‘మూర్ఖత్వం మానవుడితో ముష్టి యుద్ధం చేస్తున్న వేళ… మతం పిచ్చెక్కిన మత్త గజంలా, మనుషుల్ని నలగదొక్కుతున్న వేళ… దౌర్జన్యం గర్జన చేసే జగతిలో సౌజన్య పర్జన్యం పలికిస్తాం మనం’ అంటూ ధీమాగా తన తెలంగాణ తత్తాన్ని, కర్తవ్యాన్ని చాటాడు మహాకవి దాశరథి. సరిగ్గా అదే ఒరవడిలో కోట్లాది తెలంగాణ బిడ్డల ఔన్నత్యానికి ప్రతీకగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు బుధవర్గం సమక్షంలో హస్తిన వేదికగా పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. దక్షిణాదికి ఈవల ఉన్న ఒక మహానాయకుడు హస్తిన వేదికగా రాజకీయ కార్యాచరణకు శ్రీకారం చుట్టిన ఈ అద్భుత ఘట్టం దేశ చరిత్రను మలుపు తిప్పబోతున్నది, నవశకానికి నాంది పలుకబోతున్నది. స్వాతంత్య్రోద్యమ కాలంలో ‘నేడు బెంగాలీలు ఏది ఆలోచిస్తే, రేపు భారతదేశం అదే చేస్తుంది’ అని అనేవారు. కానీ ఇప్పుడు ‘నేడు తెలంగాణ ఏది చేస్తే, రేపు భారత్ అదే అనుసరిస్తుంది’ అని చెప్పుకోవలసిన కాలం వచ్చింది.
కేసీఆర్ పార్టీ స్థాపన ఒక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలపై ఆధిపత్యం చేయడానికి కాదు. రాజకీయాధికారం కోసం పెనుగులాడే సగటు నాయకుల సంకుల సమరం కాదది. స్వాతంత్య్ర విలువలు లుప్తమై, రాజకీయ రంగమంతా పతనమైన వేళ, దేశానికి కొత్త దిశానిర్దేశం చేయడం తన బాధ్యతగా ఈ బృహత్కార్యాన్ని తలపెట్టారాయన. కేసీఆర్ ప్రబోధించిన ‘పంచశీల’ దేశానికే కాదు, ప్రపంచానికే మార్గదర్శకం. ఆర్థిక రంగం, పర్యావరణం, నీరు, విద్యుత్తు, మహిళా సాధికారత అనే ప్రాధాన్యాంశాలను ఆయన ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అని నినదించిన కేసీఆర్.. పార్టీ తొలి అనుబంధ సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితి (బీఆర్కేఎస్)ని ఏర్పాటు చేశారు. పశ్చిమాన పంజాబ్, రాజస్థాన్ మొదలుకొని ఈశాన్యం వరకు వివిధ రాష్ర్టాల రైతు నాయకులు తరలిరావడం బీఆర్ఎస్ నేత కేసీఆర్పై వారికున్న విశ్వసనీయతను తెలుపుతున్నది.
కొందరు దక్షిణాది వారికి హిందీ రాదు. పలువురు ఉత్తరాది వారికి హిందీ తప్ప మరో భాష తెలువదు. కానీ తెలంగాణ వారు ఉత్తర, దక్షిణ తేడా లేకుండా అందరితోనూ కలిసిపోతారనే అభిప్రాయం ఉన్నది. తెలంగాణ సమాజంలో పెరిగే వారికి చిన్ననాటి నుంచి భిన్నత్వాన్ని ఆదరించడం అలవాటయి ఉంటుంది. అందుకే అమెరికా అయినా, ఆఫ్రికా ఖండమైనా- ఎక్కడైనా తెలంగాణ వారిలో కలుపుగోలుతనం తొణికిసలాడుతుంది. బీఆర్ఎస్ పట్ల భిన్న రాష్ర్టాలలోని రాజకీయ శక్తులు, మేధావులు, ఉద్యమకారుల నుంచి సౌహార్దత వ్యక్తం కావడానికి కారణం భిన్నత్వాన్ని ఆదరించే కేసీఆర్ ఉన్నత వ్యక్తిత్వమే. దేశ రాజకీయాలను పునర్నిర్వచించి, భిన్నత్వాన్ని ప్రతిబింబించే కొత్త జాతీయ రాజకీయ పక్షం తక్షణావసరం. ‘చీకటులు నింపుకొన్న మృత్స్నాకరండ మీ ఇలా గోళకమ్ము వెల్గింతు నేను’ అన్నట్టు బీఆర్ఎస్ను స్థాపించడం ద్వారా కేసీఆర్ ఆ లోటును భర్తీ చేయడం తెలంగాణ వారందరికీ గర్వకారణం.