కాంగ్రెస్ నాయకత్వం కేవలం అధికారం కోసం మరొకమారు నటనలు చేస్తున్నదా, లేక ఆ పార్టీ విధానాల్లో, వ్యవహారశైలిలో ఏదైనా మార్పు కూడా వస్తున్నదా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోవాలన్నది సరైన ఆలోచనే. కానీ పాత విధానాలు, పద్ధతులు ఏమీ మారని కాంగ్రెస్ ఒకవేళ మళ్లీ అధికారానికి వచ్చినా, వెనుకటి వలెనే తిరిగి విఫలమై, బీజేపీ లేదా మరొకరికి మరొకమారు అవకాశం కల్పించటం మినహా ప్రయోజనమేదైనా ఉంటుందా? 2014, 2019లలో వరుస ఓటముల అనంతరం అయినా కాంగ్రెస్ విధానాలు, వ్యవహారశైలిలో వచ్చిన మార్పులు శూన్యం. ఇక ఇప్పటినుంచి ఎన్నికలలోగా కొత్త జ్ఞానోదయమేదో కలుగవచ్చుననే ఆశలున్నాయా?
బీజేపీకి, కాంగ్రెస్కు మధ్య కొన్ని మౌలికమైన తేడాలున్నాయన్నది నిజం. మొదటినుంచి చూసినట్లయితే ఆర్థిక, సామాజిక విధానాలు రెండింటిలోనూ తేడాలుండేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఇరువురి ఆర్థిక విధానాలు ఒక్కటే అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళ్లకుండా వాటి ఫలితాల గురించి రెండు మాటలు చెప్పాలంటే కాంగ్రెస్, బీజేపీలలో ఎవరు పరిపాలించినా దేశ సహజ వనరులు, మానవ వనరులు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవర్గాలకు మితిమీరిన సంపదలను తెచ్చిపెట్టడం ఎక్కువైంది. ధనిక, పేద, వ్యత్యాసాలు విపరీతంగా పెరుగుతూ దేశంలో ఆర్థిక అస్తవ్యస్తలు విజృంభించసాగాయి. ఆ విధంగా ఇద్దరికీ తేడా లేకుండాపోయింది.
ఇక బీజేపీ కన్న కాంగ్రెస్ సామాజిక విధానాలు, ఉదారత మెరుగైనవని అనుకుంటే, మధ్య తరగతిలోని ఒక వర్గానికి, మేధావి తరగతిలోని ఒక వర్గానికి మినహా, వివిధ జీవిత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తక్కిన వర్గాలకు అవి అర్థం లేనివిగా మారాయి. అందుకే, మొదటినుంచి కాంగ్రెస్కు కట్టుబడి ఉండిన అట్టడుగు సామాజికవర్గాలు మొదట ప్రాంతీయ పార్టీలు, కుల పార్టీలు, ఉద్యమపార్టీల వైపు మళ్లి, తర్వాత దశలో క్రమంగా బీజేపికి అనుకూలమవుతూ వస్తున్నాయి. తిరిగి కాంగ్రెస్ వైపు మాత్రం వెళ్లటం లేదన్నది ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం. అనగా, మొదట ఆర్థిక విధానాల విషయంలో బీజేపీతో తేడా లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత సామాజిక విధానాలు, ఉదారవాదం వంటి విషయాల్లో కొంత తేడా ఉందని అనుకున్నప్పటికీ, వాటి విలువ సమాజంలోని ఒక చిన్న భాగానికి పరిమితమై మిగిలినందున, అందువల్ల పార్టీకి ఒనగూడింది పెద్దగా ఏమీ లేకపోయింది. ఇంకా చెప్పాలంటే, వీటికి విలువనిచ్చే వర్గాలు కూడా వివిధ వైఫల్యాల వల్ల కాంగ్రెస్ పట్ల విశ్వాసాన్ని కోల్పోయి, బీజేపీయేతరమైన ఇతర పార్టీల వైపు మళ్లాయి. ఆ విధంగా కాంగ్రెస్ ప్రతి ఒక్క విధంగానూ బలహీన పడిందే తప్ప, తన సంప్రదాయిక వర్గాలు వేటినీ వెంట నిలుపుకోలేకపోయింది. ఇంకా పోగొట్టుకుంటున్నది. బలహీనమైన భ్రమల్లో తేలియాడుతున్న కొద్దిమంది ఉదారవాదులు మాత్రం కొత్తగా ఆలోచించే ధైర్యం లేక అదే వలయంలో పరిభ్రమిస్తున్నారు.
ఇక్కడ గుర్తించవలసిన ముఖ్యమైన విషయం ఒక్కటున్నది. కాంగ్రెస్ పార్టీ విధానాలు, వ్యవహారశైలి ముఖ్యంగా నెహ్రూ అనంతర కాలం నుంచి అవాంఛనీయంగా మారుతూ, అందువల్ల ఆ పార్టీ క్రమంగా బలహీనపడటం సుమారు 1970 నుంచి మొదలైనా, ఆ కారణంగా రాజకీయ శూన్యం ఏర్పడుతూ అందులోకి వేర్వేరు దశలలో వేర్వేరు పార్టీలు ప్రవేశించడం జరుగుతున్నా, ఈ యాభై ఏండ్ల (1970-2022) సుదీర్ఘకాలంలో ఆ పార్టీ ఏ ఒక్క ఓటమి తర్వాత కూడా తగువిధంగా గుణపాఠాలు నేర్వలేదు. తన విధానాలను, వవ్యవహార శైలిని తగు విధంగా మార్చుకోలేదు. బయటి అంశాలు ఏవో కలసివచ్చి, ఇతర ప్రభుత్వాలు విఫలమై, ఇతర పార్టీలకు ఏదో అవసరం ఏర్పడి, ప్రజలకు మరో ప్రత్యామ్నాయం కన్పించకనో ‘విధివశాత్తు’ మధ్య మధ్య అధికారపు లాటరీ తగలటాన్ని మినహాయిస్తే, తన విధానాలూ వ్యవహారశైలిలో తగు మార్పుల ద్వారా కలిగిన అంతర్గత శక్తితో గెలిచిన సందర్భాలు కన్పించవు. గత కొన్ని దశాబ్దాలుగా దేశానికి ఏర్పడిన ప్రధానమైన సమస్య సరైన ప్రత్యామ్నాయ విధానాలు, ఆచరణతో సరైన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక, నాయకత్వం లభించకపోవటం. ఆ శూన్యం ఇప్పటికీ ఉంది.
కాంగ్రెస్ పార్టీ విధానాలు, వ్యవహారశైలి ముఖ్యంగా నెహ్రూ అనంతర కాలం నుంచి అవాంఛనీయంగా మారుతూ, అందువల్ల ఆ పార్టీ క్రమంగా బలహీనపడటం సుమారు 1970 నుంచి మొదలైనా, ఆ కారణంగా రాజకీయ శూన్యం ఏర్పడుతూ అందులోకి వేర్వేరు దశలలో వేర్వేరు పార్టీలు ప్రవేశించడం జరుగుతున్నా, ఈ యాభై ఏండ్ల (1970-2022) సుదీర్ఘకాలంలో ఆ పార్టీ ఏ ఒక్క ఓటమి తర్వాత కూడా తగువిధంగా గుణపాఠాలు నేర్వలేదు.
ఇటీవలి కాలానికి వద్దాం. ప్రస్తుత అనధికార అధ్యక్షుడు రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర చేసినందున, ఇక తాము అధికారంలోకి రావటానికి అవకాశాలు మెరుగుపడినట్లు కాంగ్రెస్వాదులు నమ్ముతున్నారు. పైన అనుకున్న చిన్నపాటి పట్టణవాస మధ్యతరగతి వర్గం, మేధోవర్గం, ఉదారవాద వర్గం అదే ఆశ పడుతున్నది. ఇక ప్రతిపక్షాలు వేర్వేరు వాదనల మధ్య చీలిపోగా ఒకవర్గం అందుకు అనుకూలంగా ఉంది. ఇంతకూ కాంగ్రెస్ సొంతబలం 52 (2019)లో ఈ సరికి ఎంత పెరిగి ఉండవచ్చుననేది అట్లుంచితే, అన్నీ కలిసివచ్చి వారి కూటమి అధికారానికి రాగలదనే వాదన కోసం అనుకుందాము. కానీ అందువల్ల ఆ పార్టీ విధానాలు, వ్యవహారశైలి మారుతాయా అన్నది అసలు ప్రశ్న. వాజపేయి ప్రభుత్వం 2004లో పోయి తాము 2004-14 మధ్య అధికారంలో ఉన్నప్పుడు వారేమీ సమీక్షించుకోలేదు, మార్చుకోలేదు. పరిపాలనా సమర్థతను కూడా పెంచుకోలేదు. అవినీతిని అదుపు చేసుకోలేదు. పైగా ఇక తమకు ఎదురు లేదన్న అహంకారాలు పెంచుకున్నారు. మిత్రపక్షాలనే మింగజూశారు.
2014లో అధికారం కోల్పోయినాక ఈ తొమ్మిదేండ్లుగా సైతం తిరిగి అధికారం కోసం తపించటం తప్ప ఏ సమీక్షలూ, మార్పులూ లేవు. తమకు దూరమవుతూ వచ్చిన వర్గాలకు వీరిపై మళ్లీ విశ్వాసం కలగటం ఎలా, బలపరచటం ఎలా? అనగా వారికి ఏవేవో బయటి అంశాలు కలిసివచ్చి, అదృష్టవశాత్తు, అధికారపు లాటరీ తగలాలన్న మాట. ఒకవేళ అట్లా తగిలినా, వీరిలో విధాన మార్పులు, వ్యవహారసరళి మార్పులు గతంలో లేనట్లే ఇప్పుడూ ఉండగల లక్షణాలేవీ లేవు గనుక, ఆ అధికారం మళ్లీ పోదనే హామీ ఏదీ ఉండదు. అయినప్పటికీ, 2004-14లో అధికారం చేతికి రాగానే అహంకరించి మిత్రపక్షాలను దెబ్బతీయ జూసినవారు ఇప్పుడు మిత్రులు కావాలంటున్నారు. ఏ త్యాగానికైనా సిద్ధమంటూనే నాయకత్వం మాత్రం తమదని ప్రకటించి వేశారు.
రాహుల్గాంధీ 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికి 18 ఏండ్లయింది. ఇది తక్కువ సమయం కాదు, పార్టీలో తన మాటకు ఎప్పుడూ ఎదురులేదు. మధ్యలో వివిధ పదవుల్లోనూ ఉన్నారు. కానీ, ఈ 18 ఏండ్లలో పార్టీని శక్తిమంతం చేసిందేమీ లేదు. మధ్యలో పదేండ్ల పాటు కాంగ్రెస్ అధికారంతో ఉన్నా, ప్రజాదరణను పెంచటంతో తన పాత్ర శూన్యం. పైన అనుకున్నట్లు, 2014 నుంచి ప్రతిపక్ష పాత్రలో అయినా సాధించిందేమీ కన్పించదు.
పైగా పార్టీ మరింతగా బలహీనపడుతూ వచ్చింది. ఎన్నో దశలలో ఆయనకసలు రాజకీయాల్లో ఆసక్తి ఉన్నదా అనే సందేహాలు అంతటా వినిపించాయి. కనీసం ఇటీవల యాత్ర సందర్భంగానైనా ఆయన నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ తన విధానాలను, వ్యవహారశైలిని, ఇన్నేండ్ల వైఫల్యాలను సమీక్షించుకోలేదు. ఆ ప్రకారం కొత్త ఆలోచనలేవీ ప్రజల ముందుంచలేదు. రాయపూర్ ప్లీనరీలో షరామామూలు హామీలు కొన్ని ప్రకటించటం మినహా. అందువల్లనే వారివి అధికారం కోసం షరామామూలు నటనలని భావించక తప్పటం లేదు.