లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం... ఎవరితోనూ పొత్తులు ఉండవని రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. వచ్చే ఏడాది మే నెలలో జరగాల్సిన ఎన్నికల్లో పొత్తులపై ఇంత త్వరగా ప్రకటన చేయడంలో మతలబు ఏమై ఉంటుంది?.
లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం… ఎవరితోనూ పొత్తులు ఉండవని రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. వచ్చే ఏడాది మే నెలలో జరగాల్సిన ఎన్నికల్లో పొత్తులపై ఇంత త్వరగా ప్రకటన చేయడంలో మతలబు ఏమై ఉంటుంది?. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోనవసరం లేనన్ని ఓట్లేమీ పడలేదు. అలాంటప్పుడు ఎవరితోనూ పొత్తులుండవని ఎందుకు ప్రకటించినట్టు? అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల కోసం బీజేపీయే ప్రయత్నించింది. తెలంగాణలో ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో పక్క రాష్ట్ర పార్టీ జనసేనతోనూ పొత్తుతో సరిపెట్టుకుంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఎవరితో పొత్తులుండవని ఎందుకు ప్రకటించినట్టు?. అసలు విషయం ఏమంటే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే 119 నియోజకవర్గాలకు అభ్యర్థులు అవసరం. అంతమంది అభ్యర్థులు ఆ పార్టీలో లేకపోవడంతో కొన్ని సీట్లు జనసేనకు అంటగట్టక తప్పలేదు. అదే లోక్సభ ఎన్నికలకు అయితే 17 మంది అభ్యర్థులు చాలు, అభ్యర్థుల కోసం వెతుక్కోనవసరం లేదు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ముగ్గురు ఎంపీలతో పాటు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎలాగూ ఉన్నారు. ఈ నలుగురు ఇన్స్టంట్ అభ్యర్థులు పోగా ఇంకా కావాల్సింది 13 మందీ అభ్యర్థులే. ఈ ధీమాతోనే ఎవరితోనూ పొత్తులు ఉండవని ప్రకటించి ఉంటారు కాబోలు.
ఆ గాలే లేకపోతే ఏమయ్యేదో?
ఎన్నికల ముందు పార్టీ మారితే ఎన్ని కష్టాలుంటాయో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అసెంబ్లీ లాబీల్లో చెప్పుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే తనతో రాలేక కాంగ్రెస్ కార్యకర్తలంతా బీఆర్ఎస్లో చేరారు. ఈ సారి సరిగ్గా ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్లోకి వెళ్లినవారేమో తిరిగిరాలేదు. బీజేపీ కార్యకర్తలేమో అక్కడే ఉండిపోయారు. దాదాపు ఒంటరి పోరాటమే చేయాల్సి వచ్చింది. ఏదో కాంగ్రెస్ గాలి ఉండబట్టి దేవుడి దయతో బయటపడ్డా. నేను ఉహించిన దానికంటే ఎక్కువగా 40 వేల మెజారిటీతో గెలవడం చిన్న విషయం కాదు. నా పరిస్థితి తలచుకుంటేనే ఒక దశలో భయమేసిందని వాపోయారు.
నాకు తెలియాలి!
సినిమాటోగ్రఫీ మంత్రి అయితే సినిమావాళ్లంతా పొలోమంటూ పరిగెత్తుకొస్తారని అనుకున్నారు. కానీ, దిల్ రాజు తప్ప నాకు ఎవరు కూడా ఫోన్ చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వాపోయారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆయన ‘అసలు అక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి.. నివేదిక ఇవ్వండి’ అని అధికారులను ఆదేశించారు. శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్లు రాకపోతే అధికారులు మాత్రం ఏం చేస్తారు పాపం… ఎందుకు రాలేదో వాళ్లు మాత్రం ఏమని నివేదిక ఇస్తారు. సినిమా వాళ్లు ఎలాంటివారో బహుశా తెలిసే, సీఎం రోశయ్య తన హయాంలో వాళ్లకు తన క్యాంప్ ఆఫీస్లో నో ఏంట్రీ అని మొహమాటం లేకుండా ప్రకటించిన విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది.
బర్రెలక్కతో పోలికా?
ఎన్నికలు ముగిశాక కూడా నాయకులు, ప్రజలు బర్రెలక్కను మాత్రం మరిచిపోవడం లేదు. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి జనసేనను ఉద్దేశించి పవన్కల్యాణ్ పార్టీకి తెలంగాణలో బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. అలాగే పాలేరులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వయంగా పోటీ చేసినా ఆయనకు కూడా బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు రాలేదని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికల్లో తక్కువ ఓట్లు పడితే ఇంతవరకు నోటా ఓట్లు ఒక కొలమానంగా ఉంటే ప్రస్తుతం బర్రెలక్క ఓట్లు కొలమానంగా మారాయి.