గవర్నర్ కోటా అంటేనే అధికార పార్టీ నేతలు హడలిపోతున్నారు. ‘తమకు గవర్నర్ కోటాలో వద్దు బాబోయ్. పార్టీ కోటాలో ఇవ్వండి’ అని వేడుకునే పరిస్థితి ఏర్పడింది.
గవర్నర్ కోటా అంటేనే అధికార పార్టీ నేతలు హడలిపోతున్నారు. ‘తమకు గవర్నర్ కోటాలో వద్దు బాబోయ్. పార్టీ కోటాలో ఇవ్వండి’ అని వేడుకునే పరిస్థితి ఏర్పడింది. గవర్నర్ కోటాలో ఇస్తామని ఎవరికైనా హామీ ఇచ్చారంటే, అది అయ్యే పనికాదనే భావిస్తున్నారు. గవర్నర్ కోటా అంటే ఆశావహులు భయపడటానికి కారణం లేకపోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డిని ప్రతిపాదించగా గవర్నర్ తిరస్కరించారు. ఆ తర్వాత అదే కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ప్రతిపాదించగా దాన్ని కూడా తిరస్కరించారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్తో పాటు మైనారిటీ వర్గానికి చెందిన ఒకర్ని ప్రతిపాదించాలని భావించింది. ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాకముందే తన కోటాలో ఎవర్నీ సిఫారసు చేయవద్దని గవర్నర్ హుకూం జారీ చేసింది. దీంతో గవర్నర్ కోటా అంటే ఆశావహుల పాలిట అందని ద్రాక్షగా మారింది.
పురుషులను గౌరవిద్దాం
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రకటించాక, పురుష ప్రయాణికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. టికెట్ కొనుక్కొని ప్రయాణించే తామేమో నిలబడి ప్రయాణిస్తుంటే, ఉచితంగా ప్రయాణించే మహిళలేమో దర్జాగా కూర్చొని ప్రయాణిస్తున్నారు. కనీసం తమకు సగం సీట్లయినా కేటాయించాలని వారి నుంచి డిమాండ్ వచ్చింది. ఇప్పుడేమో సగం సీట్ల సంగతి అటుంచి… కనీసం తమకు బస్సు ఎక్కేందుకు బ్యాక్ డోర్ అయినా కేటాయించండి మహాప్రభో అని వేడుకుంటున్నారు. ఫ్రంట్, బ్యాక్ డోర్ రెండింటినీ మహిళలే వినియోగిస్తుండటంతో పురుష ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎవరైనా ధైర్యం చేసి బ్యాక్డోర్ నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తే… కావాలనే తాకారంటూ మహిళలంతా ఏకమై దేహశుద్ధి చేస్తున్నా… తమకు నోరు మెదిపే పరిస్థితి లేకుండా పోయిందని కండక్టర్లు వాపోతున్నారు.
నల్లపూసయ్యారు?
గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనరసింహా ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. కొత్త ప్రభుత్వంలో మంత్రులంతా రోజూ ఏదో ఒక సందర్భంగా మీడియాలో కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, దామోదర రాజనరసింహా మాత్రం పూర్తిగా నల్లపూసయ్యారు. శాఖలవారీ సమీక్షా సమావేశాల్లో కానీ, ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజలకు వివరించడానికి ఇతర మంత్రులతో కలిసి వేదిక పంచుకోవడానికి ఆయన రావడం లేదు. చివరికి సీఎం జరిపే సమీక్షా సమావేశాల్లోనూ ఆయన కనిపించడం లేదు. ఇదే విషయాన్ని ఆయన వద్ద సన్నిహితులు ప్రస్తావిస్తే.. గతంలోనే డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్నది. వీళ్లలో ఎవరు కూడా తన మాదిరిగా సీడబ్ల్యూసీ మెంబర్స్ కాదు. వాళ్లలా హడావుడి చేయాల్సిన అవసరం తనకు లేదని నిర్మొహమాటంగా చెప్తూ లైట్ తీసుకుంటున్నారట.
అప్పనం కోటా !
రాజకీయాల్లో కష్టపడ్డవారికే కాదు, కొందరికి అప్పనంగా పదవులు వరిస్తుంటాయి. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిలమ్మ పార్టీలో పనిచేసిన తెలంగాణ నాయకులకు నామినేటెడ్ పదవులు రానున్నాయంట. అలాగే తెలంగాణ జన సమితి నాయకులను కూడా నామినేటెడ్ పదవులు వరించనున్నాయట. అలాగే సీపీఐతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ పార్టీ నేతలకు కూడా భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయట. దశాబ్దకాలంగా అధికారంలో లేకపోయినా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్న తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయో లేదో తెలియదు కానీ, వారికి మాత్రం అప్పనంగా పోస్టులు దక్కుతాయట అని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు.