అసెంబ్లీ వైపు వెళుతుంటే రోడ్డు అంతా ఎర్రగా ఉంది. ఏమైందని అడిగాను.‘అయ్యో.. మీకు తెలియదా, నిన్న కేటీఆర్ ఊచకోత కోసిండు అన్నారు ఒకరు’ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో యువనేత, మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడిన తీరుపై సోషల్ మీడియాలో పోస్టు చూసిన.అవును.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజల గోస ఎట్లుండె.. స్వరాష్ట్రంలో ఇప్పుడెట్లున్నది? అని కూడా ఆలోచించకుండా, కేవలం రాజకీయ లబ్ధికోసం విమర్శలు చేసే, కళ్లుండి చూడలేని కబోదుల్లాంటి విపక్ష నాయకుల విమర్శలపై ఊచకోత కోశాడు. ఇంకా చెప్పాలంటే అన్నీతానై.. సభా నాయకున్ని మైమరిపించాడు.
సమైక్యరాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అనుభవించిన కడగండ్లు తలుచుకుంటే నేటికి కంటి నుండి కన్నీరు కాదు, నెత్తురు కారుతుంది. తెలంగాణలో గోదావరి, కృష్ణా జీవనదు లు పారుతున్నా మడి తడవని దుఖంతో తెలంగాణ రైతాంగం తల్లడిల్లిపోయింది. భూగర్భ జలా లే దిక్కై పాతాళానికి బోర్లు వేయాల్సి వచ్చేది. దీనికి కరెంటు కష్టాలు కూడా తోడై వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. దిక్కుతోచని రైతన్నలు పల్లెల నుంచి అన్నమో రామచంద్రా అంటూ పట్నానికి వలసబాట పట్టారు. నీళ్ళు అడుగంటినట్టే ఆశలు కూడా అడుగంటిపోయి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అనేకం. అలాంటి ఎండిన గొంతులు, కరువు నేలలు, కా రు చీకట్లను తొలగించుకుని ఈరోజు దేశం ముం దు కాంతిరేఖగా తెలంగాణ సగర్వంగా నిలవడ్డది. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచి సబ్బండ వర్గాల సంక్షేమం ధ్యేయంగా, మానవీయ పాలనతో ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అని వలపోసుకున్న గ్రామాలు ఇవా ళ నవచరిత్రకు పునాదులై ప్రగతి పథంలో దూసుకుపోతున్నయి. బతుకుచిత్రం ఛిద్రమైన చోటనే కొత్త ఆశలు, ఆశయాలతో జీవితాల నిర్మాణం సాగుతోంది. గాంధీ మహాత్ముని గ్రామ స్వరాజ్యం దిశగా, స్వయం సమృద్ధితో స్వావలంబన దిశగా తెలంగాణ పల్లెలు పరుగులు పెడుతున్నవి.
పల్లె ప్రజల జీవితాలకు ఆయువుపైట్టెన వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యంతోనే ఈరోజు సత్ఫలితాలు వస్తున్నాయి. రైతు బిడ్డే పాలకుడైతే సంక్షోభంలో చిక్కుకున్న సాగు సంబురంగా మారుతుందన్న సత్యం మన కండ్ల ముందు ఆవిష్కృతమైంది. పదేండ్లు కూడా లేని పసికూన తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం అనుదినం శ్రమించినం. ఇప్పుడు తెలంగాణలో నీళ్ల గోస తీరింది. నిధుల వరద పారుతోంది. నియామకాల కల సాకారమవుతున్నది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తీరు ప్రశంసనీయం. అన్నిరంగాల్లో ఎనిమిదిన్నరేండ్ల స్వల్ప కాలంలోనే తెలంగాణ సాధించిన ప్రొగ్రెస్ రిపోర్టును మంత్రి కేటీఆర్ ప్రకటించిన గొప్ప సందర్భం ఇది. కేంద్రం ఆటంకాలను అధిగమిస్తూ, ముందుకు సాగుతున్న తెలంగాణ పాలనను కానీ, అభివృద్ధిని కానీ గుర్తించ నిరాకరిస్తున్న మోదీ తీరును, ఆయన అనైతిక విధానాన్ని మంత్రి కేటీఆర్ ఉతికి ఆరేసిన తీరు అన్నివర్గాల ప్రజలనూ ఆకట్టుకున్నది.
(వ్యాసకర్త : బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
-కర్నాటి విద్యాసాగర్