తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఎవరికి ప్రయోజనం ఒనగూడింది? పదేండ్ల స్వయం పాలన ఏంసాధించింది?.. ఈ మధ్య కొందరు వ్యక్తులు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే తప్ప పనులు చేసేవి కావు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు మాట్లాడుతుండవచ్చు. మరికొందరు సోషల్ మీడియా మాయాజాలపు ప్రచారానికి గురికావొచ్చు. ఎవ్వరూ తమ డిమాండ్ల కోసం ధర్నాలు, బంద్లు చేయకుండానే పదేండ్ల తెలంగాణ ప్రజాభీష్టానికి పట్టం గట్టింది.
ప్రజల మనోభావాలను గుర్తించి అద్భుత నిర్ణయాలు తీసుకున్నది. దేశ చరిత్రలోనే ఏ ఉద్యమమూ సాధించలేని లక్ష్యాలను కేవలం దశాబ్దకాలంలో చేరుకున్నది. ఇదంతా మన కండ్ల ముందు జరుగుతున్నదే. ఒకటి, రెండు అని కాదు డజన్ల కొద్ది నిర్ణయాలు, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పనులు, విద్య, ఉద్యోగాది విషయాలన్నింటిని ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ పోతున్నది. తద్వారా తమది సకల ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని నిరూపిస్తున్నది.
ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యోగుల పక్షాన ప్రభుత్వం నిలబడుతున్నది. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో వారికి జీతాలను పెంచుతూ గతంలోనే నిర్ణ యం తీసుకున్నది. ఇప్పటివరకు ఉద్యోగులకు రెండు పీఆర్సీలు కలిపి 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. మన దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద ఎత్తున జీతాలు పెంచిన చరిత్ర లేదు. ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ కూడా ఇచ్చింది. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పింఛన్ గ్రాట్యుటీని ఇచ్చింది. ప్రమోషన్ల వయస్సును ఐదేండ్ల నుంచి మూడేండ్లకు తగ్గించింది. అంతేకాదు పింఛనర్ల వయస్సు పెరిగేకొద్దీ వారికి వచ్చే పింఛన్ కూడా పెరిగేలా చర్యలు తీసుకున్నది.
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మరో డిమాండ్ను బీఆర్ఎస్ ప్రభుత్వం సునాయాసంగా పరిష్కరించింది. ఉద్యోగుల ఆకాంక్షలకనుగుణంగా జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేసింది. స్థానికులు స్థానికంగానే ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. తమ ప్రాంతం వారికే కనీసం డబ్బు శాతం ఉద్యోగావకాశాలివ్వాలని ఎన్నో ఏండ్లుగా డిమాండ్ ఉన్నది. కానీ, తెలంగాణ ప్రభుత్వం స్థానికులకు ఉద్యోగావకాశాల్లో 95 శాతం ఉండేలా రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించి తెలంగాణ ప్రజల అనుభవంలోకి తీసుకువచ్చింది. ఆర్టీసీ ఏండ్లుగా నష్టాల్లోనే ఉంటున్నది. దానిగురించి పట్టించుకున్న ప్రభుత్వాల్లేవు. ఏదైనా చేయాలంటే ప్రయాణికులపై ఛార్జీలు పెంచాలి. ఆర్టీసీ కార్మికుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ప్రభుత్వం చూపించింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇవన్నీ ఉద్యోగసంఘాలు రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేయడం వల్ల సాధ్యం కాలేదు. ఉద్యమ నాయకత్వ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, వారి బాధలు తెలుసు కాబట్టి, వారు అడగకుండానే ప్రభుత్వం చకచకా వారి అవసరాలు తీర్చుకుంటూ పోతున్నది. ధర్నా చౌక్ వద్ద రాజకీయ శిబిరాలు తప్ప గతంలో మాదిరిగా తమకు జీతాలు పెంచాలని, ఎరియర్స్ వెంటనే ఇవ్వాలని, తమకు తాగునీళ్లు ఇవ్వాలని ఎవ్వరూ ఆందోళనలు చేయడం లేదు. ఇవన్నీ వాస్తవాలు. ప్రజా క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు, వారికి మరింత మంచి భవిష్యత్తును ఇచ్చేందుకు మంచి నాయకత్వం చేస్తున్న అత్యంత అద్భుతమైన ఆచరాణత్మక నిర్ణయాలివి.
ప్రతి మూడు నెలలకో సారి ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తూనే ఉన్నది. ప్రతీ సందర్భంలో సమాజంలోని అత్యంత నిరాదరణకు గురైనవారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు వారు ప్రకటిస్తున్న పథకాల ద్వారానే అర్థమవుతున్నది. ఈ ప్రభుత్వం సంపదను సృష్టిస్తున్నది. తన ప్రజలకు పంపిణీ చేస్తున్నది. ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఇంతస్థాయిలో ప్రజాదృష్టితో పనిచేయలేదు. అలాంటి ఆలోచన కూడా వారికి లేదు. ప్రతి తెలంగాణ పౌరుడు, ఉద్యోగి ఈరోజు సగర్వంగా యావత్ దేశం ముందు తలెత్తుకొని అభివృద్ధి అంటే తమదీ అని చెప్పుకోగల స్థాయికి తెలంగాణ ఎదిగింది.
ఉద్యోగ రంగమే కాదు, వ్యవసాయరంగంలోనూ తెలంగాణ అభివృద్ధి చెందింది. ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లనందిస్తూ, తద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. 1996-2000 ఏండ్ల మధ్య ఉన్న వృద్ధికి 2014-2023 మధ్య ఉన్న వృద్ధితో హైదరాబాద్ స్వరూపమే మారిపోయింది. నిర్మాణాలకు, రహదారుల హంగులకు, సరికొత్త ఉపాధి కేంద్రాలకు, అంతర్జాతీయ ఆఫీసులకు హైదరాబాద్ ఎట్లా నెలవైందో మాటలతో చెప్పడం కాదు, అనుమానాలున్న వారు గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు కూడా. అకుంఠిత దీక్ష, అనన్య సామాన్యమైన పట్టుదల ఉంటే తప్ప ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ, కూలీ కార్మికుల జీవితాల్లో సమాంతర అభివృద్ధి సాధ్యం కాదు. ప్రజలు డిమాండ్ చేసి సాధించుకోవడం కాదు, వారికేం కావాలో తెలుసుకొని వారి కష్టాలు తీర్చేవారే అసలైన నాయకులు. వారే జనహృదయ నేతలు. ఇవన్నీ నూటికి నూరు పాళ్లు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది. అందుకే కేసీఆర్ పాలన ప్రజా ఆకాంక్షలకు అద్దం పడుతున్నది. ఇంతమంది హృదయాలను గెలుస్తు న్న ఈ ప్రభుత్వం ముమ్మాటికీ ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమే అనడంలో ఏ సందేహం లేదు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
-అస్కాని మారుతీసాగర్
90107 56666