కేంద్రప్రభుత్వ రంగ సంస్థ, హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీ) కార్మికులు గత 18 నెలలుగా తమకు రావాల్సిన జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 21న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరించడం, కంపెనీని మూసివేసే ప్రయత్నాలను కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. పీఎస్యూల ఆధునీకరణను ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
జార్ఖండ్ రత్నంగా పిలిచే హెచ్ఈసీ రాంచీలో ఉన్నది. ఇది అనేక ముఖ్యమైన ప్రభుత్వ ప్రాజెక్టులకు కీలక సేవలను అందించింది. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్ 1 వంటి ప్రాజెక్టుల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు సాంకేతిక సేవలు అందించింది. భిలాయ్, బొకారో, విశాఖపట్నం, దుర్గాపూర్లలో ప్లాంట్లను నిర్మించడానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)కు కూడా సహాయపడింది. భారతదేశపు ప్రధాన యుద్ధట్యాంక్ అర్జున్ వంటి భారీ ఆయుధాలను తయారు చేయడంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు సహాయం చేసింది. హెచ్ఈసీ తయారు చేసిన యంత్రాలు విభిన్న పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు. మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ తదితర సంస్థల్లో బొగ్గును వెలికితీసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ ద్వారా హెచ్ఈసీ నిర్మించిన యంత్రాలను ఉపయోగిస్తారు.
హెచ్ఈసీ పనితీరు బాగున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. తద్వారా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయేలా చేసిందని వారంటున్నారు. దానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఉత్పాదక సామర్థ్యాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉన్నది. అ యితే ప్రభుత్వం దీనికి నిధు లు ఇవ్వడానికి నిరాకరించింది. 2012-13 నుంచి కంపెనీ ఆర్థిక పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. హెచ్ఈసీకి నిరంతర నష్టా లు ఉన్నాయని 1992లో బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ తెలిపింది. దీన్ని ఖాయి లా పరిశ్రమగా ప్రకటించాలని డిసెంబర్ 2018లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక పేర్కొన్నది. 2004లో కంపెనీని మూసివేయాలని బోర్డు సిఫారసు చేసింది. అయినప్పటికీ, బకాయిలు, ఇతర రుణాలను తీర్చడానికి హెచ్ఈసీకి రెండుసార్లు ప్రత్యేక ప్యాకేజీలు అందించారు. కంపెనీకి ఉన్న 675.43 ఎకరాల భూమి ని జార్ఖండ్ ప్రభుత్వానికి అమ్మటం ద్వారా రూ.742.98 కోట్లు సమీకరించింది. నికరలాభం కూడా 2006-07లో రూ.2.86 కోట్లు, 2013-14లో రూ.299.31 కోట్లు.
ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం వాగ్దానాలు చేసినప్పటికీ, హెచ్ఈసీ ఆధునీకరణ ఎప్పుడూ అమలు కాలేదు. భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధునీకరణను కొనసాగించలేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తెలిపింది.
సాంకేతిక మదింపు నిర్వహించి, ఆధునీకరణ-పునరుద్ధరణ ప్రణాళికను కాలానుగుణంగా అమలు చేయాలని భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది, కానీ అది జరగలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ నిర్లక్ష్యం హెచ్ఈసీ ప్రస్తుత సంక్షోభానికి దారితీసింది. దాదాపు 18 నెలలుగా జీతాలు లేని హెచ్ఈసీ కార్మికులు కుటుంబ పోషణ కోసం చాయ్, వార్తాపత్రికలు అమ్ముకునే స్థాయికి దిగజారారు. కార్మికులు తమ ఉద్యోగాలను కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తూనే పెండింగ్లో ఉన్న తమ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కంపెనీ ఆధునీకరణ-పునరుద్ధరణ ప్రణాళిక అమలు కోసం పోరాటాన్ని కొనసాగించాలనినిర్ణయించుకున్నారు.
ఆళవందార్ వేణుమాధవ్
86860 51752