కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) బిల్లులోని పలు నిబంధనలు మీడియా స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ఆందోళన వ్యక్తం చేసింది. అవి ప త్రికా స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నది. ముఖ్యంగా ఈ దిగువ తెలిపిన కొన్ని అంశాలపై గిల్డ్ అందోళన వ్యక్తంచేసింది.
ప్రజాస్వామ్య ప్రక్రియ
బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిన విధానంలోనే పలు అవకతవకలున్నాయి. ప్రజా సంప్రదింపుల ప్రక్రియలో పారదర్శకత, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు బిల్లును ప్రవేశపెట్టే క్రమంలో ఇవి జరిగాయి. పార్లమెంటరీ, ప్రజాస్వామ్య ప్రక్రియలను దాటవేసే ధోరణిని అవలంబించినట్టు స్పష్టమవుతున్నది. బిల్లును రూపొందించే సమయంలోనే జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ సారథ్యంలోని నిపుణుల కమిటీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేఎస్ పుట్టస్వామి గోప్యత కేసులో ఇచ్చిన తీర్పులో వెల్లడించిన రక్షణలను ప్రస్తుత బిల్లులో నీరుగార్చారు.
సెన్సార్షిప్పై నిఘా లేకపోవడం
డాటా రక్షణను ప్రోత్సహించే ఉద్దేశంతో బిల్లు తక్షణావసరమైన నిఘా సంస్కరణలను తీసుకురావడంలో విఫలమైంది. ఈ బిల్లులోని నిబంధనల నుంచి ఏదైనా ప్రభుత్వ చర్యను మినహాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడానికి అనుమతించే క్లాజ్ 17(2)(ఏ) కూడా ఆందోళనకరంగా ఉంది. సెక్షన్ 17(4) ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలు వ్యక్తిగత డాటాను అపరిమిత వ్యవధి వరకు ఉంచుకోవడానికి అనుమతి ఇస్తున్నది. అదనంగా, సెక్షన్ 36 ప్రకారం, జర్నలిస్టులు, వారికి సమాచారం అందించే అభిజ్ఞవర్గాల తో సహా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని అందించమని ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ డాటా నిర్వహణా సంస్థ (డాటా ఫిడ్యూషియరీ)ని అడగవచ్చు.
అధికారాల విస్తరణపై ఆందోళనలు
బిల్లు కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న సెన్సార్షిప్ అధికారాలను విస్తృతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. బిల్లులోని క్లాజ్ 37(1)(బీ) కేంద్ర ప్రభుత్వం ‘సాధారణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా’, అస్పష్టమైన లేదా పేర్కొనబడని కారణాలపై కంటెంట్ను సెన్సార్ చేయడాన్ని అనుమతిస్తుంది. ఇది ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69 కింద సూచించిన దానికంటే ఎక్కువగా సెన్సార్షిప్ అధికారాలను పెంచుతుంది. అలాగే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద పేర్కొన్న స్వేచ్ఛా వ్యక్తీకరణపై సహేతుకమైన పరిమితులను దాటి రాజ్యాంగ విరుద్ధం గా వ్యవహరించడానికి కూడా అవకాశం ఉంటుంది.
మినహాయింపులు లేకపోవడం
జర్నలిస్టులకు చట్టంలోని కొన్ని అంశాల నుంచి మినహాయింపులు లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇక్కడ ప్రజా ప్రయోజనాల కోసం నిర్దిష్ట సంస్థలకు నివేదించడం వ్యక్తిగత డాటా రక్షణ హక్కుకు విరుద్ధమవుతుంది. ఇది వ్యక్తిగత డాటా రక్షణ, ప్రజా ప్రయోజనాల మధ్య సమతుల్యత కోసం శ్రీకృష్ణ కమిటీ కొన్ని రక్షణలు సూచించింది. ప్రస్తుత బిల్లులో అవి ఉండాల్సిన స్థాయిలో లేవు. ఇది దేశంలో పాత్రికేయ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
సమాచార హక్కుపై ప్రభావం
కొంతమంది సామాజిక కార్యకర్తలు ఇప్పటికే ఎత్తి చూపినట్టుగా, బిల్లులోని 44(3) వంటి కొన్ని నిబంధనల కింద సమాచార హక్కు దరఖాస్తులను తిరస్కరించే విషయంలో ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లు, ప్రజా సమాచార అధికారుల మినహాయింపుల పరిధిని అసమంజసంగా విస్తరించారు. సెక్షన్ 8(1)(ఐ) సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం కోరిన సమాచారం ‘వ్యక్తిగతమైనది’ అనే ప్రాతిపదికన తిరస్కరించడానికి అవకాశం కల్పిస్తున్నది. ఇది జర్నలిస్టులు కోరుతున్న సమాచారంతో సహా ఏ సమాచారాన్ని కూడా బహిర్గతం చేయకుండా నిలువరిస్తుంది. దీనివల్ల జవాబుదారీతనం తగ్గుతుంది. పనిలో పనిగా ఆర్టీఐ చట్టం బలహీనపడుతుంది.
డాటా బోర్డు కూర్పు, నియామకం
ప్రభుత్వం దాని సంస్థలకు అందించిన మినహాయింపులు దాదా పు తిరుగులేనివిగా ఉన్నాయి. చట్టం కింద ఏర్పాటు చేయవలసిన డాటా రక్షణ బోర్డుకు తగినంత స్వతంత్రత, నియమావళి రూపొందించే అధికారాలు ఇవ్వలేదు. ట్రిబ్యునల్స్ (డాటా ప్రొటెక్షన్ బోర్డ్ వంటివి) తమ ప్రభావాన్ని, విశ్వసనీయతను కాపాడుకోవడానికి ప్రభుత్వ నియంత్రణ నుంచి స్వతంత్రంగా ఉండాలని న్యాయవేత్త లు, రాజ్యాంగ నిపుణులు, సుప్రీంకోర్టు తీర్పులు నొక్కిచెప్పాయి. క్లాజ్ 19(2) కింద డీపీబీపీ సభ్యులందరినీ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి, దాని స్వతంత్రత సందేహాస్పదమే. కనుక బోర్డు స్వేచ్ఛను కాపాడటానికి స్వతంత్రత కల్పించడం తప్పనిసరి.
– ఎడిటోరియల్ డెస్క్