విశ్వవిద్యాలయాలకు సంబంధించినంతవరకు అధ్యాపకుల నియామకం అత్యంత కీలకం. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం పలు వర్సిటీలలో ఉన్న ఖాళీలు గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టడానికి అనుమతులు కూడా ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వుల మూలంగా అవి ముందుకు కదల్లేదు. రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబించడం మూలంగా దాదాపు నాలుగేండ్ల పాటు నియామకాలు చేపట్టలేని ఆస్పష్టత దేశవ్యాప్తంగా ఏర్పడింది.
వర్సిటీల్లో నియామకాల కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ సిఫారసులను పరిశీలించి క్యాబినెట్ కామన్ బోర్డును ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి జూన్లోనే ఉత్తర్వులు విడుదల చేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన బిల్లును సెప్టెంబర్లోనే శాసనసభలో ఆమోదించి గవర్నర్కు పంపించింది. నాలుగు నెలలుగా వారు దాన్ని పరిశీలిస్తున్నారు.
యూజీసీ ఆదేశాలు: అవరోధాల నేపథ్యంలో అధ్యాపకుల కొరత, విద్యార్థుల భవిష్యత్తును గమనించిన ప్రభుత్వం 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీచేయాలని 2017లో జీవో-30ని విడుదల చేసింది. పాత పద్ధతిలోనే అత్యవసరంగా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. కానీ, అదే సమయంలో ఎక్కడో అలహాబాద్ వర్సిటీలో రిజర్వేషన్ల అమలు పద్ధతి విషయంలో సుప్రీంకోర్టులో ఒక కేసు పెండింగ్లో ఉన్నందున అది తేలేదాకా నియామకాలు చేపట్టవద్దని దేశంలోని అన్ని వర్సిటీలకు యూజీసీ ఒక సర్క్యులర్ పంపింది. రిజర్వేషన్లు ఇప్పుడున్న ఫ్యాకల్టీ ప్రాతిపదికన కాకుండా శాఖలవారీగా ఉండాలన్నది ఆ కేసు సారాంశం. ఇది 2014లోనే నమోదైంది. ఆ తర్వాత కొన్ని నెలలకు కోర్టు కేసు తేలేవరకు నియామకాలకు చేపట్టకూడదని కేంద్రం యూజీసీని, వర్సిటీలను ఆదేశించింది. దానితో రాష్ట్ర ఉన్నత విద్యామండలి కూడా నియామకాలకు విశ్వవిద్యాలయాలు చేస్తున్న ప్రయత్నాలను నిలిపివేసింది. కానీ వర్సిటీలను మూసివేయలేం కాబట్టి వివాదాలు సద్దుమణిగేవరకు ఇప్పుడు కాంట్రాక్టులో ఉన్న అధ్యాపకులకు మెరుగైన వేతనాలు ఇవ్వాలని భావించి అసిస్టెంట్ ఈ ప్రొఫెసర్ కనీస వేతనంతో పాటు కొన్ని అలవెన్సులు ఇస్తూ వారినే కొనసాగిస్తూ వారిద్వారానే వర్సిటీలను నడిపిస్తూ వచ్చారు.
రాష్ట్ర ఏర్పాటునాటికి 20 వేల లోపు కాంట్రాక్టు అధ్యాపకులకు ఇప్పుడు 50-70 వేల కనీస వేతనం వస్తున్నది. ఇది వారి పనికి, ప్రతిభకు సరిపోతుందని చెప్పలేం. కానీ అంతో ఇంతో వారు నిలదొక్కుకోవడానికి దోహదపడిన మాట వాస్తవం. అలహాబాద్ వర్సిటీ రిజర్వేషన్ విషయాన్ని సాకుగా చూపి నియామకాలు ఆపేసిన యూజీసీ, కేంద్రం 2019 ఎన్నికలకు ముందు ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడంతో, ఇప్పుడు కొనసాగుతున్న విధానాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత, యూజీసీ ఆదేశాల మూలంగా నియామకాల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిమూలంగా ఐదేండ్లు ఒక్క నియామకం లేకుండానే పూర్తయ్యాయి.
ఆగిపోయిన బోర్డు: ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి కాంట్రాక్టు లెక్చరర్ల సమస్య ప్రధాన ప్రతిబంధకంగా ముందుకువచ్చింది. అలాగే వర్సిటీ వీసీల నియామకం కూడా ఆలస్యమైంది. కరోనా కారణంగా ఏడాది పాటు వర్సిటీల్లో ప్రత్యక్ష బోధన మూలకు పడిపోయింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పది వర్సిటీలకు వీసీల నియామకం ప్రభుత్వం 2021 మే నెల నాటికి పూర్తిచేసింది. కొత్త వీసీలకు వచ్చీరాగానే ఎదురైన ప్రధాన సమస్య అధ్యాపకుల కొరతే కావడంతో వెంటనే నియామకాలు చేపట్టాలని వీసీలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా ఆ బాధ్యత వర్సిటీల నెత్తిన పెట్టకుండా ఒక ఉమ్మడి నియామక సంస్థ ద్వారా చేపట్టాలని వీసీలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. స్వయంగా తామే చేస్తే స్వయం ప్రతిపత్తి పక్కనపెట్టి సమస్యలు వస్తాయని వారికి తెలుసు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్క పోస్టుకు వందల మంది పోటీపడే అవకాశం ఉంటుంది. వీసీల మీద, అధ్యాపకులు, అధికారుల మీద ఒత్తిడి ఉంటుంది.
ఈ విషయం వారికి స్పష్టంగా తెలుసు. కాబట్టే ప్రత్యామ్నాయ పద్ధతికి వీరంతా ఓటువేశారు. దానిమేరకే రాష్ట్ర ప్రభుత్వం కామన్ బోర్డును ఏర్పాటుచేసింది. వాటిలో 3,500 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీచేయాలని గత ఏప్రిల్ 12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలోని 11 వర్సిటీల పరిధిలో 1,551 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అందులో మొదటి విడతలో 1,061 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే నాటినుంచి వాటి భర్తీ కోసం నోటిఫికేషన్ రాకపోవడం గమనార్హం. గతంలో వర్సిటీలే వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీచేసి నియామకాలు చేపట్టే విధానం అమల్లో ఉన్నది. దానివల్ల ఒకే అభ్యర్థి వేర్వేరు వర్సిటీల్లో ఉద్యోగాల్లో నియామకమైనప్పుడు మళ్లీ ఖాళీలు ఏర్పడుతున్నాయన్న అభిప్రాయాలున్నాయి. దానికితోడు ఒక్కో వర్సిటీ ఒక్కో విధానం అమలు చేయడం వల్ల గందరగోళం తలెత్తుతుందన్న సందేహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వర్సిటీల్లో నియామకాల కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ సిఫారసులను పరిశీలించి క్యాబినెట్ కామన్ బోర్డును ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి జూన్లోనే ఉత్తర్వులు విడుదల చేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన బిల్లును సెప్టెంబర్లోనే శాసనసభలో ఆమోదించి గవర్నర్కు పంపించింది. నాలుగు నెలలుగా వారు దాన్ని పరిశీలిస్తున్నారు.
వర్సిటీలకు సంబంధించినంత వరకు అధ్యాపకుల నియామకం అత్యవసరం, అత్యంత కీలకం కూడా. అధ్యాపకులు లేకపోవడం వల్ల బోధన కుంటుపడటమే కాదు, విద్యా ప్రమాణాలు కూడా దెబ్బతింటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్ల విద్యార్థుల స్థూల నమోదులో మనం దేశంలోనే ముందున్న మాట వాస్తవమే. కానీ, ప్రమాణాలు, నాణ్యమైన ఉన్నతవిద్య విషయంలో కొంత వెనుకబడి ఉన్నామన్నది గుర్తించాలి. ప్రభుత్వం తక్షణం కొన్ని అత్యవసర చర్యలు తీసుకోకపోతే ఇంకా నష్టం కలిగే ప్రమాదం ఉన్నది. అందులో రిక్రూట్మెంట్ బిల్లును ఆమోదింపజేసుకోవడం ముఖ్యం. గవర్నర్ కూడా ఈ పట్టింపులు వదిలేసి ఏదో ఒక విషయం చెప్పాలి. ఆమెకు అర్థం కాని అభ్యంతరాలుంటే విద్యావేత్తలను పిలిచి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ బిల్లు పట్ల, అందులో ప్రతిపాదించిన పద్ధతి పట్ల అభ్యంతరాలుంటే తిప్పి పంపే అధికారం గవర్నర్కు ఉన్నది. మార్పుచేర్పులు సూచించడానికీ అవకాశం ఉన్నది. ఇప్పటికే అనేకమంది విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఈ విషయమై విజ్ఞప్తులు చేసి ఉన్నారు.
మొన్నటికి మొన్న ఓయూ అధ్యాపకుల సంఘం నాయకులు, తెలంగాణ వర్సిటీల అధ్యాపకుల ఫెడరేషన్ నాయకులు కూడా గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పలు వర్సిటీలు ఈ ఏడాది న్యాక్ అక్రిడేషన్ కోసం ప్రయత్నిస్తున్నాయి. న్యాక్ అనేది జాతీయస్థాయిలో కేంద్రం, యూజీసీ ఆధ్వర్యంలో వర్సిటీల మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, ఇతర వసతులు చూసి వర్సిటీలకు ర్యాంకింగ్ ఇచ్చే సంస్థ. ఈ ర్యాంకింగ్ ఆధారంగానే యూజీసీ నిధులు కేటాయిస్తుంది. టీచర్లు తగిన నిష్పత్తిలో లేకపోతే సరైన గుర్తిం పు రాదు, నిధులూ రావు. ఇప్పటికే రాష్ట్రంలోని వర్సిటీలకు కేంద్ర నిధులు, రీసెర్చ్ గ్రాంట్లు, జాతీయ ఉన్న త విద్యామండలి (రూసా) నిధులు సరిగా అందడం లేదు. ఫెలోషిప్లు ఆగిపోయాయి. ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగి అధ్యాపకుల నియామకం ఆగిపోతే తలెత్తే సంక్షోభానికి వర్సిటీల ఛాన్సిలర్గా ఉన్న గవర్నర్ కారణం కాకూడదు. అత్యంత కీలకమైన ఈ బిల్లును నెలల తరబడి ఆపివేయడం అంటే తెలంగాణ భవిష్యత్తును, విద్యారంగ అభివృద్ధిని తొక్కిపెట్టడమేనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. గవర్నర్కు ఆ అపప్రథ రాకూడదనే ఆశిద్దాం.
గవర్నర్కు అర్థం కాని అభ్యంతరాలుంటే విద్యావేత్తలను పిలిచి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ బిల్లు పట్ల, అందులో ప్రతిపాదించిన పద్ధతి పట్ల అభ్యంతరాలుంటే తిప్పి పంపే అధికారం గవర్నర్కు ఉన్నది. ఇప్పటికే అనేకమంది విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఈ విషయమై విజ్ఞప్తులు చేసి ఉన్నారు. మొన్నటికి మొన్న ఓయూ అధ్యాపకుల సంఘం నాయకులు, తెలంగాణ వర్సిటీల అధ్యాపకుల ఫెడరేషన్ నాయకులు కూడా గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పలు వర్సిటీలు ఈ ఏడాది న్యాక్ అక్రిడేషన్ కోసం ప్రయత్నిస్తున్నాయి. న్యాక్ అనేది జాతీయస్థాయిలో కేంద్రం, యూజీసీ ఆధ్వర్యంలో వర్సిటీల మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, ఇతర వసతులు చూసి వర్సిటీలకు ర్యాంకింగ్ ఇచ్చే సంస్థ. ఈ ర్యాంకింగ్ ఆధారంగానే యూజీసీ నిధులు కేటాయిస్తుంది.
– ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
(వ్యాసకర్త: డైరెక్టర్ (అకడమిక్), డాక్టర్ బీఆర్అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం)