PM Modi | రోనాల్డ్ రీగన్, వ్లాదిమిర్ జెలెన్ స్కీ లాంటి నటులు దేశాధినేతలయ్యారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత లాంటి వాళ్లు రాష్ర్టాల ముఖ్యమంత్రులయ్యారు. వీరంతా సినిమాల్లో నటులుగా వాళ్లు చేయాలనుకున్నదంతా చేసేసి, రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో కూడా తమదైన శైలిలో ప్రజల కోసం ఎంతో కొంత చేయాలన్న తపనతో కృషిచేసి ప్రజల మెప్పు పొందారు. ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ అయితే ఈ రోజుకు కూడా యుద్ధభూమిలో తిరుగుతూ దేశం కోసం పోరాడుతున్నాడు.
దీనికి పూర్తి వ్యతిరేకంగా కొన్ని చారిత్రక వింతలు, విడ్డూరాలు కూడా జరుగుతుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తిలో తానొక మంచి నటుడు కావాలన్న తపన, తన డైలాగ్ డెలివరీతో క్లాస్, మాస్ తేడా లేకుండా అందరినీ ఆకట్టుకోవాలన్న తపన, అంతర్లీనంగా అతనిలో ఎక్కడో ఏ మూలో విపరీతంగా ఉంటుంది. కానీ, విధి వక్రీకరించి, అనుకోకుండా ఆ వ్యక్తి ఒక నాయకుడవుతాడు. ఫలితంగా.. అటు నాయకుడిగా ప్రజలకు ఎలాంటి సేవ చెయ్యలేడు. ఇటు తనలోని నటవైదుష్యాన్ని ప్రదర్శించుకోలేడు. నటునిగా అతని ప్రతిభంతా అప్పుడప్పుడు కొన్ని స్పీచ్లు, ఫొటోషూట్లు, వీడియో కవరేజీలకే పరిమితమైపోతుంది. ఇలాంటి దయనీయమైన మానసిక స్థితిలో నాయకుడిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించటం ఎవరికైనా అంత సులభం కాదు. ఎప్పటికప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోతూ, అసలు తాను ఎప్పుడు, ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకే అర్థం కాని స్థితిలో ఉంటాడు.
మొన్న నిజామాబాద్లో మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అంతా విన్న తర్వాత, నాకెందుకో ఆయన కూడా అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నారా అన్న సందేహం కలిగింది.
రాజకీయాల్లో విమర్శలు సహజం. ఇక ఎలక్షన్లు కూడా దగ్గరలో ఉన్నాయంటే రాజకీయపార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆకాశాన్నంటుతుంటాయి. ఇది కూడా సహజమే. కానీ, ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి చేసే ఆరోపణలు కానీ, విమర్శలు కానీ హుందాగా ఉండాలి. ఎదుటివారు సమాధానం ఇవ్వలేని స్థాయిలో వాస్తవాలై ఉండాలి. రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో కావాలని ఏదైనా అబద్ధం చెప్పినా అది లాజిక్కు నిలబడాలి. దురదృష్టవశాత్తు, మొన్న మన ప్రధాని ఉపన్యాసంలో ఆయన మాట్లాడిన మాటలు అలా లేవు. అర్థం పర్థం లేని డ్రామా డైలాగుల్లా ఉన్నాయి.
భారత స్వాతంత్య్ర సమరయోధుడు, నెహ్రూకు సరిసమానుడైన దేశ నాయకుడు, ఉక్కుమనిషి సర్దార్ పటేల్ స్థాయిని తగ్గించేలా మాట్లాడటం అవమానకరం. అప్పటి హైదరాబాద్ స్టేట్ ప్రజల పోరాటాన్ని గుర్తించి, భారత ప్రభుత్వ నిర్ణయం మేరకు, హైదరాబాద్ను విముక్తం చేసే విషయంలో పటేల్ ఒక కేంద్ర హోంమంత్రి హోదాలో తన బాధ్యత నిర్వర్తించారు తప్ప, ఒక గుజరాతీ బిడ్డగా కాదు.
తాను ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు, ఈ పదేండ్లలో తెలంగాణలో కనీసం ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయస్థాయి హోదా ఇవ్వలేదు, ఒక కొత్త ప్రాజెక్టునివ్వలేదు, ఒక ఇండస్ట్రీనివ్వలేదు, ఒక మెడికల్ కాలేజీ లేదు, ఒక నవోదయ విద్యాలయ లేదు. గుర్తొచ్చినప్పుడల్లా తెలంగాణ ఆవిర్భావం మీద విషం కక్కడం తప్ప ఆయన తెలంగాణకు చేసిందేమీ లేదు. అలాంటి వ్యక్తి మరో గుజరాతీ బిడ్డగా నేను తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నా అనడం హాస్యాస్పదం, అవమానకరం. పైగా, ప్రధానమంత్రి అంటే దేశం మొత్తానికి చెందినవాడవుతాడు కానీ, నేను గుజరాతీ బిడ్డగా ఇది చేస్తున్నాను, అది చేస్తున్నానని తన స్థాయిని తగ్గించుకోడు.
కేసీఆర్ ఎన్డీయేలో చేరతామంటే మోదీ ఒప్పుకోలేదట! జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో మద్దతు కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారట! అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలంటారు పెద్దలు. ఎప్పుడూ ప్రస్తావనలోకి రాని ఎన్డీయేలో కేసీఆర్ చేరాలనుకుంటారనుకోవడం అవివేకం. అంతేకాదు, లోకల్గా ఒక మేయర్ పదవి కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోదీని కలుస్తారనుకోవడం ఎవరూ నమ్మలేని మరొక పచ్చి అబద్ధం. పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, తెలంగాణ ప్రజల ద్వారా ముఖ్యమంత్రిగా ఎన్నికై, రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ, వచ్చే ఎన్నికల తర్వాత ముచ్చటగా మూడోసారి కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న కేసీఆర్ను నరేంద్ర మోదీ తిరస్కరించడమేంటి?
గత 60 ఏండ్లుగా ఈ ప్రాంతం కోసం ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయనన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి చూపిస్తూ, ప్రపంచస్థాయి నాయకులు, సంస్థలతో శభాష్ అనిపించుకుంటున్న కేసీఆర్ అవినీతిపరుడెలా అవుతాడు? కేంద్రంలో ఉన్నది మీరే కదా, మరి ఎందుకని ఆయన అవినీతిని బయటపెట్టడం లేదు? వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారమిస్తేనే ఆయన అవినీతిని బయటపెడతామనడం ఎంత ఎడాలిసెంట్ మాట? నిజానికి ఎక్కడ అవినీతి పొంగిపొర్లుతోందన్నది కట్టిన కొన్నిరోజులకే కూలిపోతున్న బ్రిడ్జిలు, ఫ్లయి ఓవర్లే చెప్తున్నాయి. ఆ స్థాయి అవినీతి ఉన్నది తమ సొంత బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే అక్కడి అవినీతి గురించి మోదీ ముందు ఆలోచించాలి.
దేశ ప్రజలు సంపూర్ణ మెజారిటీతో రెండుసార్లు బంగారు పళ్లెంలో పెట్టి అధికారం చేతికి అందించినప్పుడు, పదేండ్లలో దేశాన్ని అభివృద్ధి పథంలో ప్రపంచం నివ్వెరపోయేస్థాయికి తీసుకువెళ్లవచ్చు. దురదృష్టవశాత్తు, నరేంద్ర మోదీ ప్రభుత్వం అలా చేయలేకపోయింది. పవర్ ఉపయోగించి రాష్ర్టాల్లో అధికారం చేజిక్కించుకోవడం, సున్నిత విషయాల్లో ప్రజలను రెచ్చగొట్టి ఎప్పటికప్పుడు ఎన్నికల్లో గెలవాలనుకోవడం వంటి ‘అధికారం’ ప్రధాన లక్ష్యంగానే వారు ఏదైనా చేయగలిగారు తప్ప, ‘అభివృద్ధి’ గురించి ఆలోచించలేకపోయారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ దాదాపు ఒకే సమయంలో పదవుల్లోకి వచ్చారు. రాష్ట్రస్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాధించిన ఎన్నో అద్భుత విజయాల్లో కనీసం 10 శాతం విజయాలను కూడా కేంద్రస్థాయిలో ప్రధాని మోదీ సాధించారా? అన్నది జవాబు దొరకని ప్రశ్న.
కట్ చేస్తే… సామర్థ్యం ముందు వారసత్వం అనే పదానికి అర్థం లేదు. అలాగే, సామర్థ్యానికి వారసత్వం అనేది ఎప్పుడూ అడ్డు కాకూడదు. కేటీఆర్ విషయంలో వారసత్వం అనేది కేవలం అతని పొలిటికల్ ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడవచ్చు. కానీ, ఆ తర్వాత అంతా కేటీఆర్ స్వయంకృషే అన్నది పార్టీలకతీతంగా ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిన నిజం. స్వయంగా ఎందరో కేంద్రమంత్రులు, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్రపంచస్థాయి కంపెనీల సీఈవోలే ఎన్నోసార్లు కేటీఆర్ సామర్థ్యం గురించి వివిధ వేదికలపై ఎంతగానో మెచ్చుకుంటూ మాట్లాడారు.
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు, కేటీఆర్ ఏ స్థాయికి ఎదిగినా కేసీఆర్ తనయుడే. కానీ, కేటీఆర్ అంటే ఇప్పుడొక బ్రాండ్. భారత రాజకీయాల్లో ఒక రాక్స్టార్. కేటీఆర్ను ముఖ్యమంత్రి చెయ్యాలనుకుంటే రెండే రెండు నిమిషాలు చాలు. అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ ఉన్న బీఆర్ఎస్ ఎల్పీ సింగిల్ లైన్ ప్రపోజల్తో చేసుకోగలుగుతుంది. కానీ, కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం కేసీఆర్ నరేంద్ర మోదీ ఆశీస్సులు కోరారనటం ఈ శతాబ్దపు పెద్ద జోక్. కేవలం వాట్సాప్ యూనివర్సిటీతో తలపండినవారు మాత్రమే ఇలాంటి జోకులను ఎంజాయ్ చేయగలుగుతారు.
సభకు వచ్చిన ప్రజల చప్పట్ల కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేయడం వేరు. మనం చీప్ అయిపోవడం వేరు. రెండోది అత్యంత విషాదం. మొన్నటి నిజామాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్లో కనిపించింది ఆ విషాదమే.
(వ్యాసకర్త: సినీ దర్శకుడు, రచయిత)
-మనోహర్ చిమ్మని