క్లీన్ చేసుకోవడానికి తానేమీ పార్టీలు మారడం లేదని, కేవలం ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. పార్టీ బలహీనంగా ఉన్న సమయంలోనే ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఇప్పుడే మాకు అన్ని విషయాలపై స్పష్టత వచ్చింది’ అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఎలా ప్రవర్తించిందో చూశామని, నా నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు కోసమే ఇప్పుడు ఈ అడుగు వేశానని స్పష్టంచేశారు.