‘పరాయి పాలనలో ఆచరణకు నోచుకోని ఎన్నో అద్భుతాలను కేవలం తొమ్మిదేండ్లలో చేసి చూపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తొలిరోజు నుంచే సమ్మిళిత ప్రగతిబాటలో యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమూలమైన మార్పునకు శ్రీకారం చుట్టారు. స్పష్టమైన లక్ష్యం, విస్పష్టమైన వ్యూహం, సాహసోపేతమైన నిర్ణయాలు, విధానాలకు అనుగుణంగా మెరుపు వేగంతో, ఆచరణలో ప్రగతి రథచక్రాలకు పరుగులు పెట్టించారు’ అంటూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ రాసిన ప్రత్యేక వ్యాసం.
పరాయి పాలనలో రైతులు నష్టపోవడానికి ప్రధాన కారణం కల్తీ. గతంలో విత్తనాలు, ఎరువులు నకిలీవి సరఫరా చేసి వ్యాపారులు లబ్ధి పొందేవారు. ఆరుగాలం కష్టపడ్డ రైతు మాత్రం మోసపోయి తనువు చాలించాడు. కానీ ఇవాళ తెలంగాణలో నకిలీ వ్యాపారమే లేకుండా చేయగలిగారు కేసీఆర్. ఎరువులు, విత్తనాలను సబ్సిడీపై ప్రభుత్వమే సరఫరా చేస్తున్నది. దీంతో వ్యవసాయం లాభసాటిగా మారింది.
‘ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం’ఎక్కు వ కాలం నిలబడవు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం ఈ ప్రాంత పరిస్థితి ఇలాగే ఉండేది. సరైన మౌలిక సదుపాయాల్లేక, వనరులున్నా సరైన నిర్వహణ లేక గోసరిల్లిన తెలంగాణ రైతాంగానికి భరోసానిచ్చారు సీఎం కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో ఓ పక్క ఆంధ్ర ప్రాంతం దక్షిణ భారత ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందితే జీవనదులు ప్రవహించిన తెలంగాణలో మాత్రం నీళ్లు లేక భూములు బీళ్లు వారేవి. ఈ గోస నుంచే ‘నీళ్ళు-నిధులు-నియామకాల’ నినాదంతో తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం మొదలైంది. నిజానికి తెలంగాణ వెనుకబడిన ప్రాం తం కాదు, వెనుక పడేయబడిన ప్రాంతం. అద్భుత వనరులున్న తెలంగాణలో కొంత చేయూతనిస్తే రైతాంగం అద్భుతాలు సృష్టించగలుగుతుందని కేసీఆర్ పదే పదే అనేవారు. దాన్ని నిరూపిస్తూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో తనదైన నాయకత్వం, దూరదృష్టితో దశాబ్దంలోనే ప్రతి రైతు సగర్వంగా తలెత్తుకునేలా చేయగలిగారు. రైతాంగ సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి వ్యవసా య రంగంలో తెస్తున్న మార్పులు, మౌలిక సదుపాయాల కల్పనలో కేసీఆర్ నూతన వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు. ఒకప్పుడు నామమాత్రపు కేటాయింపులతో నిర్లక్ష్యం చేయబడిన వ్యవసాయ రంగానికి గత పదేండ్లలో ఏకంగా రూ.1,92,000 కోట్లు కేటాయించారు. తద్వారా సుప్తచేతనావస్థలో ఉన్న తెలంగాణ వ్యవసాయరంగానికి జీవం పోసి రైతు జీవితాల్లో వెలుగును నింపారు.
నేడు ప్రపంచమంతా ఆర్థికశక్తి బలోపేతం కోసం పారిశ్రామికీకరణ పేరుతో ప్రాథమిక రంగమైన వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం గమనిస్తూనే ఉన్నాం. కానీ మన రాష్ట్రంలో ఒకవైపు పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంటే, అంతకు రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయరంగం పురోగమిస్తున్నది. ధార్మిక చింతనతో ప్రజలను మభ్యపెట్టకుండా, తాత్విక పునాదుల మీద తెలంగాణ భవిష్యత్ను ప్రణాళికా బద్ధంగా నిర్మిస్తూ, భావితరాలకు ఆహార కొరత లేకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. వ్యవసాయ రంగానికి ఏనాడో దూరమైన ప్రజలు ముఖ్యంగా యువత ఇవాళ మళ్లీ వ్యవసాయం వైపు చూస్తున్నదంటే అందు కు కారణం కేసీఆర్. ప్రభు త్వం అమలుచేస్తు న్న నీటి పారుదల, విద్యుత్, రైతు బంధు, రైతుబీమా, కొనుగోలు కేంద్రాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, వ్యవసాయరంగంలో శాస్త్రీయ విధానాలు, చివరికి గోనె సంచుల దాకా కూడా క్షేత్ర స్థాయిలో తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ఆచరణ వల్లే తెలంగాణ ఏర్పడే నాటికి 62.48 లక్షల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం ప్రస్తుతం రికార్డు స్థాయిలో 1.35 కోట్ల ఎకరాలకు పెరిగింది. 2014-15లో 68.17 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న ధాన్యం ఉత్పత్తి ప్రస్తుతం 2.6 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. దశాబ్దకాలం కిందట వరి ఉత్పత్తిలో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు ఏకంగా 2వ స్థానానికి చేరి దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా మారిం ది. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో వ్యవసాయరంగం వాటా 18.2 శాతానికి వృద్ధి చెందింది. ఇది పదేండ్ల తెలంగా ణ ప్రస్థానంలో వ్యవసాయరంగం సాధించిన ప్రగతి.
ఉమ్మడి పాలనలో తెలంగాణలో సాగునీటి పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నేటికీ కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యా యం జరుగుతున్నది. అయినా సవాళ్లను ఎదుర్కోవడం, సమస్యలను తనదైన శైలిలో పరిష్కరించడం కేసీఆర్కు అలవాటే. అందుకే ఎవరెన్ని సవాళ్లు సృష్టించినా ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి’ అంటూ నిర్దేశించిన లక్ష్యాన్ని ఒక్క దశాబ్దంలోనే ఆచరణాత్మకంగా చేసి చూపించారు. అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంతో నిర్మితమైన కాకతీయ నీటి నిర్వహణా విధానం మన సొంతం. దాన్ని కొనసాగిస్తూ మిషన్ కాకతీయ ద్వారా గ్రామీణ నీటి వనరులను పునరుద్ధరించారు. ఎవ్వరి సహకారం లేకపోయినా ప్రపంచమే అబ్బురపడే రీతిలో ఎగువ ప్రాంతాలకు నీటిని ఎత్తిపోసేలా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ను నిర్మించారు. అదిప్పుడు తెలంగాణకు ఐకాన్గా మారింది. భక్త రామదాసు, డిండి వంటి ప్రాజెక్టులు పూర్తిచేశారు. నీళ్ళు లేక నెర్రలు బారిన తెలంగాణలో నేడు బంగారు సిరులు పండుతున్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం 30 లక్షల బోరు బావులు వినియోగంలో ఉన్నాయి. వీటికి విద్యుత్ తప్పని సరి. విద్యుత్ ఉత్పాదనకు అవసరమైన బొగ్గు నిక్షేపాలు తెలంగాణ సిగలోనే ఉన్నా, నాటి పాలకులు ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు.
ఫలితంగా సరిపడా కరెంట్ లేక పొట్టబోసుకున్న పంట పొలాలు ఎండిపోయేవి. ఈ సమస్యకు కేవలం దశాబ్ది కాలంలోనే శాశ్వత పరిష్కారం చూపగలిగారు కేసీఆర్. 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ను తెలంగాణ రైతాంగానికి అందిస్తున్నారు. ఇది దేశంలో మరెక్కడా లేదు.
పంటలు పండితే తమ జీవితాలు బాగుపడుతాయనే ఆశతో పెట్టుబడి కోసం వ్యాపారుల దగ్గర అధి క వడ్డీలకు అప్పులు చేయడం, పంటలు పండక, ఆ అప్పులు తీర్చలేక తనువు చాలించడం తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం సర్వసాధారణం. కానీ నేడు తెలంగాణలో పెట్టుబడి కష్టాల్లేకుండా ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు రైతుబంధును ఇస్తూ, రైతు బాంధవుడిగా మారారు కేసీఆర్. ఇప్పటికే పది విడత ల్లో 70 లక్షల మంది రైతులకు దాదాపు రూ.66 వేల కోట్లు రైతుబంధు ద్వారా అందించి చరిత్ర సృష్టించా రు. దీంతో రైతులకు అప్పుల తిప్పలు తప్పాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనతి కాలంలోనే లక్ష వరకు రుణమాఫీ పూర్తిచేసింది ప్రభుత్వం.
తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతుల కోసం తెచ్చిన మరో పథకం రైతుబీమా. పారిశ్రామికరంగంలో కార్మికులకు ఉండే ఇన్స్యూరెన్స్ దేశంలోని ఏ రాష్ట్రంలో లేదు. ఇవాళ కేసీఆర్ తెచ్చిన ఈ రైతు బీమా దేశంలోనే ఒక వినూత్న పథకంగా నిలిచిపోయింది. రైతు మరణిస్తే రైతును నమ్ముకున్న కుటుంబాలను ఆదుకునేలా ఐదు లక్షలు బీమా వర్తిస్తుంది తెలంగాణలో రైతును రాజుగా చేసిన ఘనత కచ్చితంగా కేసీఆర్కే దక్కుతుంది. రైతు బాంధవుడు కేసీఆర్కు దేశవ్యాప్తంగా రైతులు రెడ్కార్పెట్ పరుస్తున్నారు. ఈ పరంపర ఇలాగే కొనసాగితే రైతు సంక్షేమ సారథి కేసీఆర్ నాయకత్వంలో దేశ ప్రజల సంపూర్ణ మద్దతుతో, రైతుల అండదండలతో దేశం లో వ్యవసాయరంగం ఒక విప్లవాత్మకమైన పరివర్తనకు దారి చూపనున్నది.
(వ్యాసకర్త: వైస్ ఛాన్స్లర్, కాకతీయ యూనివర్సిటీ)
-ప్రొఫెసర్ తాటికొండ రమేష్
97016 82924