PM Modi | అవినీతి రహిత పాలన వాగ్దానంతో గద్దె నెక్కిన మోదీజీ మీకు కొన్ని ప్రశ్నలు..
ప్రపంచం కోడై కూస్తున్నా సరే అదానీ ఆర్థిక నేరాలపై పార్లమెంటులో కనీసం చర్చించకుండా అడ్డుపడుతున్నారెందుకు? అతనిపై జేపీసీని వేసేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు?
28 మంది గుజరాతీ వ్యాపారులు రూ.10 లక్షల కోట్ల రుణాలను కొల్లగొట్టి పారిపోతే, వాళ్ల వివరా లు బయటపడినా ఎందుకు పట్టించుకోవటం లేదు?
కర్ణాటక, గోవా బీజేపీ ప్రభుత్వాలు అవినీతి బురదలో పొర్లాడుతున్నాయని బీజేపీ నేతలే గగ్గోలు పెడుతున్నా.. వాటిపై ఈడీ, ఐటీ, సీబీఐ త్రిశూలాన్ని ఎందుకు ప్రయోగించటం లేదు?
బాండ్ల రూపంలో భారీగా మీ పార్టీకి ఫండ్ ఇచ్చిన కార్పొరేట్లను ఎందుకు బయట పెట్టటం లేదు?
అవినీతి నిర్మూలనే మీ ధ్యేయమైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే 95 శాతం ఈడీ, సీబీఐ, ఐటీ దాడులను ప్రతిపక్షాల వారి మీదనే ఎందుకు చేయిస్తున్నారు?
గుడ్డ కాల్చి ప్రతిపక్షాల మీద వేయటమే మీ ధ్యేయం కాకుంటే ఈ తొమ్మిదేండ్లలో ప్రతిపక్షాల వారిపై మీరు చేయించిన వేలాది దాడుల్లో కేవలం 28 కేసులే ఎందుకు రుజువైనట్లు!
అందరిలా కాక మీరు కేవలం దేశం కోసం, ప్రజల కోసమే జీవిస్తుంటే, అలాంటి మీకు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 18 వేల చదరపు అడుగుల రాజ భవనాన్ని 460 కోట్ల ప్రజాధనంతో నిర్మించుకోవటం అవసరమా?
కుటుంబమే లేని మీరు నెలకు రూ.2 లక్షల 80 వేల జీతం తీసుకుంటున్నారెందుకు? ఆ ప్రజాధనంతో కనీసం కొంతైనా పేదల కోసం, అనాథల కోసం ఖర్చు చేయటం లేదు గదా!
కోట్లాది మంది ఒంటి నిండా బట్ట లేని నిరుపేదలున్న ఈ దేశంలో, రూ.పది లక్షల విలువైన సూటు ధరించటం మీ మానవీయతకు నిదర్శనమా?
వేలాది కోట్ల ప్రజాధనంతో విదేశీ పర్యటనలు చేస్తూ కొత్తగా పరిశ్రమలు గానీ, ఉద్యోగాలు గానీ తీసుకురాకపోగా కేవలం అదానీ, అంబానీలకు వివిధ దేశాలలో లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలను కుదిర్చిపెట్టటం మీ దేశభక్తికి నిదర్శనమా?
ఈస్టిండియా వారి విదేశీ పాలనలో కన్నా, నార్తిండియా వారైన మీ స్వదేశీ పాలనలోనే భారతదేశంలో ఆర్థిక అసమానతలు భారీగా పెరిగినట్లు అంతర్జాతీయ సర్వేలు చెబుతున్నాయి.
ప్రభుత్వ సంస్థల్ని తెగనమ్మి, వాటిలో రిజర్వేషన్లకు తావు లేకుండా బీసీ, హరిజన, గిరిజనుల వంటి హిందువుల నోట్లో దుమ్ము కొట్టటమే మీ హిందుత్వ ఎజెండా లక్ష్యమా మోదీజీ?
మీ హయాంలో దేశంలోని 62 శాతం సంపద కేవలం 5 శాతం మంది వద్ద పోగుబడినట్లు ఆక్స్ఫాం ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ పేర్కొన్నారు. దీనికి మీ సమాధానమేమిటి?
గతంలోని 19 కోట్ల ఆకలి బాధితులు, మీ హయాంలో 35 కోట్ల మందికి పెరిగారని, ఆకలి, అనారోగ్య, ఉపాధి లేమి, పౌష్టికాహార లోపం, నివాస గృ హాలు లేని వాళ్ళు వగైరా బాధితులు నేడు 60 కోట్ల మంది ఉన్నారని వివిధ సర్వేలు తెలుపుతున్నాయి.
గత ప్రధానులు చేసిన అప్పు మొత్తం 53 లక్షల కోట్లు కాగా మీరొక్కరే చేసిన జాతీయ, అంతర్జాతీయ అప్పుల మొత్తం 113 లక్షల కోట్లు. ఈ కారణంగా 2022-23 నాటి మన జాతీయ ఆదాయంలో మీరు చేసిన అప్పులు 57.3 శాతంగా ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అంతేకాదు, కాలుష్య రహిత దేశాలతో భారత్కు 180వ స్థానం, పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశాలలో 155వ స్థానం, లింగవివక్ష లేని దేశాలలో 135వ స్థానం, మానవాభివృద్ధి సాధించిన దేశాలలో 132వ స్థానం, ఆకలి బాధితులు లేని దేశాలలో 107వ స్థానం, ప్రజాస్వామ్య దేశాలలో 101వ స్థానాన్ని సంపాదించి పెట్టిన మోదీజీ.. మీ తొమ్మిదేండ్ల పాలనలో భారతదేశ రూపురేఖల్ని మార్చేయడమంటే ఇదేనా?
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యమయ నగరాలలో ప్రపంచంలోనే నెంబర్వన్గా నిలిపిన మీరు – తన రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు క్లీన్ గ్రీన్ సిటీ అవార్డును సాధించి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించేటప్పుడు కనీసం మీ అంతరాత్మనైనా గిల్టీగా ఫీల్ కావటం లేదా మోదీజీ?
భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వరస్వామి నగరంతో రైలు ద్వారా కలిపామంటున్నారు. నిజంగా మీకు వేంకటేశ్వర స్వామిపై భక్తి ఉంటే? తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే- ఏపీకి ప్రత్యేకహోదా హామీని, తెలంగాణకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీని, హైదరాబాద్కు ఐటీఐఆర్ హామీని, గిరిజన యూనివర్సిటీ హామీని ఎందుకు అటకెక్కించేవాళ్ళు?
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులలో ఒక్క దానికైనా జాతీయహోదాను ఎందుకు ఇవ్వలేదు? కనీసం ఒక్కసారైనా తెలంగాణాకు వరద సాయాన్ని ప్రకటించారా? వివిధ రాష్ర్టాలకిస్తూ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఎందుకు ఇవ్వలేదు? సింగరేణిని ప్రైవేటీకరించబోమని పోయినసారి ఇచ్చిన హామీని ఎందుకు పక్కన పెట్టారు?
తెలంగాణ పట్ల ఇంత వివక్షను ప్రదర్శిస్తూ, ఈ రాష్ర్టాభివృద్ధిలో కేంద్రానికి కేసీఆర్ సహకరించటం లేదని ఎలా అనగలుగుతున్నారు మోదీజీ?
అత్యధిక వరి ధాన్యాన్ని పండిస్తున్న, వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ను అందిస్తున్న రాష్ట్రంగా, దేశంలోనే వివిధ రంగాలలో అత్యధిక అవార్డులు పొందిన రాష్ట్రంగా, అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధిపరిచిన నిరంతర కృషీవలుడు, ప్రజాసేవా నిరతుడు, రైతు బాంధవుడు కేసీఆర్ను.. అభివృద్ధికి సహకరించటం లేదని తెలంగాణ నడిబొడ్డున నిలబడి, అబద్ధాలు చెబుతున్న మీ ధైర్యానికి అభినందనలు మోదీజీ!
అవినీతి అక్రమార్కులలో అగ్రగణ్యుడైన అదానీపై విమర్శల జల్లు కూడా పడకుండా మీ పదవీ ఛత్రాన్ని అడ్డుగా పెట్టి కాపాడుతున్నది మీరు. ‘అవినీతిపరులకు నేనంటే భయం. అవినీతిని అంతం చేయాలా! వద్దా!’ అంటూ మీరు అరుస్తుంటే మీ కార్యకర్తల చప్పట్ల మోతలో మీకు వినపడలేదేమో కానీ తెలంగాణ ప్రజలు ఆబాలగోపాలం పకపకా నవ్వుకుంటున్నారు మోదీజీ.
-పాతూరి వెంకటేశ్వరరావు
9349081889