థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గును కోల్ ఇండియా, దేశంలో ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ బొగ్గు గనులు రైల్వేశాఖ రేక్స్ ద్వారా సరఫరా చేస్తుంటాయి. ఈ బొగ్గుతో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్టీపీసీ తదితర సంస్థలు 63.360 గిగావాట్లు, రాష్ర్టాల జెన్కోలు 66.38 గిగావాట్లు, ప్రైవేట్ ఉత్పత్తిదారులు 72.67 గిగావాట్లు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి.
బొగ్గు రవాణాకు అవసరమైన రేక్స్ కొరత తీవ్రంగా ఉండటంతో ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖమంత్రి రాష్ర్టాల జెన్కోలు సొంతంగా రేక్స్ను కొనుగోలు చేసుకో వాలని సూచించారు. రేకుల ఖరీదు 9 నుంచి 10 ఏండ్లలో చెల్లిపోతుందని, అనంతరం 20 ఏండ్లు ఉచితంగా వాడుకునే అవకాశం ఉంటుందని ఉచిత సలహా కూడా ఇచ్చారు. బొగ్గు రవాణాకు 453 రేక్స్ అవసరం ఉండగా రైల్వే శాఖ 371 మాత్రమే కేటాయించగలుగుతున్నది. దేశంలో రైల్వే వ్యాగన్ల ఉత్పత్తి నత్త నడకన సాగుతున్నది. ఏటా అవసరమైన సుమారు 33 వేల వ్యాగన్లు, మరమ్మతులకు నిలిచిపోయే 30 వేల వ్యాగన్లు వెరసి 60 వేల వ్యాగన్ల కొరత ఏర్పడటంతో థర్మల్ కేంద్రాల వద్ద నిల్వలు అడుగంటిపోతున్నాయి. థర్మల్ కేంద్రాలకు ప్రత్యేక కారిడార్లు లేకపోవడం సమస్యను మరింత జఠిలం చేస్తున్న ది. ఇప్పటికే విదేశీ బొగ్గు, కొనలేక ఆర్థిక కష్టాలలో ఉన్న జెన్కోలు ఉన్నపళంగా రేక్స్ కొనగలరా? రైల్వేశాఖకు 75 శాతం మేర ఆదాయం సమకూర్చే బొగ్గు రవాణాను నిర్లక్ష్యం చేయడం క్షమించరాని విషయం.
కోల్ ఇండియా లిమిటెడ్ విషయానికి వస్తే సమర్థవంతంగా దేశ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్న సంస్థను నిధుల మళ్లింపు, మానవ వనరుల దుర్విని యోగం తదితర చర్యలతో కేంద్ర ప్రభుత్వమే నిర్వీర్యం చేసింది. వర్షాకాలంలో ఓపెన్కాస్ట్ గనుల వద్ద నీరు చేరనున్నందున విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుం టున్నట్లు బొగ్గు శాఖమంత్రి ఇటీవల సెలవిచ్చారు. ఏటా వచ్చే వర్షాలను ఎదుర్కోవడానికి సన్నద్ధత ఉండనవసరం లేదా?
రైల్వే రవాణా చార్జీలు గత నాలుగేండ్లలో 40 శాతం పెరిగాయి. 2018 జనవరిలో 21 శాతం, అదే సంవత్సరం నవంబర్లో 9 శాతం ఫ్లైట్ చార్జీలు, పెట్రోలియం ధరల పెంపు రీత్యా రైల్వేశాఖ పెంచింది. అదే సమయంలో మార్చి 2016 నుంచి టన్ను ముడిబొగ్గుపై రూ.400ల క్లీన్ ఎనర్జీ చార్జీలను కేంద్రం వసూలు చేస్తున్నది. అంతకుమునుపు అది కేవలం టన్నుకు రూ.50గా ఉండేది. క్లీన్ ఎనర్జీ చార్జీల రూపేణా ఏడాదికి రూ.25,000 కోట్లు కేంద్ర ఖజానాకు చేరుతున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు విధిగా 10 శాతం విదేశీ బొగ్గును వాడాల్సిందేనని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఐదారు రెట్లు ఎక్కువ ఖరీదు చేసే విదేశీ బొగ్గును వాడటం వల్ల ఉత్పత్తి వ్యయం యూనిట్కు కనీసం 70 పైసల వరకు పెరుగుతుంది. మరి ఎవరి నుంచి ఆ అదనపు డబ్బులు రాబట్టుకోవాలి? దేశీయ బొగ్గు సరఫరానే చేయ లేకపోతున్న రైల్వేశాఖ విదేశీ బొగ్గును పోర్టుల నుంచి ఎలా సరఫరా చేస్తుంది? పెరిగిన రవాణా చార్జీలను ఎలా పూడ్చుకోవాలి. బొగ్గు నాణ్యతను నిర్ధారించడం, విదేశీ బొగ్గును బ్లెండింగ్ చేయడానికి విద్యుత్ కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు, వసతులు లేకపోవడంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. దేశంలోని థర్మల్ కేంద్రాలలో బాయిలర్స్ విదేశీ బొగ్గును వాడటానికి అనువుగా ఉండవు. ఉష్ణోగ్రతలలో వ్యత్యాసాలు ఏర్పడి బాయిలర్ ట్యూబ్ లీకేజీలు, బాయిలర్లో అంతర్గతంగా సమస్యలు ఉత్పన్నమై జనరేటర్లు మూసి వేయాల్సి న పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ రూ.8,308 కోట్ల విలువ చేసే 6.25 మిలియన్ టన్నుల బొగ్గును అదానీ ఎంటర్ప్రైజెస్ ద్వారా కొనుగోలు చేసింది. అంతకు ముందు మార్చిలో 5.75 మిలియన్ టన్నుల బొగ్గును రూ.8,422 కోట్లకు సరఫరా చేయడానికి అదానీ ఎంటర్ప్రైజెస్తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పటికే 4.1మిలియన్ టన్నులు బొగ్గు ఎన్టీపీసీకి చేరుకున్న ట్లు సమాచారం. ఎన్టీపీసీ మొత్తంగా 20 మిలియన్ టన్నుల బొగ్గును కొనడానికి కసరత్తు చేస్తు న్నది. తాల్చేర్, ఫరక్కా, కహల్గావ్ గనులకు అత్యంత సమీపంలోనే ఎన్టీపీసీ ఉన్నప్పటికీ విదేశీ బొగ్గును కొనుగోలు చేస్తుండటం గమనార్హం.
మన రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ జెన్కో, సింగరేణి ఆధ్వర్యంలోని థర్మల్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5200 మెగావాట్లు. ప్రతీరోజూ సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. 10 శాతం విదేశీ బొగ్గు కొనాల్సి వస్తే మన సంస్థల మీద ఏడాదికి సుమారు రూ.9 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ నేపథ్యంలోంచే విదేశీ బొగ్గు కొనే ప్రసక్తే లేదని జెన్కో సీఎండీ ప్రభాకర్రావు స్పష్టం చేయటం గమనించాల్సిన విషయం.
ఈ సందర్భంగా విదేశీ బొగ్గు ప్రభావం గురించి చెప్పుకోవాలి. ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజీ (ఐఈఎక్స్) ద్వారా విద్యుత్ క్రయవిక్రయాలు జరుగుతుం టాయి. గతేడాది 2021 జూన్లో కంటే ఈ ఏడాది 2022 జూన్లో యూనిట్ రేట్లు రెట్టింపుకు పైగా ఉంటున్నవి. ఈ పరిస్థితుల్లోనే ఎక్సేంజీ నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాది జూన్లో యూనిట్ రేటు అత్యధికంగా రూ.8.66 పైసలు, అత్యల్పం 0.60 పైసలు. సగటు రేటు రూ.3.06 పైసలుగా ఉండింది. ఈ సంవత్సరం అత్యధికంగా రూ.12, అత్యల్పంగా రూ.1.50 పైసలుగా, సగటు రేటు రూ.6.59 పైసలుగా ఉన్నది. ఈ నెల ఉత్పత్తి జరిగిన 6003 మిలియన్ యూనిట్లను సుమారు రూ.3,956 కోట్లుగా అమ్మకాలు జరిగాయి. ఇవే యూనిట్లను గతేడాది సగటు యూనిట్ రేటుతో పోల్చి చూసినప్పుడు రూ.2,119 కోట్లు అధికం. విదేశీ బొగ్గు ప్రభా వం ఏ మేరకు ఉండనున్నదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తులను ఉద్దేశపూర్వకంగా నియంత్రించి, విదేశీ బొగ్గు కొనుగోలును తప్పనిసరి చేయడంతో ఇండియన్ ఎనర్జీ ఎక్చేంజీలో విద్యుత్ యూనిట్ రేట్లు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రభుత్వరంగ డిస్కంలు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు, విదేశీ బొగ్గు కారణంగా పెరిగే విద్యుత్ చార్జీలకు కేంద్రప్రభుత్వమే కారణం. చవకైన మన బొగ్గును కాదని, విదేశీ బొగ్గును కొనాలని అనటం ఎవరి ప్రయోజనాల కోసమో మోదీనే చెప్పాలి.
(వ్యాసకర్త: తుల్జారాంసింగ్ ఠాకూర్ 78930 05313, అధ్యక్షులు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్, టీఎస్ఎస్పీడీసీఎల్)