Judicial System | న్యాయవ్యవస్థ తూకంపై రాజదండ ప్రహారం ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చిపెడుతున్నది. నిరంతర జాగరూకతే ప్రజాస్వామ్యానికి చెల్లించుకోవాల్సిన మూల్యం అని పెద్దలన్నారు. ప్రజల తరఫున ఆ జాగరూకతను పాటించే సాధనంగా న్యాయవ్యవస్థ పనిచేస్తుందనేది తెలిసిందే. ఇజ్రాయెల్లో న్యాయవ్యవస్థను ఒడిసిపట్టి మెడకు పలుపుతాడు వేసే పన్నాగాలు జోరందుకున్నాయి. న్యాయస్థానాలను ‘జీ హుజూర్.. జో హుకుం’గా మార్చేందుకు బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలోని ఇజ్రాయెల్ సర్కార్ తీవ్ర ప్రతిఘటనల మధ్య ముందుకు సాగుతున్నది. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని సమాధి చేసి, పరిపాలనా వ్యవస్థకు తోకలా మార్చేందుకు అక్కడి ప్రభుత్వం సంస్కరణల పేరిట సన్నాహాలు మొదలుపెట్టింది.
న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న పన్నాగాలను ఇజ్రాయెల్ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఇందులో మేధావులు కూడా గొంతు కలుపుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రముఖ రచయిత యువల్ నోవా హరారీ. ఈయన రాసిన సేపియ న్స్, హోమో దెయస్ పుస్తకాలు కోట్లలో అమ్ముడై, కాల్పనికేతర సాహిత్యంలో రికార్డులు సృష్టించా యి. ఈ రెండూ మానవ నాగరికత గతాన్ని, భవిష్యత్తును లోతుగా చర్చించాయి. రెండూ తెలుగులోకి అనువాదమయ్యాయి కూడా. పుస్తకాల సం గతి అలా ఉంచితే ప్రస్తుతం ఇజ్రాయెల్లో న్యాయవ్యవస్థకు సంకెళ్లు వేసేందుకు బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలోని తీవ్ర జాతీయవాద సర్కారు చట్ట సవరణలను తీసుకువచ్చే పనిలో నిమగ్నమైంది. ఇది ఇజ్రాయెల్లో ‘పైనుంచి జరుగుతున్న తిరుగుబాటు’గా హరారీ అభివర్ణించా రు. న్యాయవ్యవస్థపై ప్రభుత్వ కుట్రలను నిరసి స్తూ లక్షల్లో జనం వీధుల్లోకి వస్తున్నారు. వారి వాణిని హరారీ వంటి మేధావులు ప్రపంచానికి వినిపిస్తున్నారు.
ఇప్పుడు ఇజ్రాయెల్ తరహా ప్రయత్నాలే ఇండియాలోనూ జరుగుతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఒక రూపానికి రానప్పటికీ భారత పాలకుల ఉద్దేశాలు మాత్రం తెలిసిపోతూనే ఉన్నాయి. స్వతంత్ర న్యాయవ్యవస్థ ఏ సమాజానికైనా చాలా ముఖ్యం. 1975లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లద ని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రనే మలుపు తిప్పింది. ప్రస్తుత కేంద్రప్రభుత్వానికి కూడా న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దీంతో అన్ని రాజ్యాంగవ్యవస్థల్లాగే న్యాయవ్యవస్థను కూడా తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకుంటున్నది. ఇది బహిరంగ రహస్యం. ఇందుకు సంకేతాలు ఎన్నో. ప్రభుత్వాలు, వాటి అధినేతలు చేసే అతిని అదుపు చేయడంలో న్యాయవ్యవస్థ ముకుతాడులా పనిచేస్తుంది.
రహస్య ఎజెండాతో పనిచేసే పాలకులకు కోర్టు తీర్పులు సహజంగానే గిట్టవు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు ప్రవేశపెట్టకుండా, రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకునేలా అదుపు చేసే కొరడాలా న్యాయవ్యవస్థ పనిచేస్తుంది. ఈ కొరడా నిరంకుశ పాలకులకు ఎలా నచ్చుతుంది? నెతన్యా హూ ప్రభుత్వం న్యాయవ్యవస్థను ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి తెచ్చేందుకు ఒకటొకటిగా పావులు కదుపుతున్నది. దీనికి సంస్కరణలు అనే ముద్దుపేరు తగిలించారు. దీన్ని చైతన్యవంతులైన ఇజ్రాయెల్ మేధావి వర్గం, ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. న్యాయవ్యవస్థను సర్కారు నియంత్రణలోకి తీసుకెళ్లడమంటే నిరంకుశాధికారానికి స్వాగతం పలకడమేనని అంటున్నారు.
గమనించాల్సిన విషయం ఏమంటే ఆ దేశ అధ్యక్షుడు హెర్జోగ్ స్వయంగా ఈ ప్రయత్నాల ను నిరసించడం. దేశం రెండుగా చీలిన నేపథ్యం లో సర్కారు ప్రయత్నాలు అంతర్యుద్ధానికి దారి తీస్తాయని కూడా ఆయన హెచ్చరించారు. ఇక తాజా పరిణామాలు గమనిస్తే సంక్షోభ తీవ్రత అర్థమవుతుంది. నెతన్యాహూ సంకీర్ణ ప్రభుత్వం లో రక్షణమంత్రిగా ఉన్న యోవ్ గాలంట్ 12 రోజులుగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారీ ప్రజా నిరసనల దృష్ట్యా ప్రస్తుతానికి వివాదాస్పద న్యాయసంస్కరణలను పక్కన పెడదామని సూచించారు. తన జీవితాంతం దేశ రక్షణ కోసమే పనిచేశానని, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యంలో బాధ, కోపం, నిస్పృహ అలుముకున్నాయని గాలంట్ పేర్కొన్నారు. ఈ హితవచనాలను నెతన్యాహూ పెడచెవినపెట్టి రక్షణమంత్రిని ప్రభుత్వం నుంచి తొలగించారు. గాలంట్ను ఆయన ఇంటికి పంపి ఉండొచ్చు. కానీ సైన్యంలోనూ ప్రభుత్వం చేపట్టిన న్యాయ సంస్కరణల పట్ల వ్యతిరేకత ఉన్నదన్న సంగతి ప్రపంచానికి వెల్లడైంది. దేశం లో నిరసనలు ఆగకపోవడంతో ఎట్టకేలకు నెతన్యాహూ దిగివచ్చి దేశంలో చీలిక రావడం తనకు ఇష్టం లేదంటూ న్యాయ సంస్కరణలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వాయిదా అన్నారు తప్ప మొత్తంగా ఉపసంహరించుకొంటున్నట్టు ఆయన చెప్పలేదన్నది ఇక్కడ గమనార్హం.
ఇప్పుడు మన దేశంలోనూ న్యాయవ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకొంటున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. సర్కారు అనుకూల తీర్పులను వెలువరించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి తరుణ్ గొగోయ్ని పదవీ విరమణ తర్వాత రాజ్యసభకు పంపడంపై న్యాయవర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. ఇదొక రకం గా న్యాయమూర్తులకు తాయిలం ఆశ చూపడమేనని విమర్శలొచ్చాయి. అయితే ఇలాంటి తాయిలాల ఆశ అందరి విషయంలోనూ పనిచేయకపోవచ్చు. అందుకే న్యాయ నియామకాలను సర్కా రు అధికార పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే సమాచార హక్కు చట్ట వ్యవస్థను నీరుగార్చింది. ఎన్నికల సంఘానికి వివాదాస్పద నియామకాలు జరిపి సర్వోన్నత న్యాయస్థానంతో మొట్టికాయలు తినా ల్సి వచ్చింది. సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ వంటి దర్యా ప్తు సంస్థల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. వీటి స్వతంత్ర ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం ప్రతిపక్షాలు ఏకంగా న్యాయపోరాటానికి దిగాయి. అందుకే న్యాయసాధనలో చివరి ఆశగా నిలిచే న్యాయస్థానాలపైనే కేంద్రం గురిపెట్టింది. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు.
మన దేశంలో న్యాయవ్యవస్థ కొలీజియం విధానం అనుసరిస్తున్నది. అంటే న్యాయవ్యవస్థ తమలో తామే నియామకాలను సిఫారసు చేస్తే న్యాయశాఖ వాటిని తు.చ. తప్పక పాటించే పద్ధతి. ఈ వ్యవస్థ స్థానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జేఏసీ లేదా ఎన్జాక్)ను తెచ్చేందుకు గతంలో కేంద్ర సర్కారు ప్రయత్నించి విఫలమైంది. సుప్రీంకోర్టు ఈ పద్ధతిని తీవ్రంగా ప్రతిఘటించడమే అందుకు కార ణం. ఇటీవలి కాలంలో సర్కారు నుంచి వెలువడుతున్న సంకేతాలు చూస్తే మరోసారి ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు అవగతమవుతున్నది.
కేంద్ర న్యాయశాఖమంత్రి కిరెన్ రిజిజు న్యాయమూర్తులపై, న్యాయవ్యవస్థపై ఇటీవల చేస్తున్న వివాదాస్పద ప్రకటనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. న్యాయమూర్తులకు పదవిలో ఉన్నప్పుడు, విరమణ తర్వాత కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన అదేదో దుబారా ఖర్చు అన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత ఏకంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రంగంలోకి దిగారు. న్యాయవ్యవస్థ కన్నా పార్లమెంటే సర్వోన్నతమైందని, పార్లమెంటుకే సర్వాధికారాలుంటాయని ఆయన సెలవిచ్చారు. అంటే పరిపాలనావ్యవస్థపై న్యాయవ్యవస్థ తనిఖీ తగదన్నది ఆయన ఉద్దేశం. న్యాయవ్యవస్థ ప్రభుత్వ ఆధిపత్యానికే లొంగి పనిచేయాలని ఉపరాష్ట్రపతి ధన్కడ్ నొక్కిచెప్పారు. ఆ తర్వాత న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు దూకు డు మరికొంత పెంచారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మాజీ న్యాయమూర్తులపై ఆయన తీవ్ర విమర్శలే చేశారు. వారు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ముఠాలతో కలిసిపోతున్నారని, అలాంటి పనులకు వారు.. అంటే మాజీ న్యాయమూర్తులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అంటే అయితే తాయిలాలు, కాకుంటే బెదిరింపులు అన్నమాట.
ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రజాస్వామ్యంలో సాధారణంగా ఉండే విషయమే. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకిస్తే ఆందోళన చేస్తారు. అప్పటికీ న్యాయం జరగకపోతే చివరికి కోర్టు మెట్లెక్కుతారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగానికి, రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా ఉందా లేదా అనేది న్యాయస్థానాలు నిగ్గుతేలుస్తాయి. అందుకే బాధితులకు అంతిమగమ్యం న్యాయస్థానమే.
ఎమ్మెల్యేల కొనుగోలు వంటి తీవ్రమైన కేసును నయానో భయానో తన పరిధిలోకి తెచ్చుకొనేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను నిలువరించేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయ వేదికల ద్వారా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు తీవ్రతను ఇప్పటికే న్యాయమూర్తులు ఒకటిరెండు సందర్భాల్లో ప్రస్తావించారు. కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఈ నేపథ్యంలో గమనించాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్ తరహాలో ఇంకా భారత పాలకులు ముందుకువెళ్లనప్పటికీ వారి మనసులో ఏముందన్నది స్పష్టమైపోయింది. అన్ని వ్యవస్థల ను భ్రష్టు పట్టించడం అయిపోయింది. ఇక న్యాయవ్యవస్థ ఒక్కటే మిగిలింది. ఇప్పుడు దాని మీదే కేంద్ర సర్కారు కన్నేసింది. ఈ ముప్పుపై ఒకరిద్దరు మేధావులు గొంతు విప్పిన మాట వాస్తవం. కానీ అది సరిపోదు. ఇజ్రాయెల్ ప్రజలను ఆదర్శంగా తీసుకొని మోదీ సర్కారు యత్నాలను గట్టి గా తిప్పికొట్టాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తున్న ది. రచయితలు, పాత్రికేయులు, న్యాయనిపుణు లు.. మొత్తంగా మేధావివర్గం దీన్ని ముందుండి నడిపించడం తక్షణావసరం.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మాజీ న్యాయమూర్తులపై రిజిజు తీవ్ర విమర్శలే చేశారు. వారు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ముఠాలతో కలిసిపోతున్నారని, అలాంటి పనులకు వారు.. అంటే మాజీ న్యాయమూర్తులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అయితే తాయిలాలు, కాకుంటే బెదిరింపులు అన్నది కేంద్ర విధానంగా ఉంది.
తుమ్మలపల్లి రఘురాములు
93463 28291