ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఏ సమస్య వచ్చినా, ఏ విమర్శ వచ్చినా దానిని సూటిగా ఎదుర్కోకుండా దేశభక్తి, జాతీయవాదం పేరు చెప్పి తప్పించుకునే బీజేపీకి తగినట్లుగానే, ఆ పార్టీ అనుంగు మిత్రుడు, ప్రధాని మోదీకి అత్యంత ఇష్టుడైన వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కూడా అదే దారిని ఎంచుకున్నారు. అదానీ గ్రూపు సంస్థల్లో తీవ్రమైన ఆర్థిక అక్రమాలు జరిగాయంటూ అమెరికా సంస్థ హిండెన్బర్గ్ నివేదికను ప్రకటిస్తే.. దానిని భారతదేశం మీద జరిగిన దాడిగా అభివర్ణించింది గౌతమ్ అదానీ కంపెనీ. దీనిపై మన దేశానికి చెందిన బిజినెస్ మీడియా అభ్యంతరం వ్యక్తం చేయటం హర్షణీయం. అదానీ కోరుకున్నట్లుగా దీనిని దేశానికి సంబంధించిన వ్యవహారంగా మోదీ సర్కారు చిత్రీకరిస్తే.. ఇన్నేండ్లుగా విశ్వవిపణి వీధుల్లో భారతీయ స్టాక్మార్కెట్లు సాధించుకున్న గౌరవాన్ని తగ్గించుకున్నట్లవుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు అది తీరని హాని చేస్తుందని వాణిజ్య నిపుణులు హితవు పలకటం స్వాగతించాల్సిన పరిణామం.
మన దేశంలో అనేకానేక సమస్యలున్నప్పటికీ.. ప్రపంచంలో భారత్ అంటే గౌరవం ఉండటానికి కొన్ని కారణాలున్నాయి. 75 ఏండ్లుగా కొనసాగుతున్న ప్రజాస్వామ్యం, ఎన్నికల ద్వారా అధికార మార్పిడి, న్యాయవ్యవస్థ, పౌరసమాజం.. వీటితోపాటు మరో ముఖ్యమైన కారణం.. స్టాక్ మార్కెట్లు. అవి పారదర్శకంగా నడిచే తీరు, నిబంధనలకు అనుగుణంగా వాటిని నియంత్రించే ఉన్నతస్థాయి సంస్థలు, చిన్న చిన్న పెట్టుబడిదారులకు కూడా లభించే చట్టపరమైన రక్షణ; వీటివల్ల భారతీయ ఈక్విటీ మార్కెట్లు ప్రపంచస్థాయి నాణ్యత ప్రమాణాలను కలిగి ఉన్నాయి. కాబట్టే ఇటు స్వదేశీ ఇన్వెస్టర్లుగానీ, అటు విదేశీ ఇన్వెస్టర్లుగానీ నమ్మకంగా లావాదేవీలు నిర్వహించగలుగుతున్నారు. అన్ని వ్యవస్థల్లోనూ అప్పుడప్పుడు సమస్యలు తలెత్తినట్లుగానే.. ఈ వ్యవస్థలోనూ సమస్యలు వచ్చినప్పటికీ, వాటిని తట్టుకొని, ఆయా లోపాలను సవరించుకొని, ఆ క్రమంలో మరింత పటిష్ఠమవుతూ వచ్చాయి.
ప్రస్తుతం అదానీ గ్రూపుపై పడిన మచ్చ భారతీయ స్టాక్మార్కెట్ల ప్రతిష్ఠతో కూడా ముడిపడి ఉన్నది. కాబట్టి, కేంద్ర పాలకులు ఈ విషయంలో పక్షపాత ధోరణిని చూపకుండా, దీనిని పూర్తిగా స్వతంత్ర మార్కెట్ నియంత్రణ సంస్థలకు వదిలేయాలి. కానీ, వారి వైఖరి ఇప్పటికే సందేహాలు రేకెత్తించే విధంగా ఉన్నది. హిండెన్బర్గ్ నివేదికతో అదానీ సంస్థలు తీవ్ర సమస్యల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో.. ఆ గ్రూపు సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్లో అబూదబీ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ 40 కోట్ల డాలర్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. మరోవైపు, ఇజ్రాయెల్లో అదానీ గ్రూపు పెట్టుబడులు భారీగా పెరుగనున్నాయని ఆ దేశ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ రెండు దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలోపేతమైనాయి. చిక్కుల్లో ఉన్న మిత్రుడికి సాంత్వన కలిగించటానికి ఢిల్లీ పెద్దలు ఈ విధంగా పావులు కదిపారా అన్నది తెలియదు. ఎవరికీ సాధ్యం కానంత వేగంగా అదానీ ఐశ్వర్యం పెరుగటంపై ఇప్పటికే అనేక విశ్లేషణలున్నాయి. ఆయన మునిగితే దేశ ఆర్థికవ్యవస్థ కూడా కుప్పకూలుతుందన్న ఆందోళనలున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలోనైనా, కేంద్రం తప్పు ఒప్పుకొని దిద్దుబాటు చేపట్టడం అవశ్యం.