ముందే చెప్పాలి కదా’ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా పాపులరైన డైలాగ్ ఇది. సినీ నటి సమంత ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివీ. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అచ్చం ఇదే డైలాగే చెప్తున్నారట.
‘ముందే చెప్పాలి కదా’ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా పాపులరైన డైలాగ్ ఇది. సినీ నటి సమంత ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివీ. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అచ్చం ఇదే డైలాగే చెప్తున్నారట. ‘మోత్కుపల్లి నరసింహులును మేము ఇక్కడ పార్టీలో చేర్చుకోకపోతే మీ వద్దకు వచ్చి కండువా కప్పుకున్నారు. ఇప్పుడేమో ఆయన ఇక్కడ మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంటూ పెంట.. పెంట చేస్తున్నారు’ అని రాష్ట్ర నాయకుడు ఒకరు శివకుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ‘మోత్కుపల్లి అలాంటివాడని నాకు ముందే చెప్పాలి కదా’ అని డీకే ప్రశ్నించారట!
మీ టికెట్ మీ ఇష్టం
‘ఊరంతా ఒక మాట… ఉలిపి కట్టెది ఒక మాట’ అన్నట్టుగా ఉన్నది ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతల వ్యవహారం. ఎంపీ ఎన్నికలు ముగిసేవరకు మంత్రులు తమకు అప్పగించిన జిల్లాలోనే ఉండాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. కానీ, తన భార్యకు టికెట్ రాలేదని భట్టి విక్రమార్క ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పుకోగా, తన కుమారుడికి టికెట్ రాలేదని తుమ్మల నాగేశ్వరరావు మల్కాజిగిరి ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక మిగిలిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే ఖమ్మం జిల్లాకు పరిమితమయ్యారు. ‘మా కుటుంబసభ్యులకు టికెట్ రానప్పుడు మాకెందుకు ఆ శ్రమ, మీ కుటుంబసభ్యులకు టికెట్ ఖాయమైంది కాబట్టి ఆ పాట్లేవో మీరే (పొంగులేటి) పడండి’ అని భట్టి, తుమ్మల ఏ టెన్షన్ లేకుండా తిరుగుతున్నారట.
సరిపోయారిద్దరు..!
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీ నాయకులకు పట్టపగ్గాలు లేకుండాపోయాయని విమర్శలు వస్తున్నాయి. అక్కడ వారి చర్యలు, మాటలు సోషల్ మీడియాలో నిత్యం సీరియల్గా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సొంతపార్టీ కార్యకర్తపై దాడిచేసిన ఘటన వైరలైంది. ఇది పార్టీ పెద్దల దృష్టికి కూడా వెళ్లింది. అలా చేయడం తప్పని చెప్పకుండా ఎన్నికలు అయ్యేదాకా సంయమనం పాటించాలని పార్టీ పెద్దలు సూచించినట్టు సమాచారం. సరిపోయారిద్దరు..!
గెలిపిస్తే మంత్రి గ్యారెంటీ..!
నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి లోలోన మదనపడుతున్నారట. సీఎం రేవంత్రెడ్డి తన శిష్యుడు చామల కిరణ్ కుమార్రెడ్డికి టికెట్ ఇచ్చి, గెలుపించుకొచ్చే బాధ్యత ఆయనకు అప్పగించారు. అట్లయితేనే మంత్రి పదవికి సీఎం గ్యారెంటీ ఇచ్చారట. రాష్ట్ర ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలకే దిక్కులేదంటే.. ఈ ఏడో గ్యారెంటీ ఎప్పటికి అమల య్యేనో అని గాంధీ భవన్లో కొందరు కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారట!