రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం తలపెట్టిన మన ముఖ్యమంత్రి కేసీఆర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ట్యాంక్బండ్ సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్ పక్కన ఉన్న 11 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ విగ్రహాన్ని భారీఎత్తున ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016లో యోచించింది. వెంటనే నిర్ణయం తీసుకొని కార్యక్రమాన్ని అమలులో పెట్టింది. విగ్రహం రూపకల్పన బాధ్యతను కేపీసీ ప్రైవేటు లిమిటెడ్ నిర్మాణ సంస్థకు అప్పగించారు. ప్రధాన శిల్పిగా పద్మభూషణ్ రామ్ వన్జీ సుతార్ వ్యవహరించారు.
ఆయన కుమారుడు అనిల్ సుతార్ కూడా పాలుపంచుకున్నారు. విగ్రహం తయారీకి 353 టన్నుల ఉక్కు, 112 టన్నుల కాంస్యం ఉపయోగించారు. ఎండావానలకు చెక్కుచెదరకుండాఎక్కువ కాలం విగ్రహం మన్నిక కలిగి ఉండే విధంగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలను పాటించారు. విగ్రహం కింది భాగం (బేస్మెంట్) ఢిల్లీలోని ప్రస్తుత పార్లమెంటును పోలి ఉంటుంది. విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా, బేస్మెంట్ ఎత్తు 50 అడుగులు. విగ్రహం బరువు 465 టన్నులు.
వెడల్పు 45 అడుగులు. ప్రాంగణ విస్తీర్ణం విశాలమైన 11 ఎకరాలతో ఉంది. విగ్రహం చుట్టుపక్కల 2.93 ఎకరాల విస్తీర్ణం పచ్చటి మొక్కలతో, గడ్డి మైదానంతో ఆహ్లాదకరంగా ఉంది. విగ్రహం నిర్మాణం ఖర్చు రూ.145 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ వ్యయాన్ని భరించింది.
విగ్రహం సమీపంలో మూడు అంతస్తుల విశాల భవనాన్ని 27,556 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ భవనంలో అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన మ్యూజియం, గ్రంథాలయం, ఆయన రచనలు ఉంటాయి. సభలు సమావేశాలు నిర్వహించుకోవటానికి ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. ఇంతకాలంపాటు అంబేద్కరిస్టుల యాత్రలకు కేంద్రంగా నాగపూర్ నిలిచింది. ఇకపై హైదరాబాద్ ఆ గమ్యస్థానం కానున్నది.
నాటి హైదరాబాద్ రాష్ట్రంతో అంబేద్కర్ను విడదీయరాని అనుబంధం ఉంది. హైదరాబాద్ నగరాన్ని భారతదేశ రెండవ రాజధానిగా చేయాలని నాడు కేంద్ర ప్రభుత్వానికి అంబేద్కర్ సూచించారు. తన జీవిత కాలంలో ఆయన హైదరాబాద్కు ఎనిమిదిసార్లు వచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణతోపాటు నూతన రాష్ర్టాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక మార్లు ప్రస్తావించి, అంబేద్కర్ దూరదృష్టిని కొనియాడిన సంగతి తెలిసిందే. అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ ఆచరణలో కొనసాగిస్తున్నారు. తెలంగాణ నూతన సచివాలయ భవనానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టారు. భారత పార్లమెంటుకు కూడాఅంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విద్యానిధి పేరుతో ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే పేద విద్యార్థులకు 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతున్నది. దళిత నిరుద్యోగుల స్వయం ఉపాధి కోసం దళితబంధు పేరిట గొప్ప సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది. నామినేటెడ్ పదవులలో కూడా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తున్నది. మన దేశంలో అంబేద్కర్ ఆశయాలను పాటిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనటంలో సందేహం లేదు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ మహనీయునికి తెలంగాణ అంజలి ఘటిస్తున్నది. జై భీమ్! జై జై తెలంగాణ! జై జై జై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్!
డాక్టర్ ఈదునూరి వెంకటేశ్వర్లు
99663 36457
(రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్)