కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ వాటిలో ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజల ఆశలను అడియాసలు చేసింది. దేశ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. ఈ తరుణంలో ఈ దుర్మార్గ పాలనను ప్రశ్నిస్తూ, తెలంగాణ మాడల్ అభివృద్ధిని దేశానికి అందించడానికి బీఆర్ఎస్ అధినేత జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలు, ప్రతి పక్షాలు ఐక్యంగా ఆయనను బలపరచాల్సిన అవసరం ఉన్నది.
2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నిరుద్యోగం రూపు మాపుతామన్నారు.. నల్ల ధనం వెలికి తీస్తామన్నారు. దేశ ప్రజలు ఇవన్నీ నిజమే అనుకుని బీజేపీకి పట్టం కట్టారు. కానీ ఆ పార్టీ దేశాన్ని అభివృధ్ధి చేయకపోగా తిరోగమనానికి కారణ మైంది. దేశాన్ని అధోగతి పాల్జేస్తున్నది. అడ్డ గోలుగా దేశ సంపదను అనుయాయులకు కట్టబెడుతున్నది. జాతి ప్రయోజనాల కోసం నెలకొల్పిన ఎన్నో వ్యవస్థలను ఛిన్నా భిన్నం చేస్తున్నది. దేశ సంపదను అదానీ, అంబానీ లాంటి వారికి దోచి పెడుతున్నారన్న ఆరోపణలపై కేంద్రాన్ని దేశ అత్యున్నత వ్యవస్థలు తప్పు పడుతున్నా.. ప్రభుత్వం మాత్రం దున్నపోతుపై వర్షం పడ్డట్టు వ్యవహరిస్తున్నది. వాస్తవ పరిస్థితులపై తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి వివరించడానికి, ఆయా రంగాల మేధావులతో చర్చించడానికి కేంద్రం ముందుకు రావడం లేదు. ఎనిమిదేండ్ల పదవీ కాలంలో ప్రధాని మోదీ ఒక్క సారి కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయలేదు. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పిందీ లేదు. మన్ కీ బాత్ అంటూ.. తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతున్నారు.
తిరిగి రైతుల హామీ విషయానికి వద్దాం. మోదీ చెప్పినట్టు రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. పైగా వారికి వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలను తేవాలని ప్రయత్నించారు. దీంతో రైతులు పిడికిలి బిగించి, ప్రాణాలను పణంగా పెట్టి ఏడాదికి పైగా పోరాటం సాగించారు. దాంతో కేంద్రం తలొగ్గక తప్పలేదు. ప్రధాని స్వయంగా ఆ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు వస్తున్నాయని భయపడ్డారేమో? అంతలోనే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. రైతుల ఆదాయం ఎన్నో రెట్లు పెరిగిందని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రచారంలో ప్రకటించారు.
కానీ 2015-16 లెక్కలను 2021 లెక్కలతో పోల్చి చూస్తే రైతుల ఆదాయం కేంద్రం చెప్పినట్టు రెట్టింపు కాలేదు. 2015-16 అంచనాల ప్రకారం దేశంలో రైతుల వార్షిక ఆదాయం రూ.96,703. అంటే నెలకు రూ.8058. 2021లో అధికారిక సిట్యుయేషన్ అసెస్మెంట్ సర్వే ప్రకారం రైతుల నెల ఆదాయం రూ.10,218. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హామీ మేరకు 2022లో రైతుల సగటు ఆదాయం రెండింతలు కావాలి. కానీ రైతుల ఆదాయం నెలకు రూ.8058 నుంచి రూ.10,218కు పెరిగింది. అంటే కేవలం 26 శాతం మాత్రమే రైతుల ఆదాయం పెరిగింది. దీన్ని బట్టి కేంద్రంలోని బీజేపీ సర్కారు తన హామీని నిలుపు కోలేకపోయిందని స్పష్టమైంది. దాని ప్రచారమంతా హంబక్కే అని మరోసారి రుజువైంది. అంతిమంగా చెప్పేది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మార్చటంలో పూర్తిగా విఫలమైంది. వ్యవసాయ రంగమనే కాదు మిగతా రంగాల్లోనూ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది.
ఈ తరుణంలో ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో చర్చకు తెర లేపారు. తెలంగాణ మాడల్ అభివృద్ధిని దేశానికి అందిస్తామని ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో వెల్లడించి జాతీయ రాజకీయాలకు శంఖారావం పూరించారు.
రాష్ట్రం ఏర్పడ్డ 8 ఏండ్లలో వివిధ రంగాలలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్ది తాను మాటల మనిషిని కాదు.. చేతల మనిషినని నిరూపించుకున్నారు. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలతో కీలక రంగాల్లో ఆదర్శవంతమైన అభివృద్ధిని సాధించారు.
తెలంగాణ నమూనా స్ఫూర్తిగా దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు ఇవ్వడం అసాధ్యమేమీ కాదని, కేవలం లక్షా 45 వేల కోట్ల రూపాయలతో అది సాధ్యమని ఆయన లెక్కలేసీ మరీ చెబుతుంటే విద్యుత్తు రంగ నిపుణులు కూడా శ్రద్ధగా ఆలకించారు. అంటే తన లక్ష్య సాధనలో కేసీఆర్ సగం విజయం సాధించినట్టే! తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే వేరే పేర్లతో దేశ వ్యాప్త అమలుకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం, దేశాభివృద్ధి కోసం కేసీఆర్ చేస్తున్న సూచనలను ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ దేశ వ్యాప్తంగా మొదలైంది.
అంతర్ రాష్ట్ర వివాదాలు, జల వివాదాలను కేంద్రం పరిష్కరించకుండా దాట వేయడాన్ని కేసీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. రైతే రాజు కావాలని, పంటలకు మద్దతు ప్రకటించాలని సూచిస్తున్నారు. ప్రజలకు ఉచితాలు వద్దంటున్న మోదీ, కార్పొరేట్లు తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలను ఎందుకు మాఫీ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకుంటూ, వివిధ రాష్ర్టాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడానికి రాజకీయ కుట్రలెందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, ఆ తరువాత గెలుపు ప్రజలది కావాలని, అభివృధ్ధి చుట్టూనే రాజకీయాలు జరగాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ చెప్తున్న ఈ మాటలు మేధావులను, సామాన్యులను ఆలోచింపచేస్తున్నవి.
90 శాతం సామాన్యులకు చెందాల్సిన జాతి సంపద 4 శాతమున్న బడా కార్పొరేట్ల జేబుల్లోకి వెళ్లడాన్ని దేశ ప్రజలు నిరసించాలి. బంగారు గుడ్లు పెట్టే ఎల్ఐసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రైవేటీకరించడంపై దేశ వ్యాప్త చర్చ జరగాలి. ఇందు కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రతిపక్షాలూ ఏకమై, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు నడుం కట్టిన కేసీఆర్ను బలపర్చాలి. ప్రతి భారతీయుడు తన వంతు కర్తవ్యంగా ఓటుతో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వారికి బుద్ధి చెప్పాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
-ఎం.నాగశేష కుమార్
98494 86750